మనం అడగకున్నా దళితుణ్ణి ముఖ్యమంత్రి ని చేస్తానని మాటిచ్చి మోసం చేసి, నేడు మన ధలితుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తానన్న మన ముఖ్యమంత్రి కెసిఆర్ ను రాజ్యాంగ పరంగా మనకున్న ఓటు హక్కుతోనే రాజకీయంగా భూస్థాపితం చేద్దామని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్స్ లో మంగళవారం జరిగిన “రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి ” సన్నాహక సదస్సు లో జిల్లాలోని ప్రజాసంఘాలు, కుల సంఘాలు, హక్కుల సంఘాలు, పొలిటికల్ జెఎసి ల, నేతృత్వంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ,దుమాల గంగారాం అధ్యక్షతన సదస్సు జరిగింది.

రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ మంద కృష్ణ మాదిగ, తెలంగాణ ఉద్యమ రథ సారధి, తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. కోదండరాం లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మన రాష్ట్రానికి ఒక మహిళా గవర్నర్ గా రాకుంటే మంత్రివర్గంలో మహిళలకు ఈ మాత్రం చోటు దక్కేది కాదని తెలిపారు. 93 శాతం జనాభా ఉన్న ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు లేనన్ని మంత్రి పదవులు అరశాతం కూడా జనాభా లేని దొరలకు నాలుగు మంత్రి పదవులా…? అని మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా.? కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడా.? అని మంద కృష్ణ మాదిగ అన్నారు. ఒక చాయ్ వాలాను ప్రధానమంత్రిగా చేసింది భారత రాజ్యాంగమేనని, భారత దేశ సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం గుడి మెట్లు కూడా ఎక్కలేని ఇందిరాగాంధీ, రాజ్యాంగం వల్లనే దేశానికి ప్రధాన మంత్రి అయిందన్నారు. నేడు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కెసిఆర్ విడుదల చేసిన ఉద్యోగ నియామకాల్లో పెరిగిన జనాభా ప్రకారం కుల రిజర్వేషన్ల శాతం ఎందుకు పెంచలేదన్నారు. ప్రపంచ దేశాలు మొత్తం ఐక్యరాజ్య సమితిలో కూడా అంబేడ్కర్ రచించిన భారత దేశ రాజ్యాంగమే గొప్పదని తీర్మానాలు చేస్తే ,మన అహంకార ముఖ్యమంత్రి మన రాజ్యాంగమే పనికి రాదనే విధంగా ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు.
ఈ దేశంలో అర్హులైన మనందరికీ స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, కలిగాయంటే ఆనాడు అత్యంత మేధావిగా గుర్తింపబడి రాజ్యాంగాన్ని రాసే గొప్ప అవకాశాన్ని పొందిన అంబేడ్కర్ ఆశయాలే నిదర్శనం అని పేర్కొన్నారు.ఈసందర్భంగా ప్రొ. యం. కోదండరాం మాట్లాడుతూ, కుల-మత ఘర్షణల వల్ల విడిపోయి ముక్కలైన మన భారతదేశం మళ్లీ కలిసి ఒక్కటయ్యిందంటే అది అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే సాధ్యం అయిందని అన్నారు.

ఏడేండ్ల పాలనలో రాజ్యాంగాన్ని గౌరవించని ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది కెసిఆర్ మాత్రమే నని ఆరోపించారు. అత్యంత ప్రమాదకరమైన నిరంకుశ పాలన కెసిఆర్ దేనని తేల్చిచెప్పారు.
అన్ని వర్గాలకు, అగ్రవర్గంలోని నిరుపేదలకు సైతం ఈమాత్రం సంక్షేమ ఫలాలు అంది సముచిత స్థానం దక్కుతుందంటే భారత రాజ్యాంగం వల్లనే సాధ్యం అవుతుందన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని తిరగ రాస్తాననడం కెసిఆర్ స్థాయికి తగదని అన్నారు. అది అతని అహంకారానికి నిదర్శనం అని ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. ఏడేండ్ల కాలంలో ఒక్కసారి మాత్రమే నామమాత్రంగా బీడీ కార్మికుల రేట్లు పెంచి చేతులు దులుపుకొన్నారని అన్నారు. భారత దేశంలో అందరికీ, రిజర్వేషన్లను బట్టి తగు న్యాయం జరుగుతుందని, రాజ్యాంగ బద్ధమైన ఈ రీజర్వేషన్లే లేకపోతే బడుగు, బలహీన, ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు ఈమాత్రం స్వేచ్చ – స్వాతంత్రం లభించేది కాదన్నారు. వీటన్నిటినీ కాల రాసి తన పాలనలో కెసిఆర్ తన అహంకార భావంతో వీటిని రద్దు చేసి మన హక్కులను, మన స్వేచ్ఛను, మనలను దోచుకునేందుకు కుట్రలో భాగంగానే కెసిఆర్ నోటా రాజ్యాంగ రద్దు, రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా అనే మాటలు వచ్చాయని కోదండరాం సూచించారు.
ఈసదస్సుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అక్కినపెళ్లి కాశీనాథమ్, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, బిసి సంక్షేమ సంఘాల జిల్లా అధ్యక్షులు జీకూరి శ్రీహరి, గాజుల నాగరాజు, బిసి నాయకులు భార్గవ్, ఎమ్ ఎస్ పి, ఎమ్మార్పీఎస్, వివిధ ప్రజా సంఘాల నాయకులు బెజ్జంకి సతీష్, చిట్టపెళ్ళి లక్ష్మణ్, సురుగు శ్రీనివాస్, మోకినపెళ్లి రాజమ్మ, శనిగరపు కాంతమ్మ, కాళ్ళ రాజయ్య, ఏలీయా, చిలుముల లక్ష్మణ్, గడప చంద్రశేఖర్, బనాల రామస్వామి, రాజాం, దుర్గయ్య, రాజయ్య, పెద్దిరాజ్, మహేష్, కరుణాకర్, నక్క సుప్రియ, ఎర్రం అనూష, తదితరులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.