సమ న్యాయ సత్య శోధకుడు ! పూలే వర్ధంతి సందర్భంగా..

గౌతమ బుద్ధుడు తరువాత భారత దేశంలో జ్యోతిరావు పూలే, బిఆర్.అంబేద్కర్ వంటి మహనీయులు సమన్యాయం కోసం పోరాడారు.గాంధీజీ కంటే ముందే మహాత్మాగా పిలువబడ్డ జ్యోతిరావు పూలే అంబేద్కర్ వంటి వారికి స్ఫూర్తి నిచ్చారు.


సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని మాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్‌ 11న జన్మించారు. ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవారు. కాలక్రమేణా పీష్వా పరిపాలనాకాలంలో పూల వ్యాపారం చేయడంవల్ల వారి ఇంటి పేరు ఫూలేగా మార్పు చెందింది. జ్యోతిరావ్‌కి సంవత్సరం వయస్సు రాకుండానే తల్లి తనువు చాలించింది. 7 సంవత్సరాల వయస్సులో ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించారు. తరువాత చదువు మానివేసి వ్యవసాయంలో తండ్రికి సాయంగా ఉండేవారు. అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్ళినప్పటికీ ఫూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువ.
ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వ సాధారణంగా జరిగేవి. ముసలి వారికిచ్చి పెళ్ళి చేయడంవల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు. వీరు మళ్ళీ వివాహం చేసుకోవడానికి సమాజం అంగీకరించేదికాదు. అందువల్ల వితంతు పునర్వివాహాల గురించి ఫూలే ప్రజల్లో చెైతన్యం తీసుకువచ్చారు. స్వయంగా వితంతువులకు వివాహాలు జరిపించారు. 1864లో “బాలహత్య ప్రతిబంధక్ గృహ” స్థాపించి, వితంతువులెైన గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచారు. దేశంలోనే ఇటువంటి కేంద్రం స్థాపించడం ఇదే మొదటిసారి. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి ఫూలే దత్తత తీసుకున్నారు. 1873 సెప్టెంబరు 24న సత్య శోధక సమాజాన్ని ఫూలే స్థాపించారు. దేశంలోనే ఇది మొట్ట మొదటి సంస్కరణోద్యమం.
సామాజిక ప్రజాస్వామ్యం సాధించటం భారత దేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మ ఫూలే తన గురువు అని డా బి.ఆర్‌. అంబేద్కర్‌ ప్రకటించారు. దక్షిణాఫ్రికా జాతీయోద్యమ నాయకుడు నెల్సన్‌ మండేలా భారతదేశ పర్యటనకు వస్తున్న సందర్భంలో ఆ మహనీయునికి సమర్పించాలని నిర్ణయించుకొన్న గౌరవ కానుక మహాత్మ ఫూలే రచించిన మహత్తర గ్రంథం ‘గులాంగిరి’. సమాజంలో వెనుకబడినవర్గాల ప్రజలు, మహిళల అభ్యున్నతికోసం చేసిన కృషికి ఆయనకు ‘మహాత్మ’ బిరుదు ఇచ్చారు. దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ నిరంతరం సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మ ఫూలే 1890 నవంబరు 28న కన్నుమూశారు.పూలే తన సతీమణి సావిత్రి బాయి పూలేతో కలిసి పలు సాంఘిక ఉద్యమాలు చేశారు.


వ్యాసకర్త :- యం.రాం ప్రదీప్ జేవివి సభ్యులు, తిరువూరు, మొబైల్ :9492712836