నక్కలపెట్ ఎన్కౌంటర్ కు నేటికీ 37 ఏళ్లు !
J.Surender Kumar,
పీపుల్స్ వార్ , మావోయిస్టు పార్టీగా, రూపాంతరం చెందినప్పటికీ, మూడున్నర దశాబ్దాల క్రితమే, తమ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి, ప్రయత్నించిన వారిని టార్గెట్ చేయడం, ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను, పోలీసు అధికారులను, హతమార్చడం కోసం, మందుపాతరలు పేల్చి, సామూహిక శత్రుసంహారంకు శ్రీకారం చుట్టింది, ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధి నక్కల పేట గ్రామ శివారులో జరిగిన ఎన్కౌంటర్ కారణమా ? ప్రతీకార పోలీస్ హత్యలకు శ్రీకారం చుట్టిందా ? ఈ ఎన్ కౌంటర్ అనే చర్చ సంఘటనలను బట్టి అవుననే చెప్పాల్సి వస్తుంది.
వివరాల్లోకి వెళితే.
పీపుల్స్ వార్ పార్టీ, ఉద్యమం ఉధృతంగా ఎగిసిపడుతున్న తరుణంలో. ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధి, జైన గ్రామానికి చెందిన నక్సలైట్ తుమ్మ లక్ష్మీ నరసయ్య , పోలీసులకు మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ . 1985 మే 25 న చిన్న నక్కల పేట గ్రామ పరిసరాల్లో, ఓ ఇంటిలో లక్ష్మీ నరసయ్య ఉన్నట్టు పోలీసులకు ఖచ్చితమైన సమాచారం అందింది.. చడీ చప్పుడు కాకుండా పోలీసు బృందం ఆ ఇంటిని చుట్టుముట్టారు. తమ చుట్టూ పోలీస్ వలయం మాటువేసి ఉన్నారు అనే సమాచారం తెలుసుకున్న నక్సలైట్ లక్ష్మి నరసయ్య, కొన్ని గంటల పాటు నిశ్శబ్దంగా ఆ ఇంట్లోనే ఉన్నాడు. పోలీసులు లొంగి పొమ్మని పదే పదే అభ్యర్థించారు. ఈ దశలో లక్ష్మీ నరసయ్య, తెలివిగా తన వద్ద ఉన్న ఆయుధంను, తనతో మాట్లాడడానికి వచ్చిన జైన గ్రామానికి చెందిన గుడ్ల నారాయణ , అనే వ్యక్తికి తుపాకీ అప్పగించి, ‘పోలీసులు చుట్టుముట్టారు ,నీవు వెనుక వైపు నుంచి ఈ ఆయుధంతో పారిపో, నేను పోలీసులతో పోరాడుతాను ‘. అంటూ నారాయణ ను ఇంటి వెనుక వైపు నుంచి బయటకు పంపినట్టు చర్చ. ఆయుధంతో పరుగెడుతున్న, అమాయకుడు నారాయణ ను నక్సలైట్ అనుకొని అతని చేతిలో ఆయుధం (తుపాకీ ) ఉండటంతో పోలీసులకు అతడే నక్సలైట్, లక్ష్మీ నరసయ్య అనుకొని ( అంత వరకు లక్ష్మీనరసయ్య ఫోటో గాని , కదలిక గాని పోలీసులకు తెలియదు. స్వగ్రామం జైన కానీ కొత్తగూడెంలో విద్యాభ్యాసం చేశాడు) .లొంగి పొమ్మని హెచ్చరించిన వినక పోవడంతో కాల్పులు నారాయణ మృతి చెందాడు.

ఇంటికి మరోవైపు ద్వారం నుంచి లక్ష్మీ నరసయ్య తప్పించుకొని పారిపోతుండగా, స్పెషల్ పార్టీ కి చెందిన ఇద్దరు పోలీసులు కోమల్ రెడ్డి, దేవేందర్ రెడ్డి లు నక్సలైట్ లక్ష్మీ నరసయ్యను వెంటాడారు. ఒకరి వెంట ఒకరు పంటచేలలో పరుగులు పెట్టారు. దాదాపు ఐదారు కిలోమీటర్లు దూరం గోదావరి నది, వైపు పరుగులు తీశారు. సాయంత్రం వేళ పశువులు, బర్రెలు ,ఆవులు గ్రామాల్లో కి తిరిగి వస్తున్న సమయంలో ,పశువులను, మందను అడ్డుపెట్టుకొని గోదావరి నది గుండా నక్సలైట్ లక్ష్మీనరసయ్య తప్పించుకున్నాడు.
కానిస్టేబుల్ కాల్చివేత !

తనను వెంటాడి,తన స్నేహితుడిని ఎన్కౌంటర్లో కాల్చిచంపిన పోలీసులను, హతమార్చడం కోసం లక్ష్మీ నరసయ్య ,తనను వెంటాడిన పోలీసుల కదలికలపై నెల రోజుల పాటు, ధర్మపురిలో రెక్కీ నిర్వహించాడు. తనతో పాటు మరో నక్సలైట్, ఖదీర్ ను వెంటబెట్టుకొని బస్టాండ్ లో ( గతంలో బస్సులను నిలిచిన చోటు ) సాయంత్రం వేళ .ఓ హోటల్ లో గోదావరి స్నానానికి వచ్చిన భక్తుల వలె, టీ తాగుతూ ఇద్దరు నక్సలైట్లు దాడికి సిద్ధంగా ఉన్నారు. 1985 జూలై 23 న కానిస్టేబుల్స్ ఇద్దరు రాకకై ఎదురు చూస్తున్నారు. ( పక్కనే ఓ పాన్ డబ్బా ఉంది నిత్యం అదే పాన్ డబ్బా వద్ద కోమల్ రెడ్డి పాన్ తీసుకుంటాడు. టీవీఎస్ వాహనంపై పాన్ డబ్బా వద్దకు వచ్చి వాహనం పై నే ఉండి పాన్ కట్టించుకున్నాడు.) తుమ్మ లక్ష్మీనరసయ్య , ఖదీర్,. కానిస్టేబుల్ కోమటిరెడ్డికి ఎదురుగా వెళ్లి పాయింట్ బ్లాంక్ రేంజిలో విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో, కోమల్ రెడ్డి అక్కడికక్కడే కుప్పకూలాడు. నినాదాలు చేస్తూ, కోమల్ రెడ్డి, రక్తాన్ని చేతుల్లో తీసుకుని గాల్లోకి ఎగరేసి, అతడి వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్ తీసుకొని గోదావరి వైపు ఇద్దరు నక్సలైట్లు పరుగులు తీశారు.

కాల్పులు జరుపుతున్న సమయంలో పాన్ డబ్బా నిర్వాహకుడి,బుల్లెట్లు గాయాలు తగిలాయి. కొందరు యువకులు, నక్సలైట్ల వెంట పట్టుకోవడానికి పరిగెత్తారు. మీరు మమ్మల్ని పట్టుకోవద్దు, అంటూ సాయిబాబా సినిమా టాకీస్, వద్ద నేలపై రెండు, మూడు, రౌండ్లు కాల్పులు జరిపారు, రాళ్ళకు బుల్లెట్లు తగిలి .చిన్న చిన్న రాళ్లు. యువకులకు తగిలి గాయాలయ్యాయి. నక్సలైట్లు చెరువు కట్ట పైనుంచి కా శెట్టి వాడ కుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దాటి, గోదావరి నది గుండా పరుగులు తీసి తప్పించుకున్నారు. ఈ సంఘటనతో ఖంగుతిన్న పోలీసులు (అద్దె ఇళ్లలో ఉండే వారు) అప్పుడు ధర్మపురి సిఐ గా, కృష్ణారావు విధులు నిర్వహించే వారు. వెంటనే తన నివాసం అద్దె ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ కు మార్చారు. అప్పటి ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్ట కింది గ్రామాలు దాదాపు 50 వరకు ఉండేవి. ధర్మపురి పట్టణంలో పరిసర గ్రామాల్లో 18 సంవత్సరాల యువకుల మొదలుకొని వృద్ధుల వరకు విచారణ పేరుతో స్టేషన్కు పిలిపించి చిత్రహింసలకు గురి చేశారు. దాదాపు అర ఫర్ లాంగ్, పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడను వెట్టిచాకిరి తో ఎస్సై సోమిరెడ్డి పెట్టించాడు. యువకులు ,విద్యార్థులు , 50 సంవత్సరాల లోపు వారు ధర్మపురి వదిలి పారిపోయారు. దొరికిన వారిని రోజుల తరబడి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి నక్సల్ సమాచారం కోసం చిత్రహింసలకు గురిచేశారు. కానిస్టేబుల్ చనిపోయిన రాత్రి ధర్మపురి పట్టణానికి చెందిన ఓ యువకుని పోలీసులు కిడ్నాప్ చేశారు. ఆ యువకుడు చాకచక్యంగా వారి చెర నుంచి అదే రాత్రి తప్పించుకున్నాడు. అడవి మార్గం గుండా అప్పటి కరీంనగర్ ఎస్పీ అశోక్ ప్రసాద్, వద్దకు ఓ రాజకీయ నాయకుడి, సహకారంతో చేరుకొని పరిస్థితిని వివరించారు. ధర్మపురి పట్టణంతో పాటు,పరిసర గ్రామాల్లో భయం,భయంగా ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనల తో ప్రజలు కొన్ని నెలలపాటు జీవనం కొనసాగించారు.

( కొండపల్లి విడుదల కోసం నాడు హత్య !
1984 లో పోలీసు కస్టడీలో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వార్ వ్యవస్థాపకులు కొండపల్లి సీతారామయ్య ను, తప్పించడానికి ఆయనకు కాపలాగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ను హతమార్చి, సీతారామయ్య ను 6గురు నక్సల్స్ ఆస్పత్రి నుంచి తప్పించడానికి ఉమ్మడి రాష్ట్రంలో మొదటి కానిస్టేబుల్ హత్య జరిగింది ).
ప్రతీకార హత్యల పరంపర

ధర్మపురి సంఘటనతో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలీసుల పై ప్రత్యేక దాడులకు, నక్సల్స్ వేట ఆరంభించారు. పెద్దపల్లి డి ఎస్ పిగా పనిచేస్తున్న బుచ్చిరెడ్డి నీ నక్సల్స్ కాల్చి చంపారు. 1989 సెప్టెంబర్ లో పోలీసు అధికారులను హత మార్చడానికి బీర్పూర్ మందుపాతర పేల్చివేత వికటించడంతో 14 మంది అమాయక ప్రజలను మృతి చెందారు. 1991 డిసెంబర్ 19న హుస్నాబాద్ మండలం రామవరం, వద్ద నక్సల్స్ పేల్చిన మందుపాతర లో సిఐ యాదగిరి , ఎస్ ఐ జాన్ విల్సన్ ,.మరో ఇద్దరు కానిస్టేబుళ్లు చనిపోయారు. 1993 అక్టోబర్ 12 న ధర్మపురి మండలం నేరెళ్ల, బట్ట పెళ్లి వద్ద నక్సల్స్ పేల్చిన మందుపాతరలో, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబులు, రాజయ్య, శ్రీనివాస్, ప్రకాష్ లు మృతిచెందారు.

1992 సెప్టెంబర్ 2న ముత్తారం మండలం గాజులపల్లి, వద్ద మందుపాతర పేల్చి సివిల్ పోలీసులు, కాకుండా నక్సల్స్ ఏరివేత కోసం వచ్చిన ఇండో టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ పోలీసులు 9 మంది మృతి చెందారు. 1994 లో ఎన్నికల బందోబస్తు కోసం వచ్చిన పంజాబ్ కమాండోల ను మహదేవ్ పూర్ మండలం లంకల గడ్డ, వద్ద మందుపాతర పేల్చి నక్సల్స్ హతమార్చారు. ఈ సంఘటనలో కమాండెంట్, గురు దీప్ సింగ్ సాయి, అసిస్టెంట్ కమాండెంట్, సివిల్ ఎస్ ఐ ,వై వెంకటస్వామి, మరో ఐదుగురు మృతి చెందారు. 1999 ఎన్నికలలో రిపోలింగ్ బందోబస్తు కోసం ,వెళుతున్నా పోలీసు బృందం మహా ముత్తారం మండలం దుబ్బ లపాడు ,వద్ద మందుపాతర పేల్చిన నక్సల్స్ ఆర్.ఎస్.ఐ సంజీవరెడ్డి, తోపాటు మరో ముగ్గురు కానిస్టేబుల్లు హతమయ్యారు.

1998 సెప్టెంబర్ 13న మెట్టు పల్లి మండలం ఆత్మకూరు, లో నక్సల్స్ కాల్పులు జరిపి జగిత్యాల కానిస్టేబుల్ రవీందర్ నాయక్ ను చంపారు. 1990 మార్చి 9న మేడిపల్లి మండలం ఒడ్డడు, గ్రామంలో నక్సల్ కాల్పుల్లో కానిస్టేబుల్ రాజన్న, కోహెడ మండలం సింగరాయకొండ జాతరాలో కానిస్టేబుల్ ప్రకాష్ సింగ్ ను కాల్చిచంపారు. 1991 ఫిబ్రవరి 9న. భూషణ రావు పేట, లో జరిగిన ఎదురు కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ ఫసల్ ఉద్దీన్, కానిస్టేబుల్ , మోహినుద్దీన్ మృతిచెందారు. 1991 సెప్టెంబర్ 10న జగిత్యాల మండలం కల్లెడ, సమీపంలోని కుక్కల గుట్ట వద్ద, నక్సల్స్ పోలీసుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్, మోబిన్, మృతి చెందాడు. 1993 జూన్ 14న మలహార్ మండలం, ఎడవల్లి, వద్ద అ మందుపాతర పేల్చడంతో ఎస్ఐ, సుభాన్ మృతి చెందాడు. 1993 జూలై 8 న వరంగల్, కరీంనగర్ జిల్లా సరిహద్దు భూపాలపల్లి,సమీప అటవీ మార్గంలో నక్సల్స్ పేల్చిన మందుపాతర లో ఏ ఆర్ ఎస్ ఏ వెంకటాచారి, హెడ్ కానిస్టేబుల్, నాగభూషణం , కానిస్టేబుల్లు కిషన్ రావు, రవీందర్, దేవయ్య లు మృతి చెందారు. 1994 అక్టోబర్ 28 న నక్సల్స్ జరిపిన కాల్పులు గంభీరావుపేట ఎస్ ఐ, ఎన్ డి సాబీర్ ఖాన్ ,మృతి చెందారు. 2003 ఫిబ్రవరి 11న కోనరావుపేట మండలం వట్టెంల, తండాకు విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన కానిస్టేబుల్స్ నాయక్, కృష్ణ లను, నక్సల్స్ కాల్చి చంపారు.

ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధి నక్కల పేట లో 1985 మే 25న జరిగిన ఎన్కౌంటర్ తరువాత నాటి వార్ నక్సల్స్ ప్రతీకార హత్యలకు శ్రీకారం చుట్టినట్టు జరిగిన సంఘటనల నేపథ్యంలో. భావించవచ్చు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నక్సల్స్ ఉద్యమాన్ని ఉక్కు పాదంతో . అంతం చేయుటకు. పోలీసులు,పోలీస్ అధికారులు, ఎనలేని విలువ కట్టలేని ప్రాణ త్యాగాలు చేసి తమ కుటుంబాలను అనాధలుగా చేసి, శాంతి భద్రతల పరిరక్షణలో వారు సమిధలు అయ్యారు అని చెప్పక తప్పదు.