రామగుండం లో ఆర్ఎఫ్సీఎల్ జాతికి అంకితం !
విశాఖపట్నం లో…
రాయ్పుర్ – విశాఖ కారిడార్కు శంకుస్థాపన!
( J. Surender Kumar )
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్ర, శనివారాల్లో తెలంగాణతో పాటు, దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో పర్యటించనున్నారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేయనున్నారు.
తెలంగాణలో ₹.9,500 కోట్ల ప్రాజెక్టులకు..

రామగుండంలో ₹.6,300 కోట్లకుపైగా వెచ్చించి పునరుద్ధరించిన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ను (ఆర్ఎఫ్సీఎల్) ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం జాతికి అంకితం చేయనున్నారు. ఆర్ఎఫ్సీఎల్ ఏడాదికి వేపపూతతో కూడిన యూరియాను ఉత్పత్తి చేస్తోంది. రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించి నిర్మించిన భద్రాచలం రోడ్ – సత్తుపల్లి రైలు మార్గాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. అలాగే ₹.2,200 కోట్లతో చేపట్టనున్న మెదక్ – సిద్దిపేట – ఎల్కతుర్తి (జాతీయ రహదారి-765డీజీ), బోధన్ -.బాసర – భైంసా (ఎన్హెచ్-161బీబీ), సిరొంచా -.మహదేవ్పూర్ (ఎన్హెచ్-353సీ) మార్గాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో…

ఏపీలో ₹.10,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు…
ప్రధాని మోదీ శనివారం విశాఖపట్నం చేరుకుంటారు. ₹.3,750 కోట్లతో నిర్మించనున్న రాయ్పూర్ – విశాఖపట్నం 6,వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారికి,. కాన్వెంట్ జంక్షన్ నుంచి శీలానగర్ జంక్షన్ వరకు, పోర్టు కోసం ప్రత్యేకంగా నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేయనున్నారు.

శ్రీకాకుళం – గజపతి కారిడార్ (జాతీయ రహదారి-326ఏ) పరిధిలో ₹.200 కోట్లతో నిర్మించిన నరసన్నపేట – పాతపట్నం రహదారిని జాతికి అంకితం చేస్తారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్ అభివృద్ధి, ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, స్థాయి పెంపుదలకు శంకుస్థాపన చేయనున్నారు. ₹ 2,900 కోట్లతో అభివృద్ధి చేసిన ఓఎన్జీసీ యూఫీల్డ్ ఆన్షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. ₹ 2,650 కోట్లతో 745 కి.మీ..పొడవున నిర్మించనున్న శ్రీకాకుళం ,అన్గుల్ నాచురల్ గ్యాస్ పైపులైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పైపులైను ద్వారా ఏపీతో పాటు ఒడిశాలోని పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, గృహాలకు గ్యాస్ సరఫరా చేస్తారు.
కర్ణాటక, తమిళనాడుల లో

బెంగళూర్లో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ₹.5 వేల కోట్లతో నిర్మించిన టెర్మినల్ – 2 ను శుక్రవారం ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 108 అడుగుల ఎత్తయి నాద ప్రభు కెంపెగౌడ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. బెంగళూర్లోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో చెన్నై – మైసూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్, భారత్ గౌరవ్ కాశీ దర్శన రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం తర్వాత ప్రధానమంత్రి తమిళనాడులోని .దిండిగల్.కు వెళ్లి అక్కడ గాంధీగ్రామ్ రూరల్ ఇనిస్టిట్యూట్, 36వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు.