నేడు జాతీయ రైతు దినోత్సవం !

రైతుకు రక్షణేది.
భారత దేశ మాజీ  ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్,జై కిసాన్ అనే నినాదం ఇచ్చారు.అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.స్వాతంత్రం వచ్చిన కొత్తలో దేశంలో 90 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. రానురాను వ్యవసాయ రంగం కుంటుపడుతుంది.పారిశ్రామిక మరియు సేవా రంగాల అభివృద్ధితో వ్యవసాయానికి యువత క్రమేణా దూరం అవుతున్నారు.ఇప్పుడు ఈ రంగంపై ఎక్కువగా బడుగు బలహీన వర్గాల వారు ఆధారపడి జీవిస్తున్నారు.కాలం తో పాటు మార్పులు అవసరమే. కానీ వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవించేవారిని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది.


రైతుకుటుంబము నుండివచ్చి ప్రధాని పదవిని అలంకరించిన చరణసింగ్  జన్మదినమైన డిశంబరు 23 ని జాతీయ వ్యవసాయదారుల దినోత్సవం గా(కిసాన్‌ దివస్ ) జరుపుకుంతున్నాము
నేలతల్లిని నమ్ముకొని, పలురకాలప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ, శ్రమించి పంటలను పండించిదేశ ఆర్ధికవ్యవస్థలో రైతులుకీలకపాత్ర పోషిస్తారు.
ఒకప్పుడు అందరి వృత్తీ వ్యవసాయమే. కానీ, ఇప్పుడు పదిమందికీఅన్నం పెట్టే రైతన్నలు కరువైయ్యారు. దేశం ఎంత అభివృద్ధి చెందినారైతుల కష్టాలు మాత్రం తగ్గడం లేదు.
చౌదరి చరణ్ సింగ్ చేపట్టిన ఉద్యమాల ఫలితం గానే జమీందారీ చట్టం రద్దు అయింది. కౌలుదారీ చట్టం  వచ్చింది. రైతులను  వడ్డీవ్యాపారుల కబంధహస్తాలనుండి విడిపించి  వారికి బ్యాంకు ఋణాలు అందించే విధానము ప్రవేశ పెట్టేలా చేయడం వెనుక చరణ్ సింగ్  నిర్వహించిన రైతు ఉద్యమాలున్నాయి. రైతుల గురించి , వ్యవసాయం గురించి అంతగా ఆలోచించి , వారి సమస్యల  పరిష్కారానికి కృషి చేసిన చరణ్ సింగ్ దేశ ప్రధాని అయినపుడు రైతాంగం ఆనంద పడింది . అయితే ఆయన పార్లమెంట్నుఎదుర్కోలేకపోయి తాత్కాలిక ప్రధానిగానే 1980 వ సంవత్సరము పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది. చరణ్ సింగ్ రైతునాయకుడిగానే 1987 మే 29 న మరణించారు. రైతులకు ఆయనచేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వము చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని  కిసాన్‌ దివస్ ” గా ప్రకటించింది.


జనాభా వేగంగా పెరగడం వలన ఆహార అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఉత్పత్తిని మరింత పెంచాల్సిన ఒత్తిడి వ్యవసాయరంగంపై ఉంది. అందువల్ల ఎరువులు, నీరు అధికంగా వినియోగించడం సమస్యగా పరిణమించింది. ఈ పరిస్థితిలో అధిక ఉత్పత్తినిచ్చే పంటలు, వ్యవసాయ విధానాలపై ఆలోచించాల్సి ఉంది. మిశ్రమ పంటలు, అంతర పంటల వంటి ప్రత్యామ్నాయ పద్ధతులు అవలంబించడం ఉపయోగకరం. వీటివలన భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. పంట దిగుబడి తగ్గకుండా ఉండటానికి దీనిని ఒక పరిష్కారంగా భావించవచ్చు.
ఒకే పంటను పండించినపుడు దానికి ఏదైనా తెగులు వస్తే అది పొలమంతా వ్యాపిస్తుంది. అందువల్ల పంట మొత్తాన్ని నష్టపోవాల్సి వస్తుంది.రకరకాల పంటలు వేసుకోడం వల్ల తెగుళ్ళ బారినుండి తప్పించుకోవచ్చు. కాబట్టి పెట్టుబడి తగ్గుతుంది. పురుగు మందుల వాడకం తగ్గుతుంది. అందువల్ల పర్యావరణం కలుషితం కాదు. రైతులు సాంప్రదాయకంగా పండిస్తున్న పంటల విత్తనాలను నిల్వచేసుకొని వాటిని వాడుకోడం వలన స్థానిక పంటలను కాపాడుకోవచ్చు. స్థానిక పంటలు, జాతులకు తెగుళ్ళను ఎదుర్కొనే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటికి ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలి.
ప్రభుత్వాలు కూడా వ్యవసాయ దారులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలి. నాణ్యమైన విత్తనాలని సరఫరా చేయాలి. ఎరువుల ధరలని తగ్గించాలి.భూసార పరీక్షలని ఉచితంగా నిర్వహించాలి.

పంటలు పండించడానికి వారు పడే శ్రమకు గుర్తింపు లేక, చేసిన అప్పులు తీర్చలేక అత్మహత్యలు చేసుకుంటున్న రైతన్నను కాపాడేందుకు వ్యవసాయ రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి ఆదుకోవాలి.కరోనా కాలంలో వ్యవసాయ రంగమే దేశాన్ని ఆదుకుందనే విషయాన్ని పాలకులు గుర్తు పెట్టుకోవాలి.

వ్యాసకర్త ; యం.రాం ప్రదీప్ తిరువూరు.9492712836