J.SURENDER KUMAR,
తెలంగాణలో శాసనసభ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్ వచ్చిన డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్ నేతృత్వంలోని ఈసీ బృందం..చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ వికాస్రాజ్, ఇతర అధికారులతో సమావేశమైంది. ఈవీఎంల సన్నద్ధత, ఇతర అంశాలపై రాష్ట్ర అధికారులతో ఈ బృందం చర్చించింది.
ఓటర్ల జాబితా మార్పులు చేర్పులపై సమీక్షించిన ఈసీ బృందం.. లోపాలు లేని ఓటర్ల జాబితా ఉండాలని అధికారులను ఆదేశించింది. రిటర్నింగ్ అధికారుల సమగ్ర జాబితాను సిద్ధం చేయాలని సీఈవోను ఆదేశించింది.
జూన్ 1 నుంచి ఈవీఎంల మొదటి దశ చెకింగ్ చేపట్టాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఈవీఎంలను పరీక్షించి జిల్లాలకు పంపామని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. అధికారులకు శిక్షణ కోసం ప్రణాళిక రూపొందించాలని, పోలింగ్ శాతం పెరిగేలా కార్యక్రమాలు చేపట్టాలని ఈసీ బృందం సూచించింది.
తెలంగాణలో శాసనసభ ఎన్నికలు 2018 డిసెంబరు 7న జరిగాయి. సీఎం కేసీఆర్ తన పదవీ కాలం పూర్తయ్యే తొమ్మిది నెలల ముందు (6 సెప్టెంబరు 2018న) రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దీంతో సాధారణ ఎన్నికలకంటే ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది.