J.Surender Kumar,
ధర్మపురి పోలీస్ స్టేషన్ ను ఆదివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెళ్లి రికార్డులను తనిఖీ చేయనున్నారు.
ఈ మేరకు పోలీసు యంత్రాంగం స్టేషన్ ఆవరణను శుభ్రపరుస్తూ , స్వామి వెంట తరలివచ్చే మందీ మార్బలకు సౌకర్యాల కల్పన కోసం భారీ ఏర్పాట్లను చేస్తున్నారు.
దేశంలో ఏ ప్రాంతంలో లేని ఈ విధానం ధర్మపురి పుణ్యక్షేత్రంలో అనాదిగా ఆచార ,సాంప్రదాయం గా కొనసాగుతున్నది. ప్రతి సంవత్సరం క్షేత్రంలో శాంతిభద్రతల సమస్యలు, నమోదైన కేసులు, ఆయుధాల ఇతర వివరాలు సమస్యలను, రికార్డులను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తనిఖీ చేయువిధానం అనాదిగా కొనసాగుతున్నది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా స్వామి వారి కళ్యాణ మహోత్సవం రెండవ రోజు స్థానిక కోనేటిలో తెప్పోత్సవం, డోలోత్సవం జరుపుకొని స్వామి వారు ఆదివారం సాయంత్రం ” దక్షిణా దిగ్యా యాత్ర” లో భాగంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లడం ఆనవాయితీ.

పోలీస్ ఉన్నతాధికారులు ,స్టేషన్ బాధ్యులు శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ఆహ్వానం పలకడానికి మేళతాళాలు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి పూజా కార్యక్రమలు నిర్వహించి ఘనంగా స్వామివారిని పోలీస్ స్టేషన్ ఆహ్వానిస్తారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మామిడి తోరణాలు కట్టి, ముగ్గులు వేసి. సాంప్రదాయ దుస్తులు ధరించి, పోలీసులు వారి కుటుంబ సభ్యులు మంగళ హారతులతో,స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం స్వామివారి ఆశీస్సులు పొందడం ఇక్కడ జరుగుతున్న పద్ధతి. సంవత్సరంలో ఒకసారి నరసింహస్వామి పోలీస్ స్టేషన్ రావడం, మా పోలీసు కుటుంబాలు స్వామివారికి ప్రత్యేక పూజలు, నిర్వహించడం మమ్మల్ని మా కుటుంబ సభ్యులు ఆశీర్వదించడం ఈ స్టేషన్ లో పనిచేసే పోలీస్ సిబ్బంది పూర్వజన్మసుకృతం అని పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.