దొరల తెలంగాణకు – ప్రజల తెలంగాణకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి !

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ!

J.SURENDER KUMAR,

దొరల తెలంగాణకు.. ప్రజల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ లో మూడవ రోజు పర్యటనలో భాగంగా గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో రాహుల్ గాంధీ మహదేవ్‌పూర్ మండలం అంబట్‌పల్లిలో ఏర్పాటు చేసిన మహిళా సాధికారత సదస్సులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణ సంపద దోపిడీకి గురవుతోందని ఆరోపించారు. కేసీఆర్‌ కు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఏటీఎంలా మారిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల సొమ్మును దోపిడీ చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ₹.500 కు వంట గ్యాస్ సిలిండర్‌ ఇస్తామని.. కేసీఆర్ దోచుకున్న సొమ్మును మహిళల ఖాతాల్లో వేస్తామని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని.. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ₹.2,500 ఇవ్వనున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ మూడు ఒక్కటేనని ఆక్షేపించారు.

అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని రాహుల్ గాంధీ ప్రజలను కోరారు.

మేడిగడ్డ సందర్శించిన రాహుల్ !

మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్‌ గాంధీ సందర్శించారు. కుంగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన.. అందుకు గల కారణాలను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ వెంట రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు రాహుల్ గాంధీ వెంట ఉన్నారు.


కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ శ్రీధర్ బాబు తదితరులు హెలిప్యాడ్ వద్ద రాహుల్ గాంధీకి కండువా కప్పి స్వాగతించారు.