👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
J.SURENDER KUMAR,
ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, తర్వాత అభివృద్ధే మా విధానం నినాదం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలకమైన రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ కు ఆయన గురువారం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
కేంద్రంలో ఎవరున్నా తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించాలని అడుగుతూనే ఉంటామని, సహకరించకపోతే, ప్రజలిచ్చిన శక్తితో కొట్లాడుతామని సీఎం అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి అభివృద్ధి కుంటూ పడుతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, రక్షణ శాఖ మంత్రి రాజ్జ్థ్ను కలిసి ప్రాజెక్టు అవసరాన్ని వివరించామని సీఎం అన్నారు.

ఈ కారిడార్ కోసం స్థానిక లోక్సభ సభ్యుడిగా అనేకసార్లు కేంద్రాన్ని కోరాననీ, కంటోన్మెంట్ బోర్డు సమావేశాల్లో కూడా లేవనెత్తానని అంశాన్ని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు కోసం రక్షణశాఖ కు కేటాయించాల్సిన భూముల ను కేటాయించ లేదని, చాంద్రాయ గుట్ట రక్షణ శాఖ భూముల లీజు ను రెన్యువల్ చేయకుండా గత ప్రభుత్వం జాప్యం చేసిన విషయాన్నీ సీఎం వివరించారు.
అధికారంలోకి రాగానే అధికారులతో సమీక్షించి రక్షణ శాఖకు భూములు అప్పగించామని అన్నారు. “కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం తో రాష్ట్రానికి కేంద్రం సహకరించింది. పదేళ్ల బీఆర్ఎస్ విధానాలతో ప్రజలకు శిక్ష పడింది, ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఎలివేటేడ్ కారిడార్ పూర్తి కావాలి అని, ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగాం. రాజకీయాల కోసం కాదు అన్నారు.
రాజీవ్ రహదారి, ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్ అభివృద్ధి చెందడమే కాకుండా, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఈ ప్రాజెక్టు ఆలస్యమైందని, ప్రజల అవసరాలను విస్మరించిందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని తెలిపారు.

ఓఆర్ఆర్ నిర్మాణం, అంతర్జాతీయ విమానాశ్రయం, హైటెక్ సిటీ వంటి అనేక ప్రాజెక్టులు పూర్తి చేసి హైదరాబాద్ను కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని గుర్తుచేశారు. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట వరకు 6 లేన్లతో 11.3 కిలోమీటర్ల పొడవున నిర్మించబోయే ఈ కారిడార్ పై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు.