సుప్రీంకోర్టు లో సైగలతో వాదనలు వినిపించిన దివ్యంగా న్యాయవాది !

👉 చీఫ్ జస్టిస్  ధర్మాసనం ముందు.!


J.SURENDER KUMAR,

దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఓ అరుదైన సన్నివేశం సోమవారం జరిగింది. దివ్యాంగురాలు (మూగ, చెవిటి) అయిన ఓ మహిళా న్యాయవాది సైగలతో తన వాదనలు సుప్రీంకోర్టు  ప్రధాన న్యాయమూర్తి, డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసనం ముందు వినిపించారు. ఇలా సైన్ లాంగ్వేజ్​ (సైగలతో కూడిన భాష) లో కేసును వాదించడం దేశంలో ఇదే మొదటిసారి.

తొలిసారిగా సంజ్ఞలతో వాదనలు!

దివ్యాంగులకు సంబంధించి ఓ కేసు విషయంలో వర్చువల్‌గా విచారణ చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ జస్టిస్​ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనాన్ని సుప్రీం కోర్టు సీనియర్​ న్యాయవాది, సంచితా ఐన్​ కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం సైన్​ లాంగ్వేజ్​లో, సారా సన్నీ వాదనలు వినేందుకు అంగీకరించింది. అనంతరం ఈ విచారణలో వాదోపవాదనలు సారా సన్నీకి, అర్థమయ్యేలా సైన్​ లాంగ్వేజ్ నిపుణుడు, సౌరభ్​ రాయ్‌ చౌదరికి కూడా అనుమతి ఇవ్వాలంటూ కోర్టును కోరారు​. అయితే ఇందుకు సుప్రీంకోర్టు కంట్రోల్​ రూమ్​ తొలుత అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ విషయాన్ని సంచితా ఐన్.​ ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ‘ఫర్వాలేదు.. ఆయన కూడా స్క్రీన్​లో జాయిన్​ కావచ్చు’ అంటూ సీజేఐ వెంటనే ఆమెదం తెలిపారు. దీంతో ఈ కేసు విచారణ వివరాలను సౌరభ్​ రాయ్‌ సంజ్ఞలతో సారా సన్నీకి వివరించారు. ఆయన సాయంతో సారా సన్నీ, కోర్టులో సైగలతో తొలిసారి వాదనలు వినిపించారు.

ఆసక్తిగా తిలకించారు!

వ్యాఖ్యాత (ఇంటర్​ప్రిటర్​) సౌరభ్​ రాయ్​ చౌదరీ సంజ్ఞ భాషలో కేసు వివరాలను దివ్యాంగ న్యాయవాది సారా సన్నీకి, వివరిస్తున్న తీరును కోర్టు రూమ్​లోని ప్రతిఒక్కరూ ఆసక్తిగా తిలకించారు. కాగా  వీటిని అర్థం చేసుకొని వర్చువల్​ విధానంలో వాదనలు వినిపించారు సారా సన్నీ. కాగా, సీజీఐ ముందు ఇంత వేగంగా, అది కూడా సైగల ద్వారా కేసును వాదించడం అద్భుతమని అక్కడే ఉన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఆశ్చర్యానికి గురయ్యారు. సారా సన్నీని మెచ్చుకున్నారు.

సీజేఐకు థ్యాంక్స్​!

సారా సన్నీ . సుప్రీంకోర్టు ప్రముఖ సీనియర్​ న్యాయవాది సంచితా ఐన్​, వద్ద జూనియర్​ లాయర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన సీజేఐ జస్టిస్​ చంద్రచూడ్​కు సారా సన్నీ, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక తాను భవిష్యత్తులో వ్యాఖ్యాత సాయంతో వాదనలు వినిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ కేసు..

భూమిక ట్రస్టు వ్యవస్థాపకుడు​, అధ్యక్షుడు జయంత్​ సింగ్​ రాఘవ్​ (చూపు లేదు) సోమవారం పీడబ్ల్యూడీ హక్కుల చట్టం-సెక్షన్ 24లోని నిబంధనను తమకు (దివ్యాంగులకు) అమలు చేయాలని వాదించారు. ఈ చట్టం ప్రకారం.. సామాజిక సంక్షేమ పథకాలు, సహాయం విషయంలో సాధారణ వ్యక్తులకు అందిస్తున్న సాయం కన్నా తమకు (దివ్యాంగులకు) 25 శాతం అధికంగా లబ్ధి అందాలని.. దీనిని అమలు పరిచే విధంగా చొరవ తీసుకోవాలని జయంత్​ సింగ్​ కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యావహారం పైనే దివ్యాంగ న్యాయవాది సారా సన్నీ, సైగల ద్వారా వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం.. సంబంధిత కేసుకు సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. కాగా, విచారణను సుప్రీం కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.