మంగళవారం నుంచి ధర్మపురి లో కార్తీకమాస సందడి !

👉నెల రోజులపాటు గోదావరి నది హారతి కార్యక్రమం..

J.SURENDER KUMAR,

హిందూ సంప్రదాయాలల్లో కార్తిక మాసానికి  ఏనలేని ప్రాముఖ్యత ఉంది. దీపాల కాంతి తో ధర్మపురి క్షేత్రంలో  కళకళలాడే ఆలయాలు.. గోదావరి నదిలో భక్తుల స్నానాలు శివనామస్మరణలు, భక్తుల ఉపవాసాలు, అయ్యప్ప దీక్ష.. కార్తిక వనభోజనాలు ఈ మాస ప్రత్యేకతలు. హరిహరులకు ఇష్టమైన మాసంగా పరిగణించే ఈ మాసంలో చేసే పూజలకూ, వ్రతాలకూ విశేషమైన ఫలితం ఉంటుందని పురాణాల కథనం.

దీపావళి తరువాతి రోజు నుంచి కార్తికం ప్రారంభమవుతుంది. అయితే ఈసారి దీపావళి తర్వాత రెండో రోజున కార్తిక మాసం మొదలవుతుంది. ఎందుకంటే.. శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి పాడ్యమి ఉన్న తిథినే నెల ప్రారంభానికి సూచనగా తీసుకుంటారు. అమావాస్య తిథి.. నవంబర్​ 12న మొదలై.. నవంబర్​ 13న సోమవారం వరకు ఉంది. నవంబర్​ 14న మంగళవారం సూర్యోదయం సమయానికి పాడ్యమి తిథి ఉండటంతో ఈరోజు నుంచి ఆకాశదీపం ప్రారంభమవుతోంది. అంటే నవంబర్​ 14వ తేదీ మంగళవారం నుంచి కార్తీక మాసం మొదలవుతోందని పండితులు చెబుతున్నారు.
కార్తిక మాసం అని పేరు?
 చంద్రుడు పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ నెలకు కార్తికమనే పేరు వచ్చింది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో ఎవరిని పూజించినా ఇద్దరూ సంతోషిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసంలో చేసే జపం, ధ్యానం, నదీస్నానం, దానం, ఆరాధనతో సకల శుభాలూ కలుగుతాయని ప్రజల నమ్మకం.

కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులు!


👉 14వ తేదీ మంగళవారం పాడ్యమి తిథితో కార్తీకమాసం ప్రారంభం అవుతుంది. అదే రోజు గోవర్ధన పూజ కూడా చేస్తారు.

👉నవంబర్ 15 బుధవారం రోజున యమ విదియ- భగినీహస్త భోజనం.

👉నవంబర్​ 17 శుక్రవారం రోజున నాగుల చవితి.

👉నవంబర్​ 20న కార్తీక మాసం మొదటి సోమవారం, కార్తవీర్య జయంతి.

👉నవంబర్​ 22న యాజ్ఞవల్క జయంత్.

👉నవంబర్​ 23న మతత్రయ ఏకాదశి.

👉నవంబర్​ 24న శుక్రవారం క్షీరాబ్ధి ద్వాదశి.

👉నవంబర్​ 26న ఆదివారం జ్వలా తోరణం.

👉నవంబర్​ 27న సోమవారం కార్తీకమాసం రెండో సోమవారం, కార్తీక పూర్ణిమ.

👉డిసెంబర్​ 4న కార్తీక మాసం మూడవ సోమవారం.

👉డిసెంబర్​ 11న కార్తీక మాసం నాలుగవ సోమవారం.

👉డిసెంబర్​ 13న బుధవారం పోలి స్వర్గం.

👉సోమవారానికి ప్రాధాన్యత


కార్తిక మాసంలో సోమవారాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. సోమవారానికి అధిపతి చంద్రుడు. సోమవారం అంటే శివుడికీ ఇష్టం కాబట్టి ఈ నెలలో వచ్చే సోమవారాల్లో ఉపవాసం ఉండి, శివుడిని ఆరాధించి.. సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం తరువాత దీపాలను వెలిగించి భోజనం చేస్తే సకల శుభాలూ కలుగుతాయని అంటారు. అంతే కాకుండా ఈ కార్తికంలోనే అయ్యప్ప దీక్షను స్వీకరిస్తారు. కారణం ఏంటంటే.. అయ్యప్పను హరిహరసుతుడిగా భావిస్తారు. మకర సంక్రమణ సమయంలో స్వామి మకరజ్యోతి రూపంలో ఆవిర్భవిస్తాడని ఓ నమ్మకం.
ఆ జ్యోతిని చూసేందుకు మండలంపాటు (41 రోజులు) దీక్షను చేపట్టి స్వామి సన్నిధానానికి చేరుకుంటారు భక్తులు.