పోలీసులతో పాటు, అమరులైన అమాయక ప్రజలు


పోలీస్ అమరుల వారోత్సవాల సందర్భంగా..


( J. Surender Kumar )
నక్సలైట్ అగ్ర నాయకులకు, నక్సలిజంకు పుట్టినిల్లుగా పేరుగాంచిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పోలీసు వర్గాలకు నక్సల్స్ కు మధ్య జరిగిన ప్రత్యక్ష పోరులో ప్రజా ప్రతినిధులు, ప్రజలు, చోటా మోటా రాజకీయ పార్టీల నాయకులు, సమిధలుగా మారి సతమతమవడంతో పాటు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.


గురితప్పిన వార్ తూటాలకు అమాయకులు బలి !
పోలీసులకు, నక్సల్స్ కు, నాడు జరిగిన పరోక్ష, ప్రత్యక్ష యుద్ధంలో నక్సలైట్లు, పోలీసులు, అంటే ఎవరో తెలియని ఎందరో అమాయకులు తుపాకి తూటాలకు ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ అధికారులే, లక్ష్యంగా నక్సలైట్లు బీర్పూర్ గుట్టలో పేల్చిన మందు పాతర సంఘటనలో 14 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిశాయి. జగిత్యాల కళాశాల గ్రౌండ్లో ఉన్న యువకుడిని, తమ టార్గెట్ అనుకొని భ్రమపడి నక్సల్స్ A.K 47 తో జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో పరమేశ్వర్ రెడ్డి, అనే అమాయక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. టెలిఫోన్ శాఖ ఉద్యోగి వేల్పురి ఆడం, రమేష్ బాబు, మధుకర్ రెడ్డి అనే ఉపాధ్యాయుడికి తుపాకీ తూటాలు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. ధర్మపురిలో కానిస్టేబుల్ కోమల్ రెడ్డినీ నక్సల్స్ కాల్చి చంపిన సంఘటనలో, పాన్ డబ్బా నిర్వహిస్తున్న ఇక్బాల్ తో పాటు అనేకమంది యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మల్యాల మండలం లోని తక్కలపల్లి. గ్రామంలో నక్సలైట్లకు టార్గెట్ అయినా ముదుగంటి రామ్ రెడ్డికి , బదులుగా ఆయన సోదరుడు, దశరథరెడ్డిని, రామ్ రెడ్డి గా భావించి హతమార్చారు

A advertisement

. ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధి నేరెళ్ల గ్రామంలో, రిటైర్డ్ ఎస్పీ రమేష్ బాబు, ఇంటిని నక్సల్స్ 1994, జులై లో రాత్రి పేల్చివేశారు. .అదే సమయంలో గ్రామంలోకి వస్తున్న కిరాయి జీవును, పోలీస్ జీప్ గా, భావించి నక్సల్స్ కాల్పులు జరిపారు. జగిత్యాల్ పట్టణానికి చెందిన జీప్ డ్రైవర్, ఎం.డి ఫాయిం, తుపాకీ తూటాలకు, స్టీరింగ్ పై ప్రాణాలు వదిలాడు. వెలుగొండ గ్రామానికి చెందిన వెంకటేశం, అనే వ్యక్తికి కడుపులో నుంచి బుల్లెట్ దూసుకు వెళ్ళింది. జగిత్యాల ఆస్పత్రి నుంచి తమ బంధువులను రాత్రి కిరాయి జీపులో నేరెళ్ల గ్రామానికి వస్తుండగా గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.. 1997 జనవరి లో. బీర్పూర్ గుట్టలో నక్సల్స్ కు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ‘వంట చెరుకు’ కోసం అడవికి వెళ్ళిన నారాయణ గౌడ్ అనే వ్యక్తి .తుపాకి తూటాలకు నేలకొరిగాడు. 1991 డిసెంబర్లో బిఎస్ఎఫ్ జవాన్లను హతమార్చేందుకు నక్సలైట్లు. హుస్నాబాద్ మండలం రామవరం, వద్ద పేల్చిన మందు పాతర సంఘటనలో ఏడుగురు పోలీసులతో, సహా వారి వెంట వెళ్లిన 9 మంది అమాయకులు మృతి చెందిన విషయం విధితమే.


నరకయాతన పడ్డారు!


నక్సలైట్లకు సహాయ సహకారాలు అందిస్తున్నారు, భోజనాలు పెడుతున్నారని,. ప్రజా ప్రతినిధులను, చోటామోటా రాజకీయ నాయకులను పోలీసుల వేధింపులు, పోలీసులు పట్టుకున్న తమ సానుభూతి పరులను, మిలిటెంట్లను విడిచిపెట్టడం లేదని, వారిపై కేసులు నమోదు చేస్తున్నారని, వారిని పోలీసులకు లొంగుబాటు చేయించి ఇన్ ఫార్మర్లు గా, మారుస్తున్నారని నక్సలైట్లు గ్రామాల్లోని, ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేయడం, నాడు సర్వసాధారణం.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో ఎన్నికైన ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడైన. నక్సలైట్ల కను సన్నళ్లలో తమ విధులు నిర్వహించాల్సిన దుస్థితి నాడు ఉండేది.
ఈ ప్రాంతంలలో ఏ వ్యక్తి నక్సలైట్లకు.ఎందుకు వర్గ శత్రువు అవుతాడో తెలియదు ?. ఏ6 ప్రజా ప్రతినిధినీ వార్ నక్సలైట్లు ప్రజా కోర్టు నిర్వహించి ఎందుకు దేహ శుద్ధి చేస్తారో తెలియదు ? ఏ ప్రజాప్రతిని, ఏ పౌరుడిని నక్సల్స్ ఎందుకు చంపేవారో ? ఎందుకు చంపుతారో నాడు తెలిసేది కాదు. ఎవరి భూములు ఎందుకు కొనకుండా, సేద్యం చేయకుండా, ఎవరిని ఇన్ఫార్మర్ అంటూ గ్రామాల్లో వాల్ పోస్టర్లు వేస్తారో ? నాడు తెలియని భయంకరమైన పరిస్థితులు నెలకొని ఉండేది.
ప్రశ్నించే తత్వం కలిగి ఉన్న యువతను, ప్రజలను, సానుభూతిపరులుగా, పోలీసు రికార్డులు నమోదు చేయడం, గ్రామాల్లోకి అర్ధరాత్రి , అపరరాత్రి పోలీస్ బలగాలు చుట్టు ముట్టి నక్సల్స్ సమాచారం కోసం గ్రామ చావడి వద్ద జనాన్ని చేర్చి లాఠీలతో బాధడం, బూట్లతో తన్నడం, కొట్టడం జరిగేది. ఇదే తరహాలో నక్సలైట్లు కూడా గ్రామాల్లో తమ

సానుభూతిపరులపై కేసుల నమోదు ,. మిలిటెంట్లపై పోలీసు దాడుల, ఉదంతాలపై ప్రజలను ప్రశ్నిస్తూ ప్రజా కోర్టులో అన్యాయంగా కొందరిని శిక్షించడం షరా మామూలు.
గ్రామాల్లో భూస్వాముల భూములు కొనవద్దని, నక్సల్స్ హెచ్చరించడం, భూములను కొనుగోలు చేసిన రైతులను పోలీస్ ఇన్ ఫార్మర్లు అంటూ చంపడం, .వారి ఇండ్లను ధ్వంసం చేయడం, తదితర ఆటుపోట్ల మధ్య నాడు గ్రామీణులు జీవనం కొనసాగించేవారు. ఎన్నికల బహిష్కరణ, పిలుపు ప్రజల పాలిట శాపంగా మారేది. ఊర్లో ఉండి ఓట్లు వేయకుంటే పోలీసులతో ఇబ్బందులు, ఓట్లు వేస్తే నక్సలైట్లతో తిప్పలు వీరిద్దరి మధ్య ప్రజలు, ప్రజా ప్రతినిధులు నలిగిపోయేవా రు.

250 మంది పై టాడా కేసులు నమోదు!


దేశంలో భయంకరమైన ‘ టాడా ‘. చట్టం ఐలాపూర్ గ్రామంలో నక్సలైట్ల సానుభూతిపరులు అంటూ, కరువు దాడులు చేస్తున్నారంటూ దాదాపు 250. మంది మహిళలు, పురుషులపై నాడు పోలీసులు కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన ఉదంతాలు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలిసారిగా ధర్మపురి పోలీస్ స్టేషన్ పోలీస్ సమీపంలో అమరవీరుల స్థూపం ను 2005 అక్టోబర్ లో పోలీసులు నిర్మించారు.

2005 ధర్మపురి లో నిర్మించిన పోలీస్ అమరవీరుల స్తూపం


ప్రజల బాధలు వర్ణాతీతం !


కానిస్టేబుల్ కోమల్ రెడ్డినీ నక్సల్స్ కాల్చివేత అనంతరం
ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్ట కింది దాదాపు 50 గ్రామాల వరకు ఉండేవి.  ధర్మపురి పట్టణంలో పరిసర గ్రామాల్లో 18 సంవత్సరాల యువకులు, మొదలుకొని వృద్ధుల వరకు, విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కు పట్టుకొచ్చి చిత్రహింసలకు గురి చేశారు. .దాదాపు అర ఫర్లాంగ్, పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడను, వెట్టిచాకిరి తో నాటి ఎస్సై సోమిరెడ్డి  పెట్టించాడు. యువకులు ,విద్యార్థులు , 50 సంవత్సరాల లోపు వారు ధర్మపురి వదిలి పారిపోయారు. .

దొరికిన వారిని రోజుల తరబడి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి నక్సల్ సమాచారం కోసం చిత్రహింసలకు గురిచేశారు. కానిస్టేబుల్ చనిపోయిన రాత్రి  ధర్మపురి పట్టణానికి చెందిన ఓ యువకుని పోలీసులు కిడ్నాప్ చేశారు. ఆ యువకుడు చాకచక్యంగా వారి చెర నుంచి అదే రాత్రి తప్పించుకున్నాడు. అడవి మార్గం గుండా  అప్పటి కరీంనగర్ ఎస్పీ అశోక్ ప్రసాద్, వద్దకు ఓ రాజకీయ నాయకుడి, సహకారంతో చేరుకొని పరిస్థితిని వివరించారు. ధర్మపురి పట్టణంతో పాటు,పరిసర గ్రామాల్లో నక్సల్స్ సమాచారం కోసం సానుభూతిపరులైన వారి ఇళ్లపై అర్ధరాత్రి, అపర రాత్రి పోలీసులు మఫ్టీలో దాడి చేసేవారు. వంట సామాన్లలో, కిరోసిన్ కలిపేవారు, ఇంటి పెంకులు తినుబండారాలను బావుల్లో పడవేసేవారు భయం,భయంగా ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనల తో ప్రజలు అనేక సంవత్సరాల పాటు జీవనం కొనసాగించాల్సిన దుస్థితి నాడు ఉండేది.