సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ – ప్రధాని మోదీ చే 8న ప్రారంభం !

9 నుంచి వందే భారత్ ట్రైన్ సేవలు అందుబాటులో!

J. Surender Kumar,

తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను కలుపుతూ. సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు అందిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ ట్రైన్ ఇదే . ఇప్పుడు రెండో వందే భారత్ ట్రైన్ రానుంది. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 8 న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ట్రైన్ ను ప్రారంభించనున్నారు.

ఈ నెల 8న ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ట్రైన్‌ను మోదీ ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. 8న మోదీ ప్రారంభించినా ఆ రోజు ప్రయాణికులను అనుమతించరు. 9వ తేదీ నుంచి సర్వీసులు అందించనుంది. ఈ క్రమంలో ట్రైన్ నెంబర్లతో పాటు ఏయే స్టేషన్‌లలో ఆగుతుంది ?. ఏ స్టేషన్‌కు ఏ టైమ్‌కు చేరుకుంటుంది ? అనే వివరాలతో కూడిన షెడ్యూల్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా వెల్లడించింది.
మంగళవారం రోజు మినహా మిగతా రోజుల్లో సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ రైలు తిరుగుతుంది. మంగళవారం మెయింటనెన్స్ కోసం ఆపేయనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి (ట్రైన్ నెంబర్ 20701) సికింద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. మధ్యలో నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలలో మాత్రమే ఈ ట్రైన్ ఆగనుంది. నల్లగొండకు ఉదయం 7.19 గంటలకు, గుంటూరుకు ఉదయం 9.45కు, ఒంగోలుకు ఉదయం 11.08 కు, నెల్లూరుకు మధ్యాహ్నం 12.29 గంటలకు చేరుకుంటుంది.
ఇక తిరుగు ప్రయాణంలో తిరుపతి-సికింద్రాబాద్ (ట్రైన్ నెంబర్ 20702) తిరుపతిలో మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి రాత్రి 11.45కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ సాయంత్రం 5.20 గంటలకు నెల్లూరు, 6.30కు ఒంగోలు, 7.45కు గుంటూరు, రాత్రి 10.10 గంటలకు నల్లగొండ చేరుకుంటుంది.
అయితే ఈ ట్రైన్ ఛార్జీల వివరాలు ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే బుకింగ్స్‌తో పాటు ఛార్జీల వివరాలను రైల్వేశాఖ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో పొందుపర్చనుంది. ప్రస్తుతం సికింద్రాబాద్-తిరుపతి మధ్య ట్రైన్ ప్రయాణం 11 లేదా 12 గంటలు పడుతుంది. వందే భారత్ ట్రైన్ ప్రయాణం 9 గంటలు మాత్రమే పట్టనుంది.