సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి !
J.SURENDER KUMAR,
రైతన్నలకు ఎన్నికలకు ముందు వాగ్దానం, ఎన్నికల తర్వాత మోసం, యువతకూ ఎన్నికలకు ముందు వాగ్దానం ఎన్నికల తర్వాత మోసం , చంద్రబాబు బ్రతుకే మోసం, అబద్ధం, కుట్ర అని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని సోమవారం వైయస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై పలు ఆరోపణలు చేశారు.
👉 వైయస్ జగన్మోహన్ రెడ్డి మాటలలో…
ఇదే పెద్ద మనిషి చంద్రబాబు.. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఓసీలో నిరుపేదలకు ఏం చేశాడని చూస్తే.. ఎన్నికలకు ముందు వాగ్దానం, ఎన్నికల తర్వాత మోసం చేశాడని మనకు కళ్లెదుటనే కనిపిస్తున్న సత్యం. కారణం ఈ పెద్దమనిషి చంద్రబాబు బతుకే మోసం, పెద్ద అబద్ధం. కుట్ర అన్నారు.
చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వం, ఈ బాబు పేదలకు వ్యతిరేకమన్నది మర్చిపోవద్దని తెలియజేస్తున్నా.
14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పోస్టులో ఉండి కూడా చంద్రబాబు గారి పేరు చెబితే ఏ ఒక్కసంక్షేమ పథకం మనకు గుర్తు రాదు. ఏ ఒక్క మంచీ గుర్తుకు రాదు.
👉 బాబు పేరు చెబితే వెన్నుపోటు గుర్తు వస్తుంది.
చంద్రబాబు పేరు చెబితే 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్నుపోట్లు, మోసం, కుట్ర, దగా.
ఇంత దారుణంగా ప్రజలందరినీ మోసం చేస్తున్నా కూడా అన్ని విషయాల్లో బాబును వెనకేసుకురావడానికి బాబు వల్ల బాగా వెనుకేసుకున్న ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, టీవీ5, వీళ్లందరికీ ఒక దత్తపుత్రుడు ఉన్నారు.
ఈ గజదొంగల ముఠా, ఈదుష్ట చతుష్టయం మాత్రమే చంద్రబాబుకు తోడుగా ఉంది.
కానీ బాబు పాలన వల్ల, ఆయన చేసిన పనులు వల్ల తమకు మేలు జరిగిందని చెప్పే ఒక సామాజికవర్గంగానీ, ప్రాంతంగానీ, పేదలుగానీ, ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనకు తోడుగా లేరని ఈ సందర్భంగా చెబుతున్నాను.
కాబట్టి మూసేయడాని సిద్ధంగా ఉన్న ఈ టీడీపీ దుకాణంలో ఈరోజు ఏం జరుగుతోందంటే.. పక్క రాష్ట్రాల్లోని మేనిఫెస్టో తెచ్చి బిస్ బేలా బాత్గా వండుతున్నారు.
ఈ రోజు మనం అమలు చేసిన పథకాలన్నింటినీ కూడా కిచిడీ చేసి పులిహోరగా వండే కార్యక్రమం చేస్తున్నారు.
👉 నిస్సిగ్గుగా చంద్రబాబు…
నిజంగా బాబు ఎంత సిగ్గులేకుండా ఉన్నాడంటే.. ఆశ్చర్యం అనిపిస్తుంది. కారణం సీఎం అయిన 28 సంవత్సరాల తర్వాత, 14 సంవత్సరాలు సీఎంగా చేసిన తర్వాత ఈరోజు రాయలసీమ డిక్లరేషన్ అంటూ ఇవాళ మొదలు పెడతాడు.
👉 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏం చేశారు ? గాడిదలు కాశారా అని అడుగుతున్నా ?
14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈరోజు బీసీ డిక్లరేషన్ అంటూ మొదలు పెట్టాడు. ఎస్సీ, ఎస్టీ, డిక్లరేషన్ అంటూ మొదలు పెట్టాడు, మైనార్టీ డిక్లరేషన్ అని మొదలు పెట్టాడు.
అక్కచెల్లెమ్మలు, రైతన్నలు చివరికి గ్యాస్ సిలిండర్ల డిక్లరేషన్ అంటూ ఇవాళ మొదలు పెట్టాడు.
👉 వాగ్దానాలు, వెన్నుపోట్ల చక్రమే– బాబు సైకిల్ చక్రం.
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు ఏమి గాడిదలు కాశావయ్యా చంద్రబాబూ ? అని అడుగుతున్నా.
ఇవాళ ప్రజల్ని మళ్లీ మోసం చేస్తూ మరోసారి అవకాశం ఇస్తే మయసభ నిర్మిస్తానంటున్నాడు.
👉 మరోసారి అవకాశం ఇస్తే…
ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తానంటున్నాడు. ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తానంటున్నాడు. ఈ కొత్త డ్రామాలు నమ్మవచ్చా ? అని అడుగుతున్నా. కనీసం ఇప్పటికైనా ఈ పెద్దమనిషి చంద్రబాబు మరోసారి మోసానికి తెరతీయడం ఆపేస్తాడేమో అని ఆశిద్దాం.
చంద్రబాబు గారి బ్రతుకంతా కూడా వాగ్దానాలు, ఆ తర్వాత వెన్నుపోట్లు, మళ్లీ ఎన్నికలొచ్చినప్పుడు మళ్లీ వాగ్దానాలు, మళ్లీ వెన్నుపోట్లు, ఈ చక్రమే బాబు సైకిల్ చక్రం.
👉 మనపేదలకూ– బాబు పెత్తందార్లకూ యుద్ధం..
ఈ రోజు బాబు పెత్తందారీ భావజాలానికి, మనందరి పేదల ప్రభుత్వానికి మధ్య ఈ యుద్ధం జరుగుతోంది. గమనించమని, ఆలోచన చేయమని మిమ్నల్ని కోరుతున్నాను.
చంద్రబాబు గారి దోచుకో, పంచుకో, తినుకో అనే డీపీటీ భావజాలానికి, మన రూ. 2.16 లక్షల కోట్ల రూపాయలు ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించే డీబీటీ పద్ధతికి మధ్య యుద్ధం జరుగుతోంది.
చంద్రబాబు గారి మాదిరి దోచుకో, పంచుకో, తినుకో డీపీటీ కావాలా, మీ జగనన్న ప్రభుత్వం మాదిరిగా నేరుగా బటన్ నొక్కే మన డీబీటీ కావాలా ఆలోచన చేయండి.
👉 మనది సామాజిక న్యాయం– వారిది అన్యాయానికి యుద్దం.
ఇది వారి సామాజిక అన్యాయానికి, మన సామాజిక న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇదే రాష్ట్రంలో ఇదే బడ్జెట్లో వారు చేసిన స్కామ్లకు, అదే బడ్జెట్లో మనం అందజేస్తున్న మంచి స్కీములకు మధ్య జరుగుతున్న యుద్ధం.
ఇది వారి ఎల్లో మీడియా.. వారి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 చేస్తున్న విష ప్రచారాలకు.. ఇంటింటికీ మనం చేసిన.. కనిపిస్తున్న మంచికి జరుగుతున్న యుద్ధం ఇది.
👉 పేదలపై జరుగుతున్న యుద్ధం..
ఈ కురుక్షేత్ర మహాసంగ్రామ యుద్ధంలో వీరిది పేదలపై యుద్దం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ యుద్ధంలో వారి మాదిరిగా మీ జగన్కు ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు. టీవీ5 డంకా బజాయించకపోవచ్చు. ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు. మీ జగనన్నకు బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు.
👉 మీ ఆశీస్సులు– దేవుడి దయనే నమ్ముకున్నా…
మీ జగనన్న వీళ్లను నమ్ముకోలేదు. మీ జగనన్న దేవుడి దయను, మీ చల్లని ఆశీస్సులను మాత్రమే నమ్ముకున్నాడు.
ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో నా ధైర్యం మీరు. నా బలం ఇంటింటికీ మనందరి ప్రభుత్వం చేసిన మంచి అని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడుతున్నాను.
👉 మీకు మంచి జరిగిందా లేదా అన్నదే కొలమానం..
మీ అందరినీ ఒకటే కోరుతున్నా. వాళ్లు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మకండి. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేది ఒక్కటే ప్రామాణికంగా తీసుకోండి. మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడాలని కోరుతున్నాను. ఈ యుద్ధంలో చివరకు ఎప్పుడైనా మంచే గెలుస్తుందని మనసారా నమ్ముతున్నాను. మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు ఉండాలని, ప్రజలందరి చల్లని ఆశీస్సులు కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను.
నా అక్కచెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, తమ్ముడిగా మీ పిల్లలంతా ఇంకా బాగా చదువుకోవాలని, ప్రతి కుటుంబంలోంచి ఒక మంచి ఇంజనీర్, డాక్టర్, సైంటిస్ట్, సాఫ్ట్వేర్ సీఈవో, ఎకానమిస్ట్, ఎంటర్ప్రెన్యుర్ రావాలని, ప్రతి పేద కుటుంబం నుంచి ఒక మంచి లీడర్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను.
దేవుడు ఇంకా మీ అందరికీ మంచి చేసే అవకాశం ఇవ్వాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
👉 చివరిగా…
కాసేపటి క్రితం మాదిపాడు వద్ద రూ.60 కోట్లతో హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్ధాపన చేశాం. దీనివల్ల విజయవాడ, గుంటూరుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా హైదరాబాద్కు వెళ్లాలంటే 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ నియోజకవర్గానికి మంచి చేస్తూ… హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఈరోజే శంకుస్ధాపన చేశాం. అదే మాదిరిగా అమరావతి – రాజుపాలెం… కీలకమైన రోడ్డును మరో రూ.150 కోట్లతో శంకుస్ధాపన చేసాం.
👉 మన హయాంలోనే పులిచింతల…
పులిచింతల ప్రాజెక్టు నాన్నగారి స్వప్నం. ఆయన పూర్తి చేస్తే మిగిలిన పోయిన ఆర్ అండ్ ఆర్ కూడా ఇవ్వకుండా 45 టీఎంసీల నీళ్లు నిల్వచేసే కార్యక్రమం చేయకుండా, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మన ప్రభుత్వ హయాంలో రూ.140 కోట్లు కేటాయించి, 45 టీఎంసీల నీళ్లు నింపి, ఆర్ ఆండ్ ఆర్ కార్యక్రమం కూడా పూర్తి చేశాం.
ఈ కార్యక్రమం చేస్తూ.. పొరపాటున ఇమాజిగూడెంలో 128 ఇళ్లకు సంబంధించిన ఆర్ అండ్ ఆర్ మిగిలిపోయిందని ఎమ్మెల్యే నా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని కూడా పూర్తి చేయిస్తాను. ఇది కాకుండా రూ.45 కోట్లతో అచ్చంపేట మండలం తాళ్లచెరువులో లిఫ్ట్ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం అడిగారు. దాన్ని కూడా మంజూరు చేస్తాం. అది కాకుండా మాదిపాడులో ఆర్ ఆండ్ బీ రోడ్డులో పులిచింతల డ్యామ్కు కనెక్ట్ చేస్తూ… రూ.3.50 కోట్లు ఖర్చయ్యే రోడ్డును అడిగారు. అది కూడా మంజూరు చేస్తున్నాను. ఇంకా సబ్స్టేషన్లు వంటివి అడిగారు. అవసరమైన చోట వాటిని కూడా ఏర్పాటు చేస్తాం. వీటన్నింటి వల్ల ఈ నియోజకవర్గానికి మంచి జరగాలని, ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు ఇంకా మంచి జరగాలని ఆకాంక్షిస్తూ.. సెలవు తీసుకుంటున్నానని సీఎం తన ప్రసంగం ముగించారు.