కరసేవకుల ఉద్యమ నేతల వేదిక పై నుంచి ప్రధాని ప్రసంగం ?

👉మూడు దశాబ్దాల క్రితం వారు చెప్పింది- నేడు జరిగింది!

J.SURENDER KUMAR,
మూడు దశాబ్దాల క్రితం అయోధ్య కర సేవకుల ఉద్యమ నేతలు ప్రసంగించిన స్థలంలోనే ప్రధాని నరేంద్ర మోడీ రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టానంతరం కొద్దిసేపు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అని చర్చ జరుగుతుంది.

అయోధ్యలో కర సేవకుల ఉద్యమ నేతలు 1992 డిసెంబర్ 6న ప్రస్తుతం నిర్మితమైన ఆలయం పక్కన ఉన్న స్థలం నుంచి ‘ ఇక్కడ గుడి నిర్మిస్తాం, రామ్ లల్లా ‘ వస్తాడు అంటూ కర సేవకులను ఉద్దేశించి ప్రసంగించారు.

అయోధ్యకు అతిరథులు రాక !

అయోధ్య రామ మందిర ప్రారంభ మహోత్సవానికి అతిరథ మహారథులు అయోధ్య నగరానికి చేరుకున్నారు, చేరుకుంటున్నారు.  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ , కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, సినీ నటులు రజినీకాంత్‌, అలియా భట్‌, రణబీర్‌కపూర్‌, జాకీ ష్రాఫ్‌, మాధురీ దీక్షిత్‌, కత్రినా కైఫ్‌-విక్కీ కౌశల్‌ దంపతులు, అనుపమ్ ఖేర్‌, కైలాష్‌ ఖేర్‌, హేమమాలిని ఇప్పటికే అయోధ్య రామాలయానికి చేరుకున్నారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ చైర్మన్  కరుణాకర్ రెడ్డి కూడా అయోధ్య ఆలయానికి చేరుకున్నారు.
నటి కంగనా రనౌత్ , పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి, సుమన్, వివేక్ ఒబెరాయ్ రామజన్మ స్థలానికి చేరుకున్నారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్ , మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ , యోగా గురు బాబా రాందేవ్‌ వచ్చారు. మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి. దేవేగౌడ అయోధ్య రామలయానికి చేరుకున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి 7వేలమందిని ఆహ్వానించగా అందులో A లిస్టులో 506మంది  ఉన్నారు. ఇందులో ప్రముఖ రాజకీయ నేతలతోపాటు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, దౌత్యవేత్తలు, న్యాయమూర్తులు, పూజారులు ఉన్నారు.

హెలికాప్టర్లతో పూల వర్షం

అయోధ్య రాముడికి హారతి ఇచ్చే సమయంలో హెలికాప్టర్లు పూల వర్షం కురిపించనున్నాయి. అదే సమయంలో 30 మంది సంగీత కళాకారులతో వివిధ వాయిద్యాలతో శ్రీరాముడిని కీర్తించనున్నారు. ఇప్పటికే అయోధ్యకు వెళ్లే దారిలో సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల సాంప్రదాయ నృత్యాలు భక్తులకు ప్రత్యేక అనుభూతులను పంచాయి. రామాయణ ఘట్టాలను వివరిస్తూ చేసిన నాట్యాలు ఆకట్టుకున్నాయి.