👉 అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు!
J.SURENDER KUMAR,
కోర్టులలో విడాకుల కేసులు పెరుగుతున్నప్పటికీ, వివాహం అనేది భారతీయ సమాజంలో భార్యాభర్తల మధ్య పవిత్రమైన, ఆధ్యాత్మికమైన, భావోద్వేగ జీవిత వలయంగా పరిగణిస్తారని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.
దంపతుల మధ్య వివాహ బంధం పునరుద్ధరించలేని విధంగా విచ్ఛిన్నమైతే.. ఆ కారణం కింద వారి పెళ్లి రద్దు చేసి విడాకులు మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు స్పందించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం విడాకుల మంజూరు వాంఛనీయం కాదని ఓ పిటిషన్పై విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.

తన 82 ఏళ్ల భార్య నుంచి విడాకులు ఇప్పించాలని 89 ఏళ్ల వృద్ధుడు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బీఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా తన భర్తతో వివాహ బంధంలో కొనసాగాలని వృద్ధురాలు తన కోరికను ధర్మాసనం ముందుంచింది. ఈ క్రమంలో కోర్టు వృద్ధ దంపతులకు విడాకులు ఇచ్చేందుకు నిరాకరించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం ఈ వృద్ధ దంపతులకు విడాకులు మంజూరు చేయడం మంచిది కాదని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బీ.ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ పిల్ దాఖలు చేసిన పిటిషనర్ వయసు 89 ఏళ్లు, ఆయన భార్యకు 82 ఏళ్లు అని, 1963 నుంచి ఈ దంపతులు పవిత్రమైన వివాహ బంధంలో ఉన్నారని తెలిపింది. భర్త ఆమె పట్ల క్రూరంగా ప్రవర్తించినా, వృద్ధురాలు తన ముగ్గురు పిల్లలను బాగా చూసుకుందని వెల్లడించింది. భార్య తన భర్తను చూసుకోవడాని కి ఇంకా సిద్ధంగానే ఉందని ఈ దశలో అతడిని ఒంటరిగా వదిలేయడం ఆమెకు ఇష్టం లేదని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.
‘విడాకులు తీసుకున్న మహిళ ‘ అనే కళంకంతో తాను చనిపోవడం ఇష్టం లేదని వృద్ధురాలు చెబుతోంది. సమకాలీన సమాజంలో విడాకులు మంజూరు కళంకం కాకపోవచ్చు కానీ వృద్ధురాలు సెంటిమెంట్తో ఆందోళన చెందుతున్నాం . దంపతుల మధ్య వివాహ బంధం కోలుకోలేని విధంగా విచ్ఛిన్నం అయ్యిందని చేసిన వాదనను మేము అంగీకరించం’ అని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో వృద్ధ దంపతులకు విడాకులు మంజూరును సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది.