వీరనారి ఝల్కారీబాయి జయంతి నేడు !

ఝాన్సీ రాణి వెనుక ఆ దళిత వీరనారి !

(J.SURENDER KUMAR)

ఆదినుంచి చరిత్రలో బహుజన వీరులకు అన్యాయం జరుగుతూనే ఉంది. త్యాగం ఒకరు చేస్తే,గుర్తింపు మరొకరికి వస్తుంది. నిన్నటి మొన్నటి వరకు సావిత్రి బాయి పూలే, జ్యోతిరావు పూలే, ఫాతిమా బేగం వంటి గొప్ప సంఘ సంస్కర్తలకి చరిత్రలో సరైన సమాజం ఆశించిన స్థానం లభించలేదు. అలాంటి అపురూమైన, విలక్షణమైన చరిత్ర కలిగిన వారిలో వీరనారి ఝల్కారి బాయి ఒకరు.

ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని తలపించే అరుదైన చరిత్రకు ప్రతీక, దళిత సిపాయి వీరనారి ఝల్కారీ బాయి. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో. ‘ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం’.గా ప్రసిద్ధిగాంచిన 1857 నాటి వీరోచిత పోరాట ఘట్టంలో ఝాన్సీరాణి లక్ష్మీబాయికి ప్రతిరూపంగా కీలక భూమికను పోషించిన ఘనత  ఈమెది.
బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో ప్రజలు పాడుకునే జానపద బాణీల్లో ఝల్కారిబాయి సాహసాలను పాటల, రూపంలో నేటికీ గుర్తుచేసుకోవడం విశేషం. ఝాన్సీ సమీపంలోని భోజ్‌లా గ్రామంలో ,’ కోరీ’ కులానికి చెందిన దంపతులకు నిరుపేద వ్యవసాయకూలీ కుటుంబంలో 1830 నవంబర్‌, 22న  ఝల్కారిబాయి జన్మించారు..ఝల్‌క్కారీ  తల్లిదండ్రులకు ఒక్కరే కుమార్తె. .ఛామనఛాయ అయినప్పటికీ తెల్లటి బుగ్గలు, కాటుక కండ్లు, ఎత్తైన నుదురు, కొనదేలిన ముక్కు అపూర్వ మైన లావణ్యంతో గ్రామంలో ఆమె అందరి ఆకర్షణకు కేంద్రమైంది.
చిన్న వయసులోనే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలో గుర్రపుస్వారీ, కత్తిసాము వంటి యుద్ధ విద్యలు నేర్చుకుంది. అడవిలో పశువులను మేపుతున్న తనపై దాడి చేసిన చిరుత పులిని కేవలం చేతికర్రతో చాకచక్యంగా హతమార్చిన ఘటన సంచలనం రేపింది.
ఝాన్సీలక్ష్మీబాయి సైన్యంలో ఆయుధ విభాగంలో పనిచేస్తున్న పూరణ్‌సింగ్‌ను ఝల్కారిబాయి వివాహం చేసుకున్నారు . తన భర్త దగ్గర సైనిక విద్యలన్నీ నేర్చుకుంది. విలువిద్య, కత్తిసాము, తుపాకీ పేల్చటం, దానితోపాటు గుర్రపుస్వారీలో కూడా నిష్ణాతురాలు అయింది. పెద్ద పెద్ద గుర్రాలను కూడా వశ పరుచుకోవటం ఎలానో నేర్చుకున్నారు. కత్తిని దగ్గరనుండి విసరటం, దూరంలో ఉండి గాలిలో ఎగరేస్తూ కత్తిని విసరటంలో తనకు సాటిలేరు అన్నట్టుగా నేర్చుకున్నారు. శత్రువుల బాణాల నుండి తప్పించుకోవటం, వారిమీద వెంటనే తిరుగుబాటు చేయటం కూడా ఆమె బాగా నేర్చుకున్నారు.
లక్ష్మీబాయికి సన్నిహితమై సైన్యంలో చేరి మహిళా సాయుధ దళానికి నాయకత్వం వహించిరి. సిపాయి తిరుగుబాటు సందర్భంగా శత్రుసేనలతో జరిగిన యుద్ధంలో ప్రముఖ పాత్రను పోషించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.


1858 ఏప్రిల్‌ 3న బ్రిటిష్‌ జనరల్‌, హగ్‌ రోజ్‌ నాయకత్వంలో బ్రిటిష్‌ సేనలు ఝాన్నీ రాజ్యాన్ని చుట్టుముట్టాయి. ఆ దాడి నుంచి లక్ష్మీబాయి సురక్షితంగా తప్పించుకుని కల్పి ప్రాంతంలో పోరాడుతున్న తిరుగుబాటు నాయకులను కలుసుకోవడానికి అనువుగా, ఝల్కారీబాయి తానే ఝాన్సీలక్ష్మీబాయినంటూ కోట ముందు ప్రత్యక్షమై బ్రిటిష్‌ సేనలను ముప్పుతిప్పలు పెట్టింది.  ఆ దాడిలో ఝాన్సీలక్ష్మీబాయి రూపంలో బందీగా పట్టుబడ్డ ఝల్కారిబాయిని గుర్తుపట్టిన బ్రిటిష్‌ సేనలు, తదనంతర కాలంలో ఆమెను విడిచిపెట్టారా?  లేదా చంపేశారా?  అన్నది చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. 1997లో దేశ వ్యాప్తంగా స్వాతంత్ర స్వర్ణోత్సవాలు నిర్వహించిన్నప్పుడు మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో బహుజన నాయకులు ఝాల్కారి గురించి ప్రస్తావించారు.
ఏది ఏమైనా భారత ప్రభుత్వం, ఆమె సేవలను గుర్తించి ఆమె జ్ఞాపకార్థం పోస్టల్‌ స్టాంపును విడుదల చేయడం గమనార్హం. 2017 లో ఝాల్కారి విగ్రహాన్ని భోపాల్ ఏర్పాటు చేశారు. చరిత్ర కారులు మరింత దృష్టి సారించి ఝుల్కారి వంటి మరుగున పడిపోయిన వీరనారిమణుల సాహసాలని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
(యం. రాం ప్రదీప్ గారి సౌజన్యంతో)
        ..తిరువూరు
    …….9492712836