శ్రీవారిని దర్శించుకున్న  రాష్ట్రపతి  ద్రౌపతి ముర్ము !

ఘనంగా స్వాగతించిన టీటీడీ యంత్రాంగం !

( J.SURENDER KUMAR)

   తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సోమవారం ఉదయం భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము దర్శించుకున్నారు. రాష్ట్రపతి సోమవారం ఉదయం 9.30 గంటలకు తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరి తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారి పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు.

అనంతరం శ్రీ భూ వరహస్వామివారిని ద‌ర్శించుకున్నారు. 
అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న  రాష్ట్రపతికి టిటిడి ఛైర్మ‌న్  వై.వి.సుబ్బారెడ్డి, ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో  ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.

ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం  రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీశ్రీశ్రీ  పెద్దజీయంగార్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ  చిన్నజీయంగార్‌ స్వామి ఉన్నారు.
ఈ సందర్భంగా శ్రీవారి ప్రధాన అర్చకులలో ఒకరైన  వేణుగోపాల్ దీక్షితులు, శ్రీవారి ఆలయ ప్రాశస్త్యాన్ని , సన్నిధిలోని ఇతర ఆలయాల గురించి వివరించారు.

అనంతరం రంగనాయకుల మండపంలో |రాష్ట్రపతికి వేదాశీర్వచనం చేశారు.  ఛైర్మ‌న్‌, ఈవో కలిసి శ్రీవారి శేష వస్త్రాన్ని, తీర్థప్రసాదాలను, రాష్ట్రపతి కీ అందజేశారు.

    ఈ కార్యక్రమంలో కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్య మంత్రులు  నారాయణ స్వామి,
సత్యనారాయణ, రాష్ట్ర మంత్రి శ్రీమతి రోజా, ఇతర అధికారులు పాల్గొన్నారు.