👉నేడు ఫీల్డ్ మార్షల్ మానెక్ షా జయంతి!
***
స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్ళల్లోనే భారత దేశం పాకిస్తాన్, చైనా వంటి దేశాలతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పటి ప్రభుత్వాలు రక్షణ రంగం ఫై ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇటువంటి సమయం లో జనరల్ మానెక్ షా సైనికులలో ధైర్యం నింపారు.
సాహసోపేత భారత సైనికుడు, జాతీయ హీరో ఫీల్డ్ మార్షల్ మానెక్షా పూర్తి పేరు శాం హోర్ముస్జీ ఫ్రేంజీ జెమ్షెడ్జీ మానెక్ షా.1971లో పాకిస్తాన్తో యుద్ధంలో భారత్కు అతిపెద్ద సైనిక విజయాన్ని సాధించి పెట్టిన ఆయన బంగ్లాదేశ్ ఆవిర్భావానికి అద్యుడయ్యారు.
1914 ఏప్రిల్ 3వ తేదీన అమృతసర్లోని పార్శీ దంపతులకు మానెక్షా నలుగురు అన్నలు ఇద్దరు అక్కల మధ్య ఐదవ వాడిగా జన్మించారు. ఆయన తల్లిదండ్రులు గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్ అనే చిన్న పట్టణం నుంచి అమృతసర్, పంజాబ్ రాష్ట్రంకు వలస వచ్చారు.1937లో లాహోర్లో ఉన్నప్పుడు ఓ కార్యక్రమంలో సిల్లూ బోడె ను ఆయన కలిశారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. అదే ఏడాది ఏప్రిల్ 22న వారు వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు షెల్లీ బాట్లీవాలా, మాయా దారూవాలా.
అమృతసర్, నైనిటాల్లలో పాఠశాల విద్య పూర్తయ్యాక డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో క్యాడెట్గా తొలి బ్యాచ్లో మానెక్ షా చేరారు.1934లో ఆయన సైన్యంలో రెండో లెఫ్టినెంట్గా బాధ్యతలు చేపట్టారు.జూన్ 7, 1969 న జనరల్ కుమారమంగళం నుండి 8వ సైనిక దళాల ప్రదానాదికారిగా బాధ్యతలు స్వీకరించి.15, జనవరి 1973 న పదవీ విరమణ చేసారు.
బ్రిటిష్ జమానా మొదలుకొని నాలుగు దశాబ్దాల పాటు సైన్యంలో సేవలు అందజేసిన శాం మానెక్షా- రెండవ ప్రపంచ యుద్ధంలోను, భారత స్వాతంత్య్రానంతరం చైనా, పాకిస్థాన్లతో జరిగిన మూడు యుద్ధాల సందర్భంగాను ప్రదర్శించిన వ్యూహ చతురత, బుద్ధికుశలత అమోఘమైనవి.
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జపాన్ ఆక్రమిత దళాలను తిప్పికొట్టేందుకు ఉద్దేశించిన సైనిక విభాగం అధిపతిగా బర్మాలో ఆయన ప్రాణాలొడ్డి పోరాడారు. కడుపులోకి ఏడు గుళ్లు దూసుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. అపూర్వ ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇచ్చే అత్యున్నత పతకం ‘మిలిటరీ క్రాస్’ను మృతులకు ప్రకటించ రాదన్నది నియమం. మానెక్షా బతికి బట్టకట్టకపోవచ్చునని భావించిన నాటి మేజర్ జనరల్ డి.టి.కోవన్, తన ‘మిలిటరీ క్రాస్ రిబ్బన్’ను తక్షణం మానెక్షాకు ప్రదానం చేశారు. అదృష్టవశాత్తు మృత్యుముఖం లోంచి బయటపడిన మానెక్షా, మరోసారి బర్మాలో జపాన్ సైనికులను ఢీకొన్నారు. మళ్ళీ గాయపడినప్పటికీ వెన్నుచూపలేదు. జపాన్ సైనికులు లొంగిపోయాక, 10 వేల మందికిపైగా యుద్ధ ఖైదీలకు పునరావాసం కల్పించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.1947లో దేశవిభజన, 1947-48లో జమ్ముకాశ్మీర్లో సైనికచర్యల సందర్భంగా ఆయన తన పోరాటపటిమను మరోమారు లోకానికి చాటిచెప్పారు.
1971లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధం ఆయన వ్యూహనైపుణ్యానికి, దీక్షాదక్షతలకు అద్దంపట్టింది. ఆ యుద్ధంలో పాక్ చిత్తుగా ఓడిపోవడమేకాదు, 93000 మంది యుద్ధఖైదీలుగా పట్టుబడ్డారు. తరువాత బంగ్లా ఆవిర్భావానికి దోహదపడిన సిమ్లా అంగీకారం కుదర్చడం లోనూ ఆయనది కీలక భూమికే. ఆయన సమర్థ సారథ్యం దేశసైనిక దళాల్లో సరికొత్త విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం 1973 జనవరిలో మొట్ట మొదటి ఫీల్డ్మార్షల్గా పదోన్నతి కల్పించి, ఆయనను సముచితరీతిలో గౌరవించింది. భారత ప్రభుత్వం 1968 లో పద్మభూషణ్ తో సత్కరించింది.
ఒక సైనికుడికి, ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు నూటికి నూరు శాతం ఈయనలో గమనించవచ్చు. సైనికులకు మాత్రమే కాకుండా సాదారణ వ్యక్తులకు కూడా ఒక వ్యక్తి ఎంత సాధించగలడో ఉదాహరణగా నిలిచిన విశిష్ట వ్యక్తిత్వం ఈయన సొంతం.
ఉద్యోగ విరమణ అనంతరం ఈయన 9 కంపెనీలకి డైరెక్టర్ గా పనిచేసి వ్యాపార రంగంలో కూడా విజయవంతంగా రాణించి తన సమర్ధతని నిరూపించుకున్నారు. పదవీ విరమణ చేశాక మానెక్షా తమిళనాడు లోని నీలగిరి ప్రాంతంలో ఉన్న కూనూరులో స్థిరపడ్డారు
శాం మానెక్షా గొప్ప వక్త కూడా. మాటలోనే కాదు రాతలో కూడా స్పష్టత, క్లుప్తత, వ్యంగ్యం ఆయన సొంతం. సామాజికపరమైన, ముఖ్యంగా దౌత్య సంబంధమైన కార్యక్రమాలకు ఆయనను ముఖ్య అతిథిగా పిలిచేవారు.1999లో ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో హాస్యోక్తులలో 40 నిమిషాలపాటు అనర్గళంగా ప్రసంగించిన ఆయన, భారత సమాజాన్ని నాయకత్వ కొరతే పట్టిపీడిస్తోందంటూ చేదు నిజాన్ని చాటిచెప్పారు. అన్ని రంగాల్లో నెలకొన్న నాయకత్వ కొరతే దేశంలోని అస్తవ్యస్త పరిస్థితులకు కారణమని స్పష్టం చేశారు. వృత్తిపరమైన సామర్థ్యం, విజ్ఞానం, నిజాయతీ, నిష్పాక్షికత, ధైర్యం, విశ్వసనీయత, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల నిబద్ధత – ఇవీ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలని తెలియజేసి ఎన్నో లక్షలమంది సైనికులకి, సైనికులుగా చేరాలనుకున్న వారికే కాకుండా సామాన్యులకి కూడా స్ఫూర్తిగా నిలిచారు. న్యూమోనియాకు చికిత్స పొందుతూ 2008 జూన్ 26న తుదిశ్వాస విడిచారు.
వ్యాసకర్త : యం. రాం ప్రదీప్ తిరువూరు
మొబైల్ ..9492712836