ప్రభుత్వం ‘ గల్ఫ్ బోర్డును’ ఏర్పాటు చేయాలి!
మంత్రి కేటీఆర్ కు వినతి పత్రం!
ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్,


తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 15 లక్షల మంది గల్ఫ్‌ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఓమన్, ఖతర్, కువైట్‌, బహ్రెయిన్ దేశాలతో పాటు మలేషియా, సింగపూర్, అఫ్గానిస్తాన్, ఇరాక్, లిబియా తదితర దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లారు. వీరందరి సంక్షేమం కోసం గల్ఫ్ బోర్డుఏర్పాటు చేయాలి. అంటూ ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షుడు తోట ధర్మేందర్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ కు శుక్రవారం రాత్రి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.
ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి
కరోనా సందర్బంగా గల్ఫ్ తదితర దేశాల నుండి వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి యాజమాన్యాల నుండి రావలసిన జీతం బకాయిలు, బోనస్, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి ‘ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్’ (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) రాబట్టుకోవడం వారి హక్కు. దీనికి బాధితుల పక్షాన ప్రభుత్వం నిలబడి న్యాయ సహాయం అందించి కార్మికులను ఆదుకోవాలి అని వినతి పత్రంలో పేర్కొన్నారు.


వారు పేర్కొన్న ముఖ్యమైన డిమాండ్లు ఇలా ఉన్నాయి!


● గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి.
● గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికులకు వీసా చార్జీలు, రిక్రూట్మెంట్ ఫీజులు తదితర ఖర్చులకోసం పావలా వడ్డీ రుణాలు ఇవ్వాలి.
● గల్ఫ్ లో చనిపోయిన కార్మికులకు రైతు బంధ, రైతు బీమా లాంటి రూ. 5 లక్షల “గల్ఫ్ ప్రవాసీ బీమా” పథకం ప్రవేశపెట్టాలి. ఈ పథకం ప్రవేశపెడితే ప్రభుత్వంపై ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) భారం ఉండదు.
● విదేశాలకు వెళ్లి నష్టపోయి తిరిగి వచ్చిన వారిని ఆదుకోవడానికి కార్మికులు నైపుణ్యం మరియు అనుభవాన్ని ఉపయోగించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు సబ్సిడీతో కూడిన రుణాలను ఇచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలను తక్షణం కల్పించాలి. వాపస్ వచ్చినవారు జీవితంలో స్థిరపడటానికి పునరావాసం, పునరేకీకరణ కొరకు ప్రత్యేక పథకం రూపకల్పన చేయాలి.
● జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం.
● హైదరాబాద్ లో ప్రవాసీ భవన్ ఏర్పాటు.
● తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి. ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణం వంటి పథకాలను వర్తింపజేయాలి.
● 24 గంటల హెల్ప్ లైన్ (సహాయ కేంద్రం) ఏర్పాటు చేయాకి.
● విదేశాల్లో ఉన్న వలసకార్మికులు, ఉద్యోగులు, వృత్తినిపుణులు, విద్యార్థుల రిజిస్ట్రేషన్ కొరకు ‘ప్రవాసి తెలంగాణ’ వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయాలి .
● ధనవంతులైన ఎన్నారైలు గ్రామాలను దత్తత తీసుకునేలా ప్రోత్సాహించాలి.
● గల్ఫ్ లోని ప్రవాస తెలంగాణీయులకు ఒక వేదిక కల్పించడానికి, రాష్ట్రంతో బంధం ఏర్పరచడానిక వార్షిక ప్రవాసి వేడుకను నిర్వహించడానికి ‘గల్ఫ్ ప్రవాసి తెలంగాణ దివస్’ ను జరుపాలి. సమస్యలను చర్చించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. వివిధ రంగాలలో సేవలందించిన ప్రవాసీలకు అవార్డులను ప్రధానం చేయాలి.
● గల్ఫ్ ఎన్నారైలు తమ అమూల్యమైన ఓటు హక్కును ఆన్ లైన్ ద్వారా వినియోగించుకునేలా చేయాలి.
సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి త్వరలో గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానంటూ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని అధ్యక్షుడు ధర్మేందర్ వివరించారు.