నిరంతర కార్యక్రమాలతో..హెచ్.యూ.జే స్ఫూర్తిగా నిలవాలి!

IJU అధ్యక్షులు కే. శ్రీనివాసరెడ్డి !

( J.Surender Kumar )


రాష్ట్ర యూనియన్ లో ప్రత్యేక చరిత్ర కలిగివున్న హెచ్.యూ.జే… 
జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ ఇతర జిల్లాలకు స్ఫూర్తిగా నిలవాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డి సూచించారు
.

ఇటీవల ఎన్నికైన హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్.యు.జే) నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమం సోమవారం నాడు పాతబస్తీలోని, సాలర్ జంగ్ మ్యూజియం ఆడిటోరియంలో జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పదవులు ముఖ్యం కాదని, తోటి జర్నలిస్టులకు మేలు కలిగించే కార్యక్రమాలే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగాలని ఆయన ఉద్భోదించారు.

ఐజేయూ మాజీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ, జాతీయ మీడియా సలహాదారు, దేవులపల్లి అమర్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమానికి నాయకత్వాన్ని అందించిన ఘన చరిత్ర హెచ్.యు.జే కి ఉందన్నారు. తామంతా హెచ్.యు.జే నాయకత్వ స్థాయి నుండి ఎదిగినవారమేనని అమర్ స్పష్టం చేశారు. టీయూబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ మాట్లాడుతూ, వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమ చరిత్రలో హెచ్.యు.జే.కు ఉన్న పేరు, ప్రతిష్టతను కాపాడే దిశలో నూతన కార్యవర్గం కార్యక్రమాలు రూపొందించు కోవాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఎం.ఏ.మాజీద్, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి  విష్ణుదాస్ శ్రీకాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, వరకాల యాదగిరి, హాబీబ్ జిలానీ, బి.కిరణ్ కుమార్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

బాధ్యతల స్వీకరణ


హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్.యు.జే) అధ్యక్షుడు, శిగా శంకర్ గౌడ్, కార్యదర్శి అబ్దుల్ హమీద్ షౌకత్ తో పాటు నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. జర్నలిస్టుల సంక్షేమం కోసం రాజీలేని పోరాటాలు చేస్తామని కమిటీ ప్రతిజ్ఞ చేసింది.

మాజీద్ కు ఫైజ్ మొహ్మద్ అస్ఘర్ అవార్డు !


యూనియన్ సీనియర్ నాయకుడు, సుప్రసిద్ధ ఉర్దూ పాత్రికేయుడు ఫైజ్ మొహ్మద్ అస్ఘర్ స్మారక అవార్డును ఐజేయూ నాయకులు ఎం.ఏ.మాజీద్ కు పాతబస్తీ జర్నలిస్టుల సంఘం అందించి ఘనంగా సత్కరించింది.

ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టు ఆరోగ్య పథకం కాలపరిమితి పొడిగింపు !


జర్నలిస్ట ఆరోగ్య పథకం కాల పరిమితి 2022 నుంచి  2023. ఆర్థిక సంవత్సరం వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వం ఈరోజు జారీ చేసిన జీవో.


G.O Ms.No.292, తేదీ.13-11-2022 న ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎం టి కృష్ణ బాబు జారీచేసిన జీవోలో 2016 – 2017, 2017-.2022, 2022 నుంచి 2023 ఆర్థిక సంవత్సరం వరకు ఆరోగ్య పథకం ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ జీవోను డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కు సమాచార నిమిత్తం పంపినట్టు జీవోలో పేర్కొన్నారు.