మధురమ్మ అంతిమ సంస్కారాలు పూర్తి !
( J. Surender Kumar )
‘రజాకార్లు గాలిస్తున్నారు అని వినిపిస్తే ఆమె మనసు ఏదో కీడు శంఖించేది. తన భర్త కోసం కావచ్చు కనబడితే కాల్చి చంపుతారు అనే అనుమానం కావచ్చు. దేశంలో ఏ ప్రాంతంలోనైనా పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగిన సందర్భంలో, తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలు ఉన్నారో.,? అని కంగారు పడేది ఆ మాతృమూర్తి, దశాబ్దాల కాలం పాటు, ఆటుపోట్ల జీవనం కొనసాగించిన, స్వాతంత్ర సమరయోధుడి సతీమణి, మావోయిస్టు అగ్ర నేతలను కన్నతల్లి, మల్లోజుల మధురమ్మా అంతిమ దహన సంస్కారాలు. బుధవారం పెద్దపల్లి లో కుటుంబ సభ్యులు, పౌర హక్కుల సంఘం నాయకులు, జననాట్యమండలి కళాకారులు, ప్రజల అశ్రునయనాల మధ్య జరిగాయి.
సాంప్రదాయ కుటుంబంలో.

సనాతన సాంప్రదాయ ఆచార వ్యవహారాలు పాటించే కుటుంబంలో పుట్టిన మధురమ్మ, పెద్దపల్లి జిల్లాకు చెందిన రజాకారులపై పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుడు మల్లోజు వెంకటయ్య సతీమణి, 1997 లో స్వాతంత్ర సమరయోధుడు వెంకటయ్య మృతి చెందారు. మధురమ్మకు భారత ప్రభుత్వం మృతి చెందే వరకు సమరయోధులకు ఇచ్చే పెన్షన్ చెల్లిస్తున్నది. ఈమెకు ముగ్గురు కుమారులు ఆంజనేయ శర్మ, కోటేశ్వరరావు ,వేణుగోపాల్
రెండవ కుమారుడు కోటేశ్వరరావు (కిషన్ జి), అడవుల బాట పట్టి నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. పీపుల్స్ వార్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతుండగా, మావోయిస్టు అగ్రనేత గణపతి @ ముప్పాల లక్ష్మణరావు , కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ప్రాంత వార్ కార్యదర్శిగా పనిచేశారు. నాలుగు దశాబ్దాల ఉద్యమంలో 2011 నవంబర్ మాసంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మిడ్నాపూర్ లో జరిగిన ఎన్కౌంటర్లో మల్లోజు కోటేశ్వరరావు @ కిషన్ జి మృతి చెందాడు.. చిన్న కుమారుడు మల్లోజు వేణుగోపాల్, అడవి బాట పట్టి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్నారు.
నాటి నుంచే ఆ మాతృమూర్తికి వేధింపులు!

భర్త వెంకటయ్య ఆచూకీ కోసం నాటి నిజాం సర్కార్ పోలీసులు, మధురమ్మ ను, ఆమె కుటుంబ సభ్యులను, వేధింపులకు గురి చేశారు. పీపుల్స్ వార్ నక్సలైట్ దళంలో చేరిన కుమారులు కోటేశ్వరరావు, వేణుగోపాల్ ఆచూకీ కోసం పోలీసుల వేధింపులు ఆమెకు తప్పలేదు. ఇలాంటి వేధింపులు ఆమె జీవితంలో నిత్యం ఓ భాగమైపోయింది. 1986-87 లో నాటి పెద్దపల్లి D.S.P బుచ్చిరెడ్డి నీ నక్సల్స్ హతమార్చిన సందర్భంలో.

మధురమ్మ ఇంటిని ఫియర్ వికాస్ సంస్థ అజ్ఞాత వ్యక్తులు, నేలమట్టం చేశారు. అనే ఆరోపణ నాడు ఉండేది. ఆ కూలిన స్థలంలో ఆమె గుడిసె వేసుకొని జీవనం కొనసాగించింది. బంధుమిత్రులు తాత్కాలికంగా ఇంటి నిర్మాణం చేస్తానన్న ఆమె ఒప్పుకోలేదు. మీరు కట్టిన, మళ్లీ వాళ్ళు కులుస్తారు అవసరంలేదని సునితంగా తిరస్కరించినట్టు బంధువులు అంటుంటారు.

తన కుమారుల ఆచూకీ కోసం పోలీసులు వేధిస్తున్నారంటూ. ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజా ప్రతినిధులకు గాని ఆమె వారి వద్దకు వెళ్లి మొర పెట్టుకోలేదు. ప్రచార సాధనాల్లో తనని ఇలా వేధిస్తున్నారు అంటూ ప్రకటించలేదు. పంటి దిగువన బాధను దిగమింగుతూ, ఆ మాతృమూర్తి నరకయాతన అనుభవించిందని బంధువులు అనేక సందర్భాల్లో వివరించేవారు.

ఉగ్గుపాలతో వీరత్వం , ధీరత్వం, తన కొడుకులకు రంగరించి పోసి పెంచి పెద్ద చేసిన ఆ మాతృమూర్తి, అజ్ఞాతంలో ఉన్న తన కుమారులను.’ వనం బాట వీడి, జనజీవన స్రవంతిలోకి రమ్మని’ ఏనాడు ఆమె విజ్ఞప్తి చేయలేదు. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు అధికారులు, మధురమ్మ ఇంటికి వచ్చి ఆమె ఆరోగ్య స్థితిగతులు, యోగక్షేమాలు తెలుసుకొని మీ కుమారులను జనజీవన శ్రవంతిలోకి రమ్మని పిలుపు ఇవ్వండి అంటూ అనేక సందర్భాల్లో ఆ మాతృమూర్తిని కోరిన ఆమె మాత్రం జనజీవంలోకి రమ్మని తన కుమారులను కోరలేదు.
పెద్దపల్లిలో పౌరుహిత్యం చేస్తున్న తన పెద్ద కుమారుడి వద్ద ఉంటున్న మధురమ్మ నాలుగు నెలల క్రితం కాలు విరిగింది. ఆపరేషన్ చికిత్సల అనంతరం ఆమె ఆరోగ్యంగా ఉండేది. గత నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాదులోని నారాయణ హృదయాలయం ఆసుపత్రికి తరలించారు.. అక్కడ ఆమెకు గుండెపోటు రావడం, చివరి శ్వాస తన ఇంటిలో పోవాలని ఆమె కోరిక మేరకు, వెంటిలేటర్ సహాయంతో బుధవారం పెద్దపల్లి కి తీసుకొని వచ్చారు మంగళవారం ఆమె తుది శ్వాస విడిచారు.
వేదమంత్రోత్సవాల మధ్య అంతిమ సంస్కారం !

మల్లోజుల మధురమ్మ అంతిమ సంస్కారం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య. సాంప్రదాయ పద్ధతిలో బుధవారం ముగిశాయి. అంతకుముందు ఆమె మృతదేహం పై విప్లవ, ప్రజాసంఘాల నాయకులు పూలమాలవేసి నివాళులర్పించి, ఎర్ర వస్త్రాన్ని కప్పారు. శవయాత్రలో విప్లవ గీతాలు ఆలపిస్తూ మధురమ్మ అమరహే అంటూ నినాదాలు చేశారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు శ్రీపతి రాజగోపాల్, అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర కార్యదర్శి పద్మకుమారి, మధురమ్మ మనుమడు మల్లోజు సంతోష్, పౌర హక్కుల, ప్రజానాట్యమండలి నాయకులు నారాయణ, మాధవ కుమారస్వామి, శాంతక్క, బాలసాని రాజయ్య, గుమ్మడి కొమురయ్య, నార్ల వినోద్, పొన్నం రాయమల్లు, గాండ్ల మల్లేశం, సుచరిత, మల్లోజుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.