నేడు ధర్మపురి పోలీస్ స్టేషన్ తనిఖీ చేయనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి!

దేశంలో అరుదైన సనాతన సాంప్రదాయం!


బ్రహ్మోత్సవాల్లో భాగంగా…

J. SURENDER KUMAR,
ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి గురువారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి రికార్డులను తనిఖీ చేసి, శాంతిభద్రతల అంశాలను పర్యవేక్షించి, ఘనంగా పూజలు అందుకోనున్నారు. భారతదేశంలో ఏ ప్రాంతంలో లేని అరుదైన సనాతన సంప్రదాయం, ఆచారం, అనాదిగా ధర్మపురి క్షేత్రంలో కొనసాగుతున్నది.

వివరాల్లోకి వెళితే
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్తర, దక్షిణ ,దిగ్విజయ యాత్ర కొనసాగడం. ఇందులో భాగంగా శ్రీ స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లడం సనాతన సంప్రదాయం. ఇందులో భాగంగా పోలీసు అధికారులు ఆలయమునకు వెళ్లి స్వామివారిని సాంప్రదాయబద్ధంగా ఆహ్వానించడం ఆనవాయితీ. స్వామివారిని మేళతాళాలు, మంగళ వాయిద్యాలు ,వేద మంత్రాల, ఘోషతో పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ,మంగళహారతులతో స్వామివారిని ఆలయ ప్రాంగణం నుండి పట్టణ క్షేత్రంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లడం సాగుతున్న ఆచారం.

పోలీస్ స్టేషన్ కు స్వాగతిస్తున్న దృశ్యం ఫైల్ ఫోటో


పోలీస్ స్టేషన్ ఆవరణ ప్రాంగణంలోకి స్వామి చేరుకోగానే పోలీస్ కుటుంబ సభ్యులు మంగళహారతులతో స్వాగతం పలికి స్టేషన్ ప్రాంగణంలో అందంగా అలంకరించిన వేదికపై స్వామి వారిని ఆహ్వానిస్తారు. ఆలయ వేదపండితులు, అర్చకులు, ఘనంగా వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా పోలీస్ కుటుంబ సభ్యులను వేదమంత్రాలతో ఘనంగా ఆశీర్వదిస్తారు. స్వామివారి పల్లకి నీ పోలీస్ అధికారులు భుజానికెత్తుకుని పోలీస్ స్టేషన్ ఆవరణలో కి తీసుకువెళ్తారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొంటారు పూజా ద్రవ్యాలతో పాటు కొన్ని రికార్డులు స్వామి ముందు ఉంచుతారు . ఎస్ పి డి ఎస్ పి సి ఐ ఎస్ ఐ లు పోలీస్ సిబ్బంది పుర ప్రముఖులు ,ఆలయ అధికారులు, ప్రజా ప్రతినిధులు, భారీ సంఖ్యలో భక్తజనం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
.