జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 తాత్కాలికమైనదే!

👉సుప్రీంకోర్టు కీలక తీర్పు


J. SURENDER KUMAR,

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది.

ఆర్టికల్ 370 తాత్కాలికమైనదేనని స్పష్టం చేసింది. దీన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని తేల్చింది. జమ్ము కశ్మీర్​కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని, వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
కశ్మీర్​కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్.370 రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 370 తాత్కాలిక అధికరణం మాత్రమేనని స్పష్టం చేసింది. దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని తెలిపింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి అంతర్గత సార్వభౌమాధికారం లేదని తేల్చిచెప్పింది. రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయలేరని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్​తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది.
“భారత్‌లో విలీనం తర్వాత జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదు. తాత్కాలిక అవసరాల కోసమే ఆర్టికల్‌ 370 పెట్టారు. యుద్ధ పరిస్థితుల వల్లే ఆర్టికల్‌ 370ని ప్రవేశపెట్టారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. హక్కుల విషయంలో జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేకత ఏమీ లేదు. మిగతా రాష్ట్రాలు, యూటీలతో జమ్ము కశ్మీర్‌ సమానమే. ఆర్టికల్స్‌ 1, 370 ప్రకారం జమ్ము కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమే. భారత రాజ్యాంగానికి సంబంధించిన అన్ని నిబంధనలు జమ్ము కశ్మీర్​కు వర్తిస్తాయి. 370వ అధికరణను రద్దు చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయి.”సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.
జమ్ము కశ్మీర్​కు రాష్ట్ర హోదా వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. 2024 సెప్టెంబర్ 30 లోగా జమ్ము కశ్మీర్​కు ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఈసీకి స్పష్టం చేసింది. మరోవైపు, జమ్ము కశ్మీర్ నుంచి లద్దాఖ్​ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలన్న నిర్ణయాన్ని సైతం సమర్థిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
పిటిషనర్లు ఏమన్నారంటే?
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ సుబ్రమణ్యం, రాజీవ్ ధావన్, జఫర్ షా, దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఆర్టికల్ 370 తాత్కాలికం కాదని, జమ్ము కశ్మీర్ రాజ్యాంగ సభ రద్దు తర్వాత అది శాశ్వతత్వం పొందిందని సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ వాదించారు. ఆర్టికల్ 370 రద్దును పార్లమెంట్ చేపట్టలేదని అన్నారు. జమ్ము కశ్మీర్ రాజ్యాంగ సభ ప్రతిపాదించకుండా ఈ ఆర్టికల్​ను రద్దు చేయలేరని అన్నారు. విలీనం సందర్భంగా జమ్ము కశ్మీర్ విదేశాంగ, రక్షణ, సమాచారానికి సంబంధించిన అధికారాలను మాత్రమే అప్పటి మహరాజు భారత్​కు అప్పగించారని జమ్ము కశ్మీర్ హైకోర్టు బార్ అసోసియేషన్ వాదించింది. పరిపాలన, చట్టాల రూపకల్పన వంటి అధికారాలను రాష్ట్రానికే అప్పగించినట్లు తెలిపింది. జమ్ము కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ అధికరణ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. జమ్ము కశ్మీర్​ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టింది.