ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కంపెనీ ఏర్పాటు చేస్తాం.!

👉సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన గోద్రెజ్ కంపెనీ ప్రతినిధి బృందం !

👉సీఎం కార్యాలయ ప్రకటనలో..

J.SURENDER KUMAR,

గోద్రెజ్ ఆగ్రోవెట్ తెలంగాణలో మలేషియాకు చెందిన సిమ్ డార్బీ కంపెనీతో కలిసి ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటేడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు గోద్రెజ్ కంపెనీ ప్రతినిధుల బృందం మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివరించారు.

గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో భేటీ అయింది. గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం సింగ్ యాదవ్, ఇతర కంపెనీ ప్రతినిధులు చర్చలు జరిపారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఫర్నీచర్, కన్స్యూమర్ గూడ్స్ రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కంపెనీ ప్రతినిధులకు సూచించారు.


గోద్రెజ్ ఆగ్రోవెట్ తెలంగాణలో ఇప్పటికే పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. వంట నూనెలు, డెయిరీ, ఆగ్రో, వెటర్నరీ సర్వీసెస్, ఆగ్రో కెమికల్స్, పశువుల దాణా, వెటర్నరీ సర్వీసెస్ రంగాల్లో వ్యాపారం కొనసాగిస్తోంది.
ఇప్పటికే కంపెనీ చేపట్టిన ఆయిల్ పామ్, డెయిరీ బిజినెస్ ను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించాలని కంపెనీ ప్రతినిధులకు ఆయన సూచించారు.
ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఐటి మరియు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తదితరులు పాల్గొన్నారు.