డా॥ వారిజారాణి కి రాష్ట్రస్థాయి పురస్కారం

J.SURENDER KUMAR.

తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయ కళాశాల, కోఠి ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ డా !! వారిజారాణి కి  రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారానికి తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం జారీ చేసిన జీవో నెంబర్.196లో పేర్కొంది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం పురస్కారంతో సన్మానించనున్నది.

ప్రొఫెసర్ వారిజారాణి ధర్మపురి లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాలలో చదివారు. వీరు బి.ఎ లో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి బంగారు పథకం సాధించారు. తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు మరియు సంస్కృత భాషల్లో ఎం.ఎ పట్టాను ఉత్తమశ్రేణిలో సాధించారు.   

ప్రభుత్వం జారీ చేసిన జీవో.


ప్రొఫెసర్ వారిజారాణి  భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖచే దేశవ్యాప్తంగా  సాహిత్య, సంగీత, నాటక, వివిధ కళా రంగాలకు చెందిన   వందమంది ప్రతిభావంతులైన యువతీ యువకుల ప్రోత్సాహంలో భాగంగా ఇచ్చే రెండు సంవత్సరాల స్కాలర్ షిప్ 2005 లో ఎంపిక అయ్యారు. దానిలో భాగంగా వీరు ప్రాచీన తెలుగు కవుల విమర్శ దృక్పథాల మీద పరిశోధన చేసారు. వారిజారాణి యూజీసీ వారి మైనర్ రీసెర్చి ప్రాజెక్టుకు ఎంపిక కాబడ్డారు. దానికై “మహాభారతం- స్త్రీవాద దృక్కోణ అధ్యయనం” అనే అంశంపై పరిశోధన చేసారు.
ప్రొఫెసర్ వారిజారాణి అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. దాదాపు నలభై పత్ర సమర్పణలు చేసారు. ఇంతేకాక దాదాపు ముప్ఫైకి పైగా పరిశోధనా ప్రచురణలు గావించారు. వీరు తెలుగులోనే కాక “Impact of Globalization on Indian Polity, Telugu Language and Literature” , “ The Feministic Approach of Gurajada Kanyashulkam” మరియు “ The Contribution of Hyderabad Sansthan (Province) Literature in the development of Hyderabad Culture” ఆంగ్ల పరిశోధనా ప్రచురణలు చేసారు. ప్రభుత్వ RUSA ప్రాజెక్టులు “తెలంగాణలో ఎరుకల భాష” మరియు  “బంజారా లిపి” పై పరిశోధకులుగా పని చేసారు.
ప్రొఫెసర్ వారిజారాణి వివిధ కళాశాలల్లో, విశ్వ విద్యాలయల్లో విస్తృతోపన్యాసాలు చేసారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో గెస్ట్ ఫాకల్టీగా బోధిస్తున్నారు. వివిధ సాహిత్య సభల్లో విశేష అతిథులుగా, అధ్యక్షులుగా వ్యవహరించారు. వివిధ విశ్వ విద్యాలయాల, కళాశాలల పాఠ్య ప్రణాళిక సభ్యులుగా ఉన్నారు. వీరు అంబేద్కర్ విశ్వ విద్యాలయం, మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం, ప్రభుత్వ ఓపెన్ స్కూల్ సొసైటీల దూర విద్యకై పాఠ్య రచనలు చేసారు. వీరు రచించిన పుస్తకం “ప్రాచీన తెలుగు కవుల విమర్శ దృక్పథాలు”  ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ముద్రింపబడింది. వీరు ఇతర నాలుగు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు.  వివిధ విశ్వ విద్యాలయాలలో పరీక్షకులుగా  వ్యవహరించారు. వీరు భారత ప్రభుత్వ సమాచార శాఖ వారిచే  ప్రాంతీయ సెన్సార్ బోర్డు సభ్యులుగా నియుక్తులై  రెండు సంవత్సరాలు సేవలందించారు. ఆకాశవాణిలో ప్రసంగాలు చేసారు.  టెలివిజన్ కార్యక్రమాల్లో ప్రసంగించారు,  న్యాయ నిర్ణేతగావ్యవహరించారు రాష్ట్రస్థాయి పురస్కారం ఎంపిక పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.