తెలంగాణ లో గులాబీ జెండాతోనే అభివద్ధి !
మోదీ ఉత్త చేతులతో తెలంగాణ వచ్చారు
కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ
కవిత !
( J. Surender Kumar )
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ను టీఆర్ఎస్ ఎలా అయితే బంగారుమయం చేసిందో , రేపు భారత
దేశంలో కూడా బీఆర్ఎస్ కూడా విప్లవం సాధిస్తుంది సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు..
రాయికల్ లో శనివారం జరిగిన తెరాస కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని కార్యకర్తల ఉద్దేశించి ఆమె మాట్లాడారు.
గులాబీ జెండాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని , రాష్ట్రానికి ప్రధాని మోదీ ఖాళీ చేతులతో వచ్చారని, ఉత్తమాటలు, లేని మాటలు, ఉత్తుత్తి మాటలు చెప్పి పోయారు తప్పా చేసిందేమీ లేదని ఆమె అన్నారు.

తెలంగాణకు ఏం చేశారని పలుసార్లు ప్రధానిని ముఖ్యమంత్రి ప్రశ్నంచారు, కానీ మోడీ ఎక్కడా కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతూ ఇవాళ వచ్చి ఏదో చిన్న ప్రారంభోత్సవం చేసి వెళ్లిపోతున్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలి. ఉత్తి మాటుల చెప్పేవాళ్లేవరూ..? అభివృద్ధి చేసే నాయకులేవరు ..? ఉట్టి మాటలు చెప్పే పార్టీ ఏది..? ముఖంచాటేసే పార్టి ఏది..? అన్నది ప్రజలు గుర్తించేలా కార్యకర్తలు పనిచేయాలని కవిత వ్యాఖ్యానించారు.
గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను 60 వేల మెజారిటీతో, జగిత్యాల ప్రజలు గెలిపించారని, వచ్చే ఎన్నికల్లో ఆ రికార్డును బద్ధలు కొట్టి ,మళ్లీ జగిత్యాల జైత్రయాత్రను మొదలుపెట్టాలని పిలుపునిచ్చారు. గులాబీ కండువ అధికారంలో ఉంటేనే తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉంటారని, ఎక్కడైతే గులాబీ జెండా ఎగురుతుందో ఆ నియోజకవర్గంలో అభివృద్ధి ఉంటుందని, కాబట్టి ఆ జెండాను నిలబెట్టడానికి 24 గంటల పాటు కార్యకర్తలు పనిచేయాలని సూచించారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై విమర్శలు!
ఎన్ని ఇతర పార్టీలు ఉన్నా, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి వంటి వారు ఉన్నా, ఎన్నడూ ఒక చిన్న గ్రామాన్ని పట్టించుకోలేదని, గ్రామ సమస్యలను అడగలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు
రాయికల్ గతంలో వసతులు లేకుండా ఒక చిన్న గ్రామంగా ఉండేదని. కానీ ఆ నాడు మంత్రి జీవన్ రెడ్డి, రాయికల్ ను మున్సిపాలిటీగా అభివృద్ధి చేయాలనుకోలేదని గుర్తు చేశారు. రాయికల్ పట్టణం ఒకప్పుడు వలసల మండలంగా ఉండేదని, ఇప్పుడు పంటల మండలంగా మారిందని అన్నారు.. .జగిత్యాల నియోజకవర్గంలో మొత్తం కలిపి కాగ్రెస్ హయాంలో జీవన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కేవలం 20 వేల ఎకరాలు మాత్రమే వరి సాగు జరిగేదని, తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కృషితో ఇప్పుడు 65 వేల ఎకరాల్లో వరి సాగవుతోందన్నారు. ఈ విషయాన్ని సగర్వంగా చెప్పుకోవాలన్నారు. .తమ నాయకుడు సీఎం కేసీఆర్ కు ప్రతీ వర్గం గురించి ఆలోచన ఉంటుందని తెలిపారు. బీడీ కార్మికుల కోసం పెన్షన్లు, అందిస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ అని, గతంలో కొన్ని పార్టీలు బీడీ కార్మికుల ఓట్లు అడిగారు, కానీ పెన్షన్లు ఇవ్వలేదన్నారు. వృద్ధాప్య పెన్షన్లలో గతంలో గ్రామంలో ఒకరు చనిపోతేనే, మరొకరికి పెన్షన్ ఇచ్చే పరిస్థతి ఉండేదని, అంతటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణలో ఉండేదని, కానీ ఇప్పుడు అలా లేదని స్పష్టం చేశారు.
ఒక్క రాయికల్ మండలంలోనే అన్ని రకాల పెన్షన్లు కలిపి 16700 మందికి ఇస్తున్నామని తెలిపారు. .చేసిన పనిని చెప్పాలని, చేయాల్సిన పని ఉంటే బాధ్యత తీసుకొని చేయించాలని, కానీ ప్రజలకు ముఖం చాటేసే పార్టీ టీఆర్ఎస్ కాదని స్పష్టం చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ ముఖం చాటేశారని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.. “అయ్యా జీవన్ రెడ్డి గారూ….. ఝూటో నో జోడో నో పాదయాత్ర చేసుకుంటూ ఇటీవలే రాహుల్ గాంధీ తెలంగాణలోకి వచ్చారు . ఆ సమయంలో మునుగోడులలో ఎన్నికలు జరుగుతున్నాయి. మరి మీ నాయకుడు, మునుగోడు ప్రజలకు ముఖం చాటేశారు. మా నాయకుడు తెలంగాణ ప్రజలకు ఎప్పడూ ముఖం చాటేయలేదు. ముఖం చాటేసే నాయకులు కాంగ్రెస్, బీజేపీ నాయకులే కానీ గలాబీ కండువా కప్పుకున్న వాళ్లు ఎప్పడూ ముఖం చాటేయరు.’’ అని కవిత విమర్శించారు. రాజకీయాల్లో ఒడిదిడుకులు ఉంటాయని,.అయినా కూడా అనుకున్న లక్ష్యం సాధించే వరకు వెంటపడేవారే నాయకులవుతారని, వారే చివరి మజిలీ వరకు చేరుకుంటారని స్పష్టం చేశారు. ఇవాళ మన నాయకుడు దేశవ్యాప్తంగా ఒక విప్లవం సృష్టించడానికి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని, తెలంగాణను టీఆర్ఎస్ ఎలా అయితే బంగారుమయం చేసిందో.. రేపు భారత దేశంలో కూడా బీఆర్ఎస్ అదే విప్లవం సాధిస్తుందన్న విశ్వాసం ఉందని కవిత వివరించారు. “ బోర్నపల్లి బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇచ్చి జీవన్ రెడ్డి, రెండు సార్లు ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత హామీని మరిచిపోయాడు. ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బొడమల్లన్న అనేదే జీవన్ రెడ్డి విధానం.” అని కవిత అన్నారు. అదే తాము అలా చేయలేదని, బోర్నపల్లి బ్రిడ్జి కట్టిస్తామని చెప్పి ఇచ్చిన మాట తప్పకుండా రూ. 85 కోట్లతో బ్రిడ్జిని నిర్మించామని తెలిపారు. ప్రతీ రోజు కేసీఆర్ ను ఎదో ఒకటి అంటూ, జీవన్ రెడ్డి వార్తల్లో నిలిచే ప్రయత్న చేస్తారని విమర్శించారు. ఎన్ని సార్లు రోళ్ల వాగు పేరుమీదు గెలిచారు జీవన్ రెడ్డి గారు అని ప్రశ్నించారు. గెలిచాకా దాన్ని చేపట్టే ప్రయత్నం చేయలేదని తెలిపారు. అదే తాము రూ.135 కోట్లతో రోళ్లవాగును నిర్మిస్తున్నామని, జగిత్యాలను జిల్లా చేయడమే కాకుండా, మెడికల్ కాలేజీని మంజూరు చేశామని, రాయికల్ ను మున్సిపాలిటీ చేశామని, రూ. 25 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు.. జగిత్యాల రోడ్లు చూస్తే జివన్ రెడ్డి బాధ పడుతున్నారట, అని చెప్పారు. ఎవరు ఏ పార్టీ అని చూడకుండా ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రజలందదరికీ అందిస్తున్నామని, ఈ అన్ని విషయాలను ప్రజలకు చెప్పాల్సిందిగా కార్యకర్తలకు సూచించారు.

సోషల్ మీడియాతో గందరగోళం సృష్టిస్తున్నారు!
కొంతమంది గందరగోళం సృష్టిస్తున్నారని, వాట్సప్ లలో దొంగ సందేశాలు పెడుతున్నారని, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, ఇబ్బంది పెట్టే మెసేజీలు పెడుతున్నారని, ఆ మోసాలను ఎండగట్టాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ వరదలాగా నిధులు ఇస్తున్న విషయాన్ని ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాలని పిలుపునిచ్చారు. వివిధ కార్యక్రమాలు తీసుకొని ఎంపీటీసీలు, సర్పంచ్ లు, వార్డు మెంబర్లు ప్రజల వద్దకు వెళ్లాలని అన్నారు. రాయికల్ మండల ఆస్పత్రిలో గతంలొ ఒక్క డాక్టర్ ఉండకపోతుండేనని, ఇవాళ అదే రాయికల్ ఆస్పత్రి సామూహిక ఆరోగ్య కేంద్రంగా మారిందని, 10 మంది డాక్టర్లు ఉన్నారని, ఇది జీవన్ రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. .ఆరు చెక్ డ్యాముల నిర్మాణం వల్ల 15 గ్రామాలకు లబ్దీ జరిగిందన్నారు. మిషన్ కాకతీయలో భాగంగా 65 చెరువులను మరమ్మత్తు చేసుకున్నామని .. 16 వేల ఎకరాల్లో పంట స్థిరీకరణ చేసుకున్నామని వివరించారు. మున్నూరు సంఘం వారు బీటీ రోడ్డు వేయించాలని విజ్ఞప్తి చేశారని, రోడ్డు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వడ్డెలింగాపూర్, అల్లీపూర్ లను మండల కేంద్రాలుగా ప్రకటించాలని కోరారని, అవి త్వరలో మంజూరయ్యేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
జగిత్యాలను సంజయ్ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. పట్టుదలతో పనిచేస్తున్న సంజయ్ కి తాము అంతా అండగా ఉండీ సహాయసహకారాలు అందిస్తామని అన్నారు.