J.SURENDER KUMAR
దేశంలో జర్నలిజాన్ని కాపాడాలనే నినాదంతో ( సేవ్ జర్నలిజం ) పేరుతో దేశవ్యాప్తంగా మార్చి 23న వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ నిర్ణయించింది. శనివారం ఉదయం చండీఘడ్ కిసాన్ భవన్ లో ప్రారంభమైన యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశాలకు జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు.

దేశం కోసం భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ఉరికంబాలెక్కిన రోజు ,మార్చి 23 అని శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. భగత్ సింగ్ కూడా గొప్ప జర్నలిస్టు అని అన్నారు. అన్ని రాష్ట్ర శాఖలు ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున జయప్రధం చేయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టులపై నానాటికి భౌతిక దాడులు, అక్రమకేసులు, పెరిగిపోతున్నాయని ఐజేయూ సెక్రటరీ జనరల్ బల్వీందర్ సింగ్ జమ్మూ, తన నివేదికలో ఆందోళన,ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే వేధింపులకు పాల్పడుతున్నాయని విమర్శించారు. మీడియా పై ప్రస్తుతం అప్రకటిత ఎమర్జన్సీ వుందన్నారు. యు.పి, మహారాష్ట్రలో హత్యలు కూడా జరిగాయన్నారు. ప్రముఖ మీడియా సంస్థలను అదానీ వంటి కార్పోరేట్ సంస్థలు గుప్పెటలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 700 మంది జర్నలిస్టులు మరణిస్తే, కేంద్రం ,.మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోలేదన్నారు. చట్టసభలు జర్నలిస్టుల హక్కులు కాపాడటానికి కనీస ప్రయత్నం చేయడం లేదన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు పంజాబ్ – హర్యానా యూనియన్లు సంయిక్తంగా ఆతిధ్యం ఇస్తున్నాయి. తెలంగాణ నుండి జాతీయ కార్యదర్శి నరేందర్ రెడ్డి ,కార్యవర్గ సభ్యులు కే సత్యనారాయణ ,దాసరి కృష్ణారెడ్డి ,ప్రత్యేక ఆహ్వానితులు కే రాంనారాయణ ,పీ సీ ఐ మాజీ సభ్యులు మాజీద్ ,అధ్యక్ష ,ప్రధాన కార్య దర్శులు నగునూరి శేఖర్ ,కే విరహత్ అలీ పాల్గొన్నారు . ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, జాతీయ కార్యవర్గ సభ్యులు అలపాటి సురేష్ కుమార్ ,డి.సోమసుందర్, ప్రత్యేక ఆహ్వానితులు నల్లి ధర్మారావు ,రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు ఐవి సుబ్బారావు ,చందు జనార్ధన్ హాజరయారు.
ప్రారంభమైన కార్యవర్గ సమావేశం !

చండీగఢ్ లో ప్రారంభమైన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగిస్తున్న పంజాబ్ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి చేతన్ సింగ్. వేదికపై ఐజేయూ అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బల్విందర్ సింగ్ జమ్మూ, మాజీ అధ్యక్షులు ఏ.ఎన్. సిన్హా, ఆం.ప్ర.ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి తదితరులు..