సీఎం కేసీఆర్ ధర్మపురి డివిజన్ ప్రకటించేనా.?

జగిత్యాల పర్యటనలో..

(J. Surender Kumar)

సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు, బుధవారం  జగిత్యాల పర్యటనలో ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తారో ?  లేదో ?  అనే ఉత్కంఠ  నెలకొంది.
నూతనంగా ఆవిర్భవించిన జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్మితమైన నూతన కలెక్టరేట్ భవన సముదాయం, వైద్య కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ, బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభం ,తదితర అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అనంతరం పట్టణ శివారులో భారీ బహిరంగ సభ జరగనున్నది. అనేక సందర్భాల్లో ఆయా ప్రాంతాలలో  సీఎం కెసిఆర్ పర్యటనలలో భాగంగా  ఆ ప్రాంతం అభివృద్ధికి సీఎం వరాల జల్లులు, కోట్లాది నిధులు ప్రకటించిన విషయం తెలిసిందె.


సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన మలి విడత రాష్ట్ర సాధన ఉద్యమాన్ని,  ఉవ్వెత్తున ఎగిసిపడి , ఉదృతం కావడానికి కీలకమైన ధర్మపురి క్షేత్రం పట్ల కెసిఆర్ కు ప్రత్యేక అనుబంధం,   సంబంధం ఉంది.  సీఎం హోదాలో పుష్కర స్నానం చేయడం, క్షేత్ర, ఆలయ అభివృద్ధికి వందలాది కోట్ల నిధులు కేటాయించడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.
జగిత్యాల జిల్లా ఆవిర్భావంతో ధర్మపురి రెవెన్యూ డివిజన్ ఏర్పడుతుందని ఈ ప్రాంత ప్రజలు  ఆశించారు.   మెట్పల్లి డివిజన్ ప్రకటించారు.  2018 ఎన్నికల్లో  కోరుట్ల పట్టణమును డివిజన్ కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది.

డివిజన్ సాధన కోసం పోరాటం చేశారు!

2016 మే, జూన్ మాసాల్లో ధర్మపురి వాసులు, రెవెన్యూ డివిజన్ కోసం ప్రభుత్వానికి అనేక వినతి పత్రాలు అందించారు. బీసీ విద్యార్థి ,యువజన ,సమైక్య నాయకుడు కన్వీనర్ గా కూర్మాచలం మహేష్, డివిజన్ సాధన కమిటీ అధ్యక్షురాలుగా, నాటి సర్పంచ్, నేటి ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్యమ్మ, గౌరవ అధ్యక్షుడిగా జర్నలిస్ట్ సంఘనభట్ల రామకృష్ణ ను సాధన కమిటీ సభ్యులు, యువకులు ,విద్యార్థులు ఏకగ్రీవంగా నియమించుకున్నారు. డివిజన్ సాధన కోసం జగిత్యాల సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష, ధర్మపురి పట్టణ బంద్, 63 జాతీయ రహదారి దిగ్బంధం ,తదితర కార్యక్రమాలను సాధన కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో కొనసాగాయి.

జిల్లాతో పాటు 4 మండలలు, మరో డివిజన్ కేంద్రం!

జగిత్యాల జిల్లా ఏర్పాటుతో పాటు బీర్పూర్, బుగ్గారం మండలాలు ఏర్పడ్డాయి. ఇటీవల ప్రభుత్వం ఎండపల్లి, భీమవరం మండలాలు ఏర్పాటు చేసింది. జిల్లా ఆవిర్భావంతో నే  మెట్పల్లి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించిన ప్రభుత్వం, 2018 ఎన్నికల్లో కోరుట్ల పట్టణాన్ని డివిజన్ కేంద్రంగా ప్రకటించారు.

ధర్మపురి డివిజన్ కుఅర్హతలు ఉన్నాయి !

ప్రముఖ పుణ్యక్షేత్రంగా గుర్తింపు గల ధర్మపురి, స్వరాష్ట్రం లో కెసిఆర్ ప్రభుత్వంలో.మేజర్ పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. కోర్టు ఏర్పడింది, ప్రభుత్వ ఆసుపత్రి,  వైద్య విధాన పరిషత్  పర్యవేక్షణలో కొనసాగుతూ  పోస్టుమార్టం నిర్వహించే అర్హత కలిగి ఉంది. పోలీస్ సర్కిల్ హెడ్ క్వార్టర్, విశాలమైన పోలీస్ స్టేషన్ ప్రాంగణం, మాతా శిశు కేంద్ర నిర్మాణం, అటవీ, వ్యవసాయ పంచాయతీరాజ్ ,రెవెన్యూ శాఖలకు సొంత భవనాలు, ఫైర్ స్టేషన్, 33 కెవి,1 33 కె విద్యుత్  సబ్ స్టేషన్లు, వందలాది దేవాలయ వసతి గృహాల భవన సముదాయాలు, పంచాయతీ రాజ్, ఎస్సారెస్పీ శాఖల సబ్ డివిజన్. కార్యాలయాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తెలుగు కళాశాల జూనియర్ కళాశాలు, విశాలమైన మార్కెట్ యార్డ్ భవన సముదాయం, విశాలమైన బస్టాండ్ ప్రాంగణం,  ఎస్సారెస్పీ శిథిల భవనాల భూమి, తదితర మౌలిక వసతి సదుపాయాలు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి బుగ్గారం అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగిన ధర్మపురి క్షేత్రం, 2009 పునర్విభజనలో స్వర్గీయ మాజీమంత్రి రత్నాకర్ రావు చొరవతో. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పడింది.

జగిత్యాల రెవెన్యూ డివిజన్ లోమండలాలు!

1, జగిత్యాల్, 2, మల్యాల, 3, కొడిమ్యాల్, 4, రాయికల్, 5, సారంగాపూర్, 6, బీర్పూర్ (నూతన మండలం) 7, ధర్మపురి, 8, బుగ్గారం (నూతన మండలం) 9, గొల్లపల్లి, 10, పెగడపల్లి, 11, వెల్గటూర్, 12, ఎండపల్లి ( నూతన మండలం) 13, భీమారం (నూతన మండలం).

కోరుట్ల డివిజన్ లో మండలాలు!

1, మేడిపల్లి, 2, కథలాపూర్, కోరుట్ల


మెట్పల్లి డివిజన్ లో మండలాలు!

1, మెట్పల్లి, 2, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం.

కోరుట్ల  మెట్పల్లి డివిజన్ మధ్య దూరం కేవలం 15 కిలోమీటర్లు మాత్రమే!

జగిత్యాల డివిజన్ కేంద్రం కు ..

బీర్పూర్ మండలం చివరి గ్రామం కమ్మనూరునుంచి 27 కిలోమీటర్లు, ధర్మపురి మండలం రాయపట్నం చివరి గ్రామం నుండి 33 కిలోమీటర్లు. వెల్గటూర్ ,ఎండపల్లి కేంద్రాల నుండి దాదాపు 30 కిలోమీటర్ల పైగా ఉంటుంది.

ధర్మపురి డివిజన్ కేంద్రం అయితే !

ధర్మపురి తో పాటు బీర్పూర్, బుగ్గారం, సారంగాపూర్ గొల్లపల్లి , వెల్గటూర్, ఎండపల్లి మండల కేంద్రాలకు కేవలం 20 కిలోమీటర్ల పరిధి దూరాన ధర్మపురి డివిజన్ అందుబాటులో ఉంటుంది.
సీఎం కేసీఆర్ బుధవారం  జగిత్యాల పర్యటనలో భాగంగా జరగనున్న బహిరంగ సభలో ధర్మపురి క్షేత్రాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తారని పలువురు ఆశాభావంవ్యక్తం చేస్తున్నారు.