జగిత్యాల జిల్లా మిల్లర్ల వద్ద  కస్టమైజ్డ్ మిల్లింగ్  ధాన్యం ఉందా ?

👉అధికారులు, మిల్లర్ల మిలాఖత్ ?


👉ఇష్టారాజ్యం గా ధాన్యం కేటాయింపు !

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లాలో  కస్టమైజ్డ్ మిల్లింగ్ రైస్ (CMR) ధాన్యం నిలువలు ఆయా రైస్ మిల్లులలో ఉన్నాయా ?  లేవా ?  అనే చర్చ మొదలైంది. సకాలంలో ప్రభుత్వం నిర్దేశించిన C.M.R (  కస్టమైజ్డ్ మిల్లింగ్ బియ్యం) ప్రభుత్వానికి  అప్పగించుకున్న సంబంధిత శాఖ అధికారులు బాధ్యులైన రైస్ మిల్లర్ల పై చర్యలు తీసుకోవడానికి మీనం మేషాలు లెక్కిస్తున్నట్టు చర్చ. ప్రభుత్వం అప్పగించిన ధాన్యం నిలువలు రైస్ మిల్లులో ఉన్నాయా ? లేదా ? అనే అంశంలోనూ అధికారులు ఉదాసీనత కనబరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాల నేపథ్యంలో  రైస్ మిల్లర్లతో అధికారులు కుమ్మక్కై వారితో పాటు  అధికారుల సైతం లక్షలాది రూపాయల లాభాలు గడుస్తున్నారనే ఆరోపణలకు  బలం చేకూరుతున్నాయి

వివరాల్లోకి వెళితే. 
జగిత్యాల జిల్లాలో 63 బాయిల్డ్, 75 రా రైస్ మిల్లులు ఉన్నాయి. ప్రభుత్వం ఖరీఫ్ రబీ సీజన్ ల లో కేవలం 60 రైస్ మిల్లులకే ప్రభుత్వం సీఎంఆర్ ధాన్యం కేటాయించింది. 2022-23 నాటికి బాయిల్డ్ రైస్ మిల్లులకు 4840, ACKs కేటాయించిన ధాన్యంలో  ( ఒక్క ACKs 280 క్వింటాల్ ఇది సివిల్ సప్లై వాళ్లు కోడ్ బాష) ప్రభుత్వానికి వారు చెల్లించింది 3398.ACKs. బకాయి పడిన బియ్యం చెల్లించాల్సింది 1442 ACks. రా రైస్ మిల్లులు 2970 ACKs  చెల్లించాల్సి ఉండగా 1674. ACKs చెల్లించారు. బకాయి పడిన బియ్యం 1296 ACKs.. చెల్లించాల్సి ఉంది. జిల్లాల మొత్తం 60 రైస్ మిల్లుల నుంచి 2739 ACKs ప్రభుత్వానికి చెందాల్సి ఉంది. ఈ వివరాలు డిసెంబర్ 12 నాటి వరకే. ఈ నెల 31 లోగా బకాయి ఉన్న 35 శాతం CMR బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉంది.
ఇందులో 28  రైస్ మిల్లు 100%. 9 రైస్ మిల్లు 90% కు పైగా బియ్యం చెల్లించారు. జగిత్యాల రూరల్ ఓ రైస్ మిల్ 292 ACKs చెల్లించాల్సి ఉండగా కేవలం 10 శాతం చెల్లించారు. బుగ్గారం 13%. జగిత్యాల రూరల్ 15% మాత్రమే ప్రభుత్వానికి అప్పగించారు. రాయికల్, మల్లాపూర్, కోరుట్ల కొన్ని రైస్ మిల్లులు ప్రభుత్వానికి డిసెంబర్ 12 నాటికి ఒక కిలో బియ్యం సైతం అప్పగించలేదని రికార్డులలో నమోదయింది.

👉డిఫాల్టార్లకు ధాన్యం కేటాయింపు !
ప్రభుత్వ ఉత్తర్వులు బేఖతార్ ?

సకాలంలో ప్రభుత్వ నిర్దేశించిన సమయానికి CMR   (కస్టమైజ్డ్ మిల్లింగ్ బియ్యం)  చెల్లించని రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించవద్దని ప్రభుత్వం  స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 

అక్టోబర్ 7న జి ఓ ఎమ్ ఎస్ నెంబర్ 26 లో. సివిల్ సప్లై, FCI  కి , గోనే సంచులు, టోల్ ఫ్రీ నంబర్  A గ్రేడ్ ధాన్యం, ₹ 2203/-, కామన్ ధాన్యం 2183/-  ధర వివరాలు, విధానాలను పేర్కొన్నారు.  సంబంధిత శాఖకు చెందిన కొందరు అధికారులు సిఎంఆర్ డిఫాల్టర్ల వద్ద  మొత్తంలో డబ్బులు తీసుకొని వారి మిల్లులకే నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కేటాయించారు అనే ఆరోపణలు  ఉన్నాయి. ఈ అంశాలపై  కొందరు రైస్ యజమానులు అధికారులను ప్రశ్నించగా, వారి వద్ద నుంచి జరిమానా వసూలు చేసాము, అందుకే వారికి ధాన్యం కేటాయించినట్టు అధికారులు వివరణ  ఇస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో  కొందరు రైస్ మిల్లుల యజమానులు, జిల్లా లో కీలక అధికారులను, రాజకీయాలను శాసించే స్థాయిలో ఉండడంతో మిల్లులలో ధాన్య నిలువలు తనిఖీలు చేపట్టిన సందర్భం లేదని, ఒకవేళ చేపట్టినా ఏదో మొక్కుబడిగా చేశారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ ఉత్తర్వులకు తూట్లు పొడిచారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా రైస్ మిల్లు యజమానులలో రెండు వర్గాలు ఏర్పడడంతో, సంబంధిత శాఖ అధికారులు ఆడింది ఆటగా, పాడింది పాటగా, ధాన్యం  కేటాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తే కొందరు రైస్ మిల్లర్ల, అధికారుల బాగోతంతో పాటు ధాన్యం నిలువల అంశాలు వెలుగు చూసే అవకాశం ఉందనే చర్చ .