బిజెపి సీఎం అభ్యర్థిగా ఈటల రాజేందర్ ?

రాష్ట్రంలో బెంగాల్ ఫార్ములా !

J. SURENDER KUMAR,

మాజీ మంత్రి, రాష్ట్ర సాధన ఉద్యమకారుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ను బిజెపి అధిష్టానం తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారనే చర్చ.
ఈ మేరకు పార్టీ అగ్ర నాయకత్వం, ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం.

పశ్చిమ బెంగాల్లో సీఎం మమత బెనర్జీ తో 1998 నుంచి వెన్నంటి ఉన్న ప్రధాన అనుచరుడు, సువెందు అధికారినీ, బిజెపి పార్టీలో చేర్చుకొని మంచి ఫలితాలు సాధించింది. మమతా బెనర్జీ పై 2020 లో సిలిగురి లో పోటికి నిలిపి ఆమెను ఓడించింది. బిజెపి నాయకత్వం తెలంగాణలోను సీఎం కేసీఆర్, ప్రధాన అనుచరుడు రాష్ట్ర సాధన ఉద్యమంలో వెన్నంటి ఉన్న, ఈటల రాజేందర్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి సీఎం కెసిఆర్ ప్రాతినిత్యం వహిస్తున్న గజ్వేల్ లో కెసిఆర్ పై పోటీకి నిల్పితే వచ్చే రాజకీయ పరిణామాలను బేరీజు వేస్తున్నట్లు భోగట్టా.

👉 నేపథ్యం..

బిజెపి మరియు భారాస లు దగ్గరవుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యం, కెసిఆర్ గవర్నర్ పట్ల శుక్రవారం సచివాలయం లో ప్రదర్శించిన గౌరవ మర్యాదలు, కొంతమంది బిజెపి నాయకులకు మింగుడు పడడం లేదు. వారంతా కెసిఆర్ మీద వ్యతిరేకతతో బిజెపి లో చేరినవారే తప్ప, సిద్ధాంతపరంగా చేరినవారు కాదు. ముఖ్యంగా ఈటెల అనుచరులు భారాస, మరియు బిజెపిల మధ్య ఇదే వైఖరి కొనసాగే పక్షంలో కాంగ్రేస్ లో చేరి కెసిఆర్ ను ఓడించాలని ఈటెలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

👉 ముందస్తుగా సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారా ?

ఈ పరిణామాలను నిషితంగా గమనిస్తున్న బిజెపి అధిష్టానం ఈటెలను బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీలో అంతర్గతంగా తలెత్తే సమస్యలు, రానున్న పార్లమెంటు ఎన్నికల అవసరాలు, జరుగబోయే అవకాశాలను నిశితంగా గమనిస్తున్నారు. గతంలో ముందస్తుగా సీఎం అభ్యర్థిని ప్రకటించే సాంప్రదాయానికి బిజెపి పార్టీ కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ ఢిల్లీ ఎన్నికల్లో శ్రీకారం చుట్టింది. ఇటీవల అస్సాంలో హేమంత బిస్వా ముఖ్యమంత్రి అభ్యర్థి గా ప్రకటిస్తూఎన్నికలకు వెళ్లింది.

👉 ఒకే దెబ్బకు రెండు పిట్టలు ..

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్, ల సామాజిక వర్గ నేపథ్యంలో రెండు ప్రధాన పార్టీలు ఒక వెనుకబడిన తరగతి నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశాలు లేవు.
రాష్ట్ర సాధన ఉద్యమకారుడిగా ప్రతి గ్రామంలో గుర్తింపు కలిగిన నాయకుడిగా రాజేందర్ కు గుర్తింపు ఉంది.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నప్పటికి ఒకవేళ ఈటెలను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే బిజెపికి రాజకీయంగా లాభించవచ్చు.
బిసి నాయకులు, ఓటర్లు బిజెపి వైపు మొగ్గవచ్చు. రెండు పార్టీల్లోని అసంతృప్తులు బిజెపిని బలపరచవచ్చు. ఎన్నికల సమయంలో అంతర్గతంగా రెండు పార్టీల్లోని బిసి సామాజిక వర్గం ఈటెల గెలుపుకు సహకరించవచ్చు.
బలమైన ముదిరాజ్ సామాజిక వర్గం, దీనికి తోడు సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో బీసీలకు 23 శాతం సీట్లు కేటాయించడం. ముదిరాజులకు, మాదిగలకు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో స్థానం లేకపోవడం అంశాలను ఎన్నికలలో అస్త్రలుగా, సీఎంగా బీసీ అభ్యర్థి నీ ప్రకటించి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేసే యత్నంలో బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకోవచ్చని చర్చ జరుగుతున్నది.