జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
J.SURENDER KUMAR,
ఎన్నికల కమీషన్ అధికారులు హైదరాబాద్ లో ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఓటరు జాబితాలో లేవనెత్తిన అభ్యంతరాలు, సలహాలు, సూచనల మేరకు తప్పులు లేని ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు అధికారులు కృషి చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ ఆర్ ఓ, ఏ ఈ ఆర్ ఓ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులు, తొలగింపులు వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు.
రానున్న ఎన్నికల దృష్ట్యా ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా, అర్హత కలిగిన ప్రతీ ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయాలని అన్నారు. 18, 19 ఏళ్ళ వయసు గల పౌరులందరి పేర్లను నమోదు చేయడం, 20 నుండి 29 వయసు కలిగిన వారి పేర్ల నమోదు లో కొంత గ్యాప్ ఉన్నట్లు ఎన్నికల కమీషన్ గుర్తించిందని, వారందరి పేర్లు జాబితాలో ఉండేవిధంగా ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. అర్హత గల ఏ ఒక్కరి పేరు కూడా తప్పి పోకుండా ఓటరు జాబితాలో నమోదు చేసే విధంగా స్థానిక సర్పంచుల సహకారం తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా మరణించిన, శాశ్వతంగా వెళ్లిపోయిన వారి పేర్లను ఎన్నికల నియమావళి మేరకు, అవసరమైన డాక్యు మెంట్ల జారీచేయాలని, అన్ని పూర్తయిన తర్వాతనే తొలగింపులు చేపట్టాలని అన్నారు. మొదటి సారి నమోదు అయ్యే విద్యా సంస్థల యాజమాన్యాల సహకారం తీసుకోవాలని అన్నారు.

దివ్యాంగుల ఓటర్ల వివరాలు సేకరించాలని, ఫించన్ల మంజూరు, ఉపాధి హామీ సంఘాలు వంటి జాబితాలను ఆయా అధికారుల సహకారంతో సేకరించాలని, ప్రతీ ఒక్క దివ్యాంగుల పేరు తప్పని సరిగా ఓటరుగా నమోదు అయ్యిందా ? లేదా ? పరిశీలించికొని నమోదు చేయాలని సూచించారు. 80 ఏళ్ళ వయసు పైబడిన వృద్ధుల ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. ఈఅర్ఓ, ఏఈఆర్ఓ ల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని, అదేవిధంగా ఆయా గ్రామాలలో ఉన్న ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు వంటి అంశాలను పరిశీలించాలని అన్నారు. బూత్ స్థాయి అధికారులు, స్థానిక పంచాయతీ కార్యదర్శులు, అవసరమైన వారి సేవలు తీసుకోవచ్చని తెలిపారు.
ఎన్నికల కమీషన్ జారీచేసే ప్రతీ ఉత్తర్వులను, సర్క్యులర్ లను చదవాలని అన్నారు. ప్రతీ అంశానికి సంబందించిన పూర్తి వివరాలతో ఫైళ్ళను నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, మంద మకరంద, ఆర్డీఓ వినోద్ కుమార్, తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.