J.Surender Kumar,
‘తెలంగాణలో పాగా వేసి, కాషాయ జెండా ఎగురవేయాలని. ఉత్సాహంగా ఉరకలు వేస్తున్న బిజెపి పార్టీ అధిష్టానం మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు వైపు దృష్టి సారించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆరు నూరైనా. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కృత నిశ్చయంతో ఉన్న బీజేపీ అధిష్టానం గత కొంతకాలంగా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
రాష్ట్రానికి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా , కేంద్ర మంత్రులు, సమయం సందర్భాలను సృష్టించుకొని రాష్ట్రంలో పలుమార్లు పర్యటించడం, గ్రేటర్ కార్పొరేటర్ లను ఢిల్లీకి ప్రధాని పిలిపించుకొని స్వయాన వారితో గంటలపాటు చర్చించడం, బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ను, ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేయడం, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిలను గత రెండు రోజుల క్రితం హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించుకొని రాష్ట్ర రాజకీయాలపై చర్చించడం, మరుసటి రోజు డాక్టర్ లక్ష్మణ్ హోం మంత్రితో చర్చలు, జూలై మొదటి వారంలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహణ , రెండు రోజులపాటు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా లు ఇక్కడే మకాం. 17 మంది బిజెపి ముఖ్యమంత్రులు, దాదాపు 350 మంది కార్యవర్గ సభ్యులు. హైదరాబాద్ కు రానున్న విషయం తెలిసిందే. సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంతో గులాబీ బాస్ కు బిజెపి అధిష్టానం కు మధ్య ఏర్పడిన రాజకీయ వివాదం విదితమే. లక్షలాది మంది శిష్యగణం గల శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి, ప్రముఖ పారిశ్రామిక వేత్త టీవీ ఛానల్ అధినేత మై హోమ్ రామేశ్వరరావు గులాబీ బాస్ మధ్య మైత్రి సంబంధం గత కొన్ని నెలలుగా ప్రచార సాధనాల్లో కనిపించడం లేదు. దీనికితోడు రెండు వేల కోట్ల నిధులతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం, సమయంలో అన్నీ తానై అక్కడ వాస్తు ,సాంప్రదాయ పూజా విధానం, సుముహూర్త లను, ఉత్సవాలను ఖరారు చేసిన శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ ప్రారంభోత్సవానికి ప్రభుత్వం స్వామి నీ ఆహ్వానించకపోవడం తెలిసిన విషయం. ఈ ఉదంతాలు నేపథ్యంలో బీజేపీ అధిష్టానం సాగర్ జి వైపు దృష్టి సారించడం తో పక్కాగా పకడ్బందీగా, వ్యూహాత్మకంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి ఉండి ఉండవచ్చు అనే చర్చ నెలకొంది.
సాగర్ జీ వైపు ఎందుకంటే ?
బిజెపి తో టిఆర్ఎస్ కి వడ్లు కొనుగోలు అంశంతో మొదలుకొని, అనేక సందర్భాల్లో రాజకీయంగా గులాబీ పార్టీ బీజేపీ తో అమీ తుమీ అంటూ పోటీ పడుతు బిజెపిపై, అగ్రనాయకత్వం పై ,ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే .. రాష్ట్రంలో రాజకీయాలను శాసించే బలమైన కెసిఆర్ సామాజికవర్గానికి, చెందిన సాగర్ జీ కి ప్రజలతోపాటు పార్టీ క్యాడర్ లోను, ఆయన సామాజిక వర్గం లో నేటికీ మంచి పట్టు ఉంది. 1980 నుంచి 2004 వరకు ఆయన సామాజిక వర్గానికి రాజకీయంగా, మిగతా అన్ని రంగాల్లోనూ వారికి కి గాడ్ ఫాదర్ గా సాగర్ జీ కి గుర్తింపు ఉంది. నాటీ ఆయన క్యాడర్ లో కొందరు ప్రస్తుతం కీలక నాయకులు, ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారు.
ఒక్క ఓటు రెండు రాష్ట్రాల తీర్మానం సాగర్ జి హాయంలో !
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న సాగర్ జీ హయంలో కాకినాడలో జరిగిన బిజేపి కార్యవర్గ సమావేశంలో “ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు” తీర్మానం చేసి రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఆయన బిజెపి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో, వివిధ రాజకీయ పార్టీలతో పొత్తులు, పెట్టుకుని బిజెపి పార్టీకి 12 అసెంబ్లీ సీట్లను, 7 పార్లమెంటు సీట్లను గెలిపించుకుని క్రియాశీల రాజకీయ చతురతను, నిర్వహించిన తీరు నేటికీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచింది.
సాగర్ జీ చొరవ తో గోదావరి జలాల వినియోగం !
మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులతో ముడిపడి ఉన్న పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు ప్రాణహిత-చేవెళ్ల, ఇచ్చంపల్లి, తదితర ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాల ప్రతిబంధకాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రివర్గ సభ్యులతో, అప్పటి మహారాష్ట్ర సీఎం , ఫండవిస్, మహారాష్ట్ర రాజ్ భవన్ లో జరిగిన చర్చలు సఫలం కావడం లో సాగర్ జీది కీలకపాత్ర అనే చర్చ ఉంది, కాకతాళీయంగా చర్చలు జరిగిన రోజు ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు అదే కావడంతో రాజ్ భవన్ లో కెసిఆర్ పుట్టినరోజు వేడుకలను నాడు సాగర్ జి ఘనంగా జరిపారు.
బిజెపి కి నమ్మిన బంటు !
“మీసా” చట్టం నమోదు అరెస్ట్ !
1975 సంవత్సరంలో దేశంలో విధించిన ఎమర్జెన్సీ నీ బహిరంగంగా వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన సాగర్ జీని, పోలీసులు కరీంనగర్ పరేడ్ గ్రౌండ్లో, జనం ముందు లాఠీలతో, తుపాకీ బాయినెట్స్ తో చితకబాది తీవ్ర రక్త గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ఆయన పై “మీ సా” కేసు పెట్టి అరెస్టు చేసి వరంగల్ జైల్లో సంవత్సరకాలం నిర్బంధించారు.
ప్రజాక్షేత్రంలో…
1977 లో కేంద్రంలో ఏర్పడిన జనతా పార్టీకి కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన సాగర్ 1980 లో జనతా పార్టీ నుంచి జనసంఘ్ నాయకులు విడిపోయి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసిన సందర్భంలో ఆయన బిజెపిలో చేరి, జిల్లా తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలలో పార్టీ విస్తరణకు కృషి చేశారు. నక్సలైట్లకు, ఉగ్రవాదులకు, కొరకరాని కొయ్యగా మారి టార్గెట్ అయ్యారు. 1977లో తొలిసారి జిల్లాలోని మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు లో భాగంగా మెట్టుపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 372 స్వల్ప ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన సాగర్ జి..2004 ఎన్నికల వరకు ఓటమి ఓటమి ఎరుగలేదు. 1989 , 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ను అదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, శాసనసభలో ఆ పార్టీ పక్ష నేతగా కొనసాగారు. 1998, 1999, పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి విజయం సాధించి, ప్రధాని వాజపేయి మంత్రివర్గంలో, మంత్రి పదవులు అలంకరించారు. 2004 – 2006 పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల ఎమ్మెల్యేగా, 2014లో కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004 నుంచి 2014 వరకు బిజెపి పార్టీ పక్షాన గోదావరి నది జలాల వినియోగం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పనుల కోసం పాదయాత్ర లు చేశారు. Jeeyar trust ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రలు ఏర్పాటు తదితర అంశాలలో. ట్రస్టుకు చేయూత నందించారు . సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మొట్టమొదట డిమాండ్ చేసిన ఘనత ఆయనదే.
పటేల్ విగ్రహ కమిటీ కన్వీనర్ గా !
నాటి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలో తలపెట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ప్రతిష్టాపన అవసరమైన ఇనుము సేకరణకు ఉమ్మడి రాష్ట్రంలో బిజెపి పార్టీ పక్షాన ఏర్పాటైన కమిటీకి సాగర్ జీ నీ ఆ పార్టీ అధినాయకత్వం కన్వీనర్ గా నియమించింది. బిజెపి పార్టీ అగ్ర నాయకులు వాజ్ పెయ్, అద్వానీ ,మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ,రాజ్నాథ్ సింగ్ ,వెంకయ్యనాయుడు ,. నరేంద్ర మోడీ అమిత్ షా ,ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ , జన సంఘం నాయకులతో పాటు పలువురు బీజేపీ పార్టీ వ్యవస్థాపక నాయకులతో స్నేహ సంబంధాలు ఉన్నాయి.

మహారాష్ట్ర గవర్నర్ గా!
నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా, ప్రముఖ న్యాయవాది గా, తన కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రాకుండా, తాను కొనసాగుతున్న పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా, ఎన్నికల్లో గెలిచినా, ఓడినా, పార్టీని వీడకుండా అధికార పార్టీలో చేరకుండా, క్రమశిక్షణ గల కార్యకర్తగా నాయకుడిగా, రాజ్యాంగం పై.అవగాహన, పట్టు మూడున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానం గల చెన్నమనేని విద్యాసాగర్ రావును ( సాగర్ జీ ) మోడీ ప్రభుత్వం 2014 , ఆగస్టు , 30న దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్ర గవర్నర్ పదవిని కట్టబెట్టి గౌరవించింది. దీనికితోడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన సాగర్ జీ కి గల బలమైన సామాజిక వర్గం, క్యాడర్ ను బిజెపి అగ్రనాయకత్వం పరిగణనలోకి తీసుకొని సరైన సమయంలో సాగర్ జీ తో తెలంగాణలో బిజెపి అధికారం హస్తగతం చేసుకోవడం కోసం. చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముందా ? తర్వాత నా ? తెలియదు కానీ సాగర్ జీ సలహాలు, సూచనలు, రాజకీయ ఎత్తులు, తటస్థ చేరికలు తదితర అంశాల్లో కేంద్ర ,నాయకత్వం సాగర్ జీ తో చర్చలు జరపడం ఖాయంగా చర్చ మొదలైంది.