రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు షాక్!

సోమేష్ కుమార్ ఏపీ వెళ్లాలి హైకోర్టు ఆదేశం!
ఉత్తర్వులు  జారీ !

J. Surender Kumar

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్‌కు వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది హైకోర్టు ధర్మాసనం.  డీఓపీటీ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. మంగళవారం తీర్పునిచ్చింది. అయితే, సీఎస్ సోమేష్ కుమార్ తరఫు న్యాయవాది 3 వారాల వ్యవధి కోరగా,హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ బెంచ్. తిరస్కరించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం.. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల విభజనను కూడా పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి సోమేష్‌ కుమార్‌‌ను సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిందిగా కేంద్రం స్పష్టం చేసింది. అయితే, తనను ఏపీకీ కేటాయించడంపై సోమేష్‌ కుమార్‌ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో  సోమేష్‌ కుమార్‌ సేవలు తెలంగాణ రాష్ట్రానికి అవసరమని భావిస్తే ఆంధ్రా అనుమతితో డిప్యూటేషన్‌పై కొనసాగించుకోవాలని సూచించింది క్యాట్. ఈ నిర్ణయంపై డీ.ఓ.పీ.టీ హైకోర్టులో కేసు వేసింది.  కొన్నాళ్లుగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.
ఈ కేసుపై విచారించిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం..  ట్రైబ్యునల్‌ ఆదేశాలను  కొట్టివేసింది. సోమేష్ కుమార్ తన సొంత క్యాడర్‌ స్టేట్‌కు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఇదే సమయంలో 3 వారాల సమయం కావాలని సోమేష్ కుమార్, న్యాయవాది అభ్యర్థించగా.. హైకోర్టు అందుకు నిరాకరించింది. 

ఎలాంటి సమయం ఇవ్వమని హైకోర్టు తేల్చి చెప్పింది. దాంతో హైకోర్టు తీర్పు ను సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు సీఎస్ సోమేశ్ కుమార్. మరోవైపు తీర్పు కాపీ రాగానే ఏపి కి వెళ్లిపోవాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీ క్యాడర్‌కు చెందిన సోమేష్.. ఇంతకాలం తెలంగాణ సీఎస్‌గా కొనసాగారు. ఇక ఇప్పుడు హైకోర్టు కూడా ఆయన సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పడంతో. ఈ నేపథ్యంలో నెక్స్ట్‌ ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం సోమేశ్ కుమార్ ను తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.