J.SURENDER KUMAR,
వైయస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైయస్ షర్మిల, రాష్ట్రంలో 119 ఎమ్మెల్యే స్థానాలతో పాటు, 17 ఎం పి స్థానాలకు పోటీ చేసినా, మద్దతు ఇచ్చినా, పోటీ నుంచి తప్పుకున్న పట్టించుకునేది ఎవరో ? పరేషాన్ అయ్యేది ఎవరో ? ఆ పార్టీ అధినేత్రి చెప్పాలి తప్ప, రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పలేని దుస్థితి నెలకొంది.
పై ప్రస్తావన ఎందుకంటే ….
హైదరాబాద్ లోటస్ పాండ్ లో శుక్రవారం వైయస్సార్ టీ పి, వైయస్ షర్మిల ప్రసంగించిన తీరులో తెలంగాణ ప్రజలు అమాయకులు అని భావించారో, లేదా పరిపక్వత లేని తన రాజకీయ అనుభవమో, తెలియదు కానీ, తమ పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదు అంటూ. మా పార్టీ పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తిరిగి కెసిఆర్ ముఖ్యమంత్రి అయితే, ఆ అపవాదు తనకు, తన పార్టీకి వస్తుందని, అందుకే తమ పార్టీ పోటీకి దూరంగా ఉంటుందని, గెలుపు కంటే త్యాగమే గొప్పదంటూ. మీడియా ఆమె సమావేశంలో సూక్తి ముక్తావళి చెప్పిన విషయం తెలిసిందే.
వైయస్ షర్మిల తన రాజకీయ పదవుల పదోన్నతుల పై కాంగ్రెస్ ఐ కమాండ్ తో . గత కొన్ని నెలలుగా జరిపిన బేరసారాలు బెడిసి కొట్టడంతో ఆమె తెలంగాణలో పోటీ అంశం తెరపైకి తెచ్చింది,అనే అంశం రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిందే.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తిరిగి కెసిఆర్ ముఖ్యమంత్రి కావొద్దు , అనే ఉద్దేశంతో గత నాలుగు నెలలుగా. కాంగ్రెస్ ఐ కమాండ్ తో చర్చలకు ప్రయత్నించినా వాళ్లు పట్టించుకోవడంలేదని, అందుకే రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు తన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. దీంతోపాటు భవిష్యత్తులో మన పార్టీ పోటీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి కెసిఆర్ మళ్లీ సీఎం అయ్యారు అనే అపవాదు మన పార్టీపై రాకూడదని నా వంతుగా ప్రయత్నం చేశానని షర్మిల అక్క పలికిన చిలక పలుకులు కాంగ్రెస్ పార్టీని మభ్య పెట్టడానికో ? భయపెట్టడానికో.? ఆమెనే చెప్పగలిగితే తెలుస్తుంది.
వైయస్ షర్మిల అంటే...
షర్మిల అంటే చాలామందికి తెలియకపోవచ్చు, తెలియదుకూడా, వైఎస్ షర్మిల అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మాజీ సీఎం స్వర్గీయ రాజశేఖర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా తెలుస్తుంది. ఆయనకు ఉన్న చరిష్మా మేరకు ఆయన కూతురుగా వైయస్ షర్మిలకు గుర్తింపు ఉంది తప్ప ఆమెకు మరే చరిష్మా లేదనేది జగమెరిగిన సత్యం.. అయితే తెలంగాణ ప్రజలు మేలు కోసం అంటూ, షర్మిల అనేక సందర్భాల్లో మీడియా ముందు మాట్లాడిన తీరు ఆమె పరిపక్వత లేని రాజకీయ అజ్ఞానమా ? అహంకారమా ? లేక తన రాజకీయ చతురతను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోరు అనే భావనా కాబోలు..
2021 ఫిబ్రవరిలో షర్మిల తెలంగాణలో వైయస్సార్ టీపీ పార్టీ పెట్టినప్పుడు ఆమెను, బిజెపి, టిఆర్ఎస్, వైయస్ జగన్మోహన్ రెడ్డి వదలిన బాణమంటూ రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకున్న విషయం విధితమే. ( ఏపీలో షర్మిల చేసిన, ఓదార్పు యాత్ర ,ఎన్నికల ప్రచారంలోనూ తనకు తానుగా ‘నేను జగనన్న వదిలిన బాణం’ అని ప్రకటించుకోవడంతో, తెలంగాణలో పార్టీ పెట్టిన నేపథ్యంలో ఆమె ఎవరు వదిలినా బాణం ? అనే చర్చ రాజకీయాల్లో జరిగింది.)
తెలంగాణ గడ్డ పై..
తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి యత్నించిన స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, తనయ షర్మిల. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి పార్లమెంట్ లో ప్లే కార్డులు ప్రదర్శించిన వైయస్సార్ పార్టీ అధినేత, ఏపీ సీఎం, సోదరి షర్మిల అక్క.. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా నిరంతరం పనిచేస్తాను అంటే నమ్మేది ఎవరు ? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన రక్తసంబంధం, అదే తెలంగాణ రాష్ట్రంలో ‘ రాజన్న రాజ్యం తెస్తాను’ అంటూ మీడియా సమావేశంలో చిలక పలుకులు పలుకుతే నమ్మేది ఎవరు ? అనే సవా లక్ష ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ గడ్డ మీద పార్టీ నడపడం నా తరం కాదు అంటూ ఢిల్లీలో సోనియా గాంధీ వద్దకు వెళ్ళిన షర్మిల దంపతులు, తమ పార్టీ నీ కాంగ్రెస్ విలీనం కోసం విశ్వయత్నాలు చేస్తున్న షర్మిలమ్మ, ఇదే గడ్డ ప్రజల మేలు కోసం పోరాడుతాను, జెండా ఎగర వేస్తాను, కర్ర సాము చేస్తా, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులను సంతోషపెడతాను అంటే నమ్మే నాటి అమాయక తెలంగాణ ప్రజలు ఇప్పుడు లేరు, ఆటుపోట్లు, ఆత్మ బలిదానాల తో అమరులు ఆశించిన రాష్ట్రాన్ని సాధించుకున్న అరవీర భయంకర వీరులు ఆత్మగౌరవంతో ఉన్న తెలంగాణ ఇది.
నాడు.ప్రజా సంక్షేమ పాలన!
2004 నుంచి సెప్టెంబర్ 9 వరకు రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో ఆయన పరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దురదృష్టవశాత్తు ఆయన ప్రమాదంలో మృతి చెందడంతో ఇదే ప్రభుత్వం 2014 వరకు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన విషయం తెలిసిందే. వైఎస్సార్ పాలనలో ఆసరా పెన్షన్ పెరుగుదల, ఆరోగ్యశ్రీ పథకం, ఫీజు రియంబర్స్మెంట్, రేషన్ కార్డుల జారీ, 108 అంబులెన్స్ సేవలు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, జలయజ్ఞం, ప్రభుత్వ పథకాలతో ఇది పేదల సంక్షేమ ప్రభుత్వం గా, రైతు సంక్షేమ ప్రభుత్వం గా ప్రజల మన్ననలు పొందిన విషయం వాస్తవమే. పేద ప్రజలకు, బడుగు, బలహీన వర్గాలకు, విద్యార్థిలోకం కు విద్య, వైద్యం అందించి ఉచిత సేవలతో తెలంగాణ ప్రజలే కాక, ఉమ్మడి రాష్ట్ర ప్రజలు కూడా ఆయనను గుండెల్లో పెట్టుకొని అభిమానించే వారు ఉన్నారు, ఆదరించే వారు ఉన్నారు. ఇది అక్షర సత్యం.
ఇదే సందర్భంలో …
తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయంగా తొక్కి పెట్టడం కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు అనే భావన తెలంగాణ వాదులు నెలకొని ఉంది. శాంతి చర్చల పేరిట నక్సలైట్లను పిలవడం, అర్ధవంతంగా చర్చలు వాయిదా పడడం, తదనంతరం జరిగిన అనేక ఎదురుకాల్పుల్లో చర్చలకు వచ్చిన ఒకరిద్దరు మినహా, నక్సలైట్ నాయకులు మరణించడం,ఆ ఉద్యమం బలహీన పడడం తదితర అంశాలు కాకతాళీయమే అయినా, 15 శాతం ప్రజలలో వైఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావన ఉందని చెప్పాల్సి వస్తుంది.
ఆవిర్భవిస్తున్నాయి.. అదృశ్యం అవుతున్నాయి !
ఉమ్మడి రాష్ట్రంతో పాటు స్వరాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవిస్తున్నాయి కొంతకాలానికి అదృశ్యం అవుతున్నాయి. ఆవిర్భవించిన ప్రాంతీయ పార్టీలలో టిడిపి, టిఆర్ఎస్ మినహ ఏ పార్టీ కూడా రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోలేదు. ప్రముఖ మేధావి సీనియర్ ఐఏఎస్ ఎస్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ, తన కలెక్టర్ పదవికి రాజీనామా చేసి లోక్ సత్తా రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు, అనేకసార్లు ఎన్నికల్లో పోటీ చేయగా ఒకసారి ఆయనకు ఎమ్మెల్యేగా పదవి భాగ్యం లభించింది. ప్రముఖ సినీ హీరో డాక్టర్ చిరంజీవి ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి 20 ఎమ్మెల్యే సీట్లు, గణనీయమైన ఓట్లు సాధించిన ఆయన తనపార్టీని కాంగ్రెస్ లో కలిపారు. జేఏసీ చైర్మన్ తెలంగాణ సాధన ఉద్యమ రథసారథి, ప్రొఫెసర్ కోదండరామ్ జన సమితి పార్టీ. ఎన్టీ రామారావు తనయుడు స్వర్గీయ హరికృష్ణ ‘అన్న తెలుగుదేశం ‘ పార్టీ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తెలుగుదేశం ఎన్టీఆర్ ని ‘డాక్టర్ చెరుకు సుధాకర్ ‘ఇంటి పార్టీ ‘. తెలంగాణ ఉద్యమ నాయకుడు బాలకృష్ణ రెడ్డి ఓ పార్టీ, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ , సినీ నటి విజయశాంతి , స్వర్గీయ మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి, స్వర్గీయ మాజీ సీఎం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ప్రజా సమితి పార్టీ, విప్లవ పంథా లో జనశక్తి, ప్రజా ప్రతిఘటన ,తదితర అనేక పార్టీలు మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాసాని తదితరులు ఆర్బాటంగా ఆవిర్భవింపజేసిన ప్రాంతీయ పార్టీలు ప్రస్తుతం వాటి అడ్రస్ లు అదృష్టమవుతున్నాయి. అదే బాటలో వైఎస్ షర్మిల పార్టీ వైఎస్ఆర్ టిపి పార్టీ అదృశ్యం కావడం తథ్యం..