👉హుండీ ఆదాయం వంద కోట్లు !
👉కోటి లడ్డూల అమ్మకాలు!
👉సమావేశంలో ఈవో ధర్మారెడ్డి వెల్లడి!
J.SURENDER KUMAR,
కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని గత నెలలో జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్బంగా భారీ సంఖ్యలో దర్శించుకుని స్వామివారికి సమర్పించుకున్న మొక్కుల ద్వారా₹ 111.65 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది ఈ ఓ ధర్మారెడ్డి శుక్రవారం మీడియాకు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో. డయల్ యువర్ ఈవో. కార్యక్రమం నేపథ్యంలో వివరాలు వెల్లడించారు.
గత సెప్టెంబర్ నెలలో శ్రీవారిని 21 లక్షల మందికిపైగా దర్శించుకున్నారని, శ్రీవారికి హుండీ రూపంలో రూ 111.65 కోట్ల ఆధాయం వచ్చిందని, అన్న ప్రసాదమును 53.84 లక్షల మంది భక్తులు స్వీకరించారని, 8.94 లక్షల మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారని, 1,11 కోట్ల లడ్డూలు విక్రయించామని ఈవో ధర్మారెడ్డి మీడియాకు చెప్పారు.
బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు
గత మాసం సెప్టెంబర్ 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని, మళ్లీ అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, ఇందుకోసం ఈ నెల 14వ తేదీన అంకురార్పణ జరుగనుందని టీటీడీ ధర్మారెడ్డి చెప్పారు. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా అక్టోబరు 19న గరుడసేవ, అక్టోబరు 20న పుష్పకవిమానం, అక్టోబరు 22న స్వర్ణరథం, అక్టోబరు 23న చక్రస్నానం నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.
ఉదయం వాహనసేవ 8 గంటల నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది. భక్తులందరికీ దర్శనం కల్పించేలా రాత్రి 12 గంటల వరకు గరుడవాహన సేవ ఉంటుందని, ఈ ఉత్సవాల్లో ధ్వజావరోహణం ఉండవని, ఈ వో తెలిపారు.
సేవలు రద్దు!
బ్రహ్మోత్సవాల కారణంగా అక్టోబరు 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, సహస్రదీపాలంకరణ సేవలు రద్దయ్యాయని టీటీడీ ఈవో తెలిపారు.
ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవాటికెట్లు బుక్ చేసుకున్న గృహస్తులను వారికి సూచించిన వాహనసేవలకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేయడమైనదని, శ్రీవారి భక్తుల భద్రతా దృష్ట్యా అక్టోబరు 19వ తేదీన గరుడసేవ నాడు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను పూర్తిగా రద్దు చేయడమైనదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.
కాటేజీ దాతలకు 17 నుంచి 19 వరకు కేటాయింపులు ఉండవు !
బ్రహ్మోత్సవాల మరుసటిరోజైన అక్టోబరు 24న పార్వేట ఉత్సవం జరుగునుంది. కాటేజి దాతలకు గదుల కేటాయింపు గురించి టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ అక్టోబరు 19న గరుడసేవ సందర్భంగా అక్టోబరు 17న నుండి 19వ తేదీ వరకు కాటేజి దాతలకు గదుల కేటాయింపు ఉండవని. బ్రహ్మోత్సవాల మిగతా రోజుల్లో యధావిధిగా కాటేజీలు కేటాయించడం జరగుతుందని వివరించారు.