చేసిన పనికి బిల్లులు రాక సర్పంచులు బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితి నెలకొంది!

ఆరు మాసాలుగా నిధుల విడుదల నిలిపివేత !

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !

J.SURENDER KUMAR,

బాధ్యతాయుతంగా పనిచేస్తున్న సర్పంచులు బిల్లులు రాక బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితి నెలకొందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల లోని ఇందిరాభవన్ లో జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్ర అభివృద్ధికి ఆయువు పట్టైన గ్రామాలను అభివృద్ధి పథంలో నడుపుతూ జాతీయ స్థాయిలో అవార్డులు సాదించడంలో కీలకమైన సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం తో అప్పుల ఊబిలోకి కూరుకుపోయారు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా గ్రామాల్లో హరితహారం వైకుంఠధామాలు డంపింగ్ యార్డులు పల్లె ప్రకృతి వనాలు క్రీడా మైదానాలు పారిశుద్ధ్య నిర్వహణ తాగునీరు వంటి అభివృద్ధి కార్యక్రమాలను సర్పంచులు, పాలక మండలి సభ్యులు విజయవంతంగా చేపడుతున్నారు.
రాజకీయాలకతీతంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న సర్పంచులకు ఆరు మాసాలుగా నిధులు మంజూరు కాకపోవడంతో అప్పుల పాలయ్యారు. ఒక్కొక్క సర్పంచ్ కు ₹ 20 నుండి ₹ 50 లక్షల నిధులు రావాల్సి ఉన్నాయి అన్నారు. నిధులు వచ్చినప్పుడు డిజిటల్ కి సాయంతో మండల పంచాయతీ అధికారులు సర్పంచ్ లకు సంబంధం లేకుండా నేరుగా కరెంటు చార్జీలు ట్రాక్టర్ వాయిదాలు చెల్లిస్తున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ల వేతనాలు సైతం పంచాయతీలపైనే భారం వేస్తున్నారు. మండల పంచాయతీ అధికారికి ప్రభుత్వం చెల్లించాల్సిన రవాణా బత్యాన్ని సైతం గ్రామపంచాయతీలు చెల్లిస్తున్నాయి. అని జీవన్ రెడ్డి ఆరోపించారు.
అభివృద్ధి పనుల బిల్లులు సమర్పించి ఆరు నెలలు గడుస్తున్నా నేటికీ నిధులు విడుదల కాలేదు అని ఆరోపించారు. ప్రభుత్వ శాఖల కరెంట్ బిల్లులు పెండింగ్ పెడుతూ గ్రామపంచాయతీలను ముక్కు పిండి వసూలు చేయడం ఏంటన్నారు. ఆరు నెలలుగా ఏ సి డి పి నిధులు కూడా రావడంలేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వాపోయారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం.. యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించడం లేదని కేంద్ర ప్రభుత్వం ఆరోపణలు చేసుకుంటూ నిధుల విడుదల జాప్యం చేస్తూ సర్పంచులను బలి చేస్తున్నారు అని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ స్పందించి స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
బలహీన వర్గాల హక్కులు కాలరాస్తున్నారు…
జగిత్యాల మండల పరిషత్ అధ్యక్షుడు కోవిడ్ తో మృతి చెంది రెండేళ్లు గడుస్తున్న ఎంపీపీ పదవి భర్తీ చేయడం లేదు.
బలహీన వర్గాలకు రిజర్వ్ చేసిన ఎంపీపీ పదవిలో ఇతర వర్గం వారు అధికారం చెలాయించడం.. బలహీన వర్గాల హక్కులు కాలరాయడమే అన్నారు.
చట్ట సభల్లో రిజర్వేషన్ కావాలంటూ, మహిళా సాధికారిక త కోసం ఉద్యమిస్తున్న నాయకులు రాష్ట్రంలో మహిళకు రిజర్వ్ చేసిన స్థానం మహిళకు చెందేలా చర్యలు చేపట్టాలని హితవు పలికారు. మహిళకు కేటాయించిన జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పదవిలో మహిళకు కూర్చోబెట్టలని జీవన్ రెడ్డి హితవు పలికారు.
ఈ సమావేశంలో పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయ లక్ష్మి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, కాంగ్రెస్ మండలాద్యక్షుడు జున్ను రాంజెందర్, పిసిసి ఎన్ ఆర్ ఐ సెల్ రాష్ట్ర కన్వీనర్ చాంద్ పాషా, సర్పంచులు రమ్యలక్ష్మాన్, సరిత శ్రీనివాసరెడ్డి, ఎంపిటిసి భుమారెడ్డి, బీరం రాజేష్, లైసెట్టి విజయ్ పాల్గొన్నారు.