ఏపీకి కేంద్ర బడ్జెట్ లో 15 వేల కోట్లు కేటాయించాలి మంత్రి కేశవ్!

👉 53 వ జీఎస్ టీ కౌన్సిల్ సమావేశాలలో!


J.SURENDER KUMAR,


అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా పునర్నిర్మించి, పునరుజ్జీవింపజేసే బృహద్లక్ష్య సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వచ్చే కేంద్ర బడ్జెట్ లో ₹ 15,000 కోట్లును అందుకు కేటాయించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్  ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.

రాష్ట్ర వ్యవసాయార్థిక జీవనాడి పోలవరం జాతీయ బహుళార్థసాధక ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసేందుకు సహాయ సహకారాలందించాల్సిందిగా కోరామన్నారు.


ఆంధ్రప్రదేశ్  ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం ప్రి-బడ్జెట్ మరియు 53వ జి.ఎస్.టి కౌన్సిల్ సమావేశాలలో పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో, భారత్ మండపం లో సమావేశాలను నిర్వహించారు.


సమావేశాల అనంతరం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్ భవన్ గురజాడ కాన్ఫరెన్స్ హాల్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 -2025 ఆర్థిక సంవత్సర బడ్జెట్ పై వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నుండి సలహాలు, సూచనల స్వీకరణకు ప్రి-బడ్జెట్ సమావేశం నిర్వహించారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పునర్నిర్మాణానికి రాష్ట్రాభివృద్ధి సహాయం (స్టేట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్)  కోరామన్నారు.


  వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమంలో (స్పెషల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్) భాగంగా నిధులు కేటాయించాలని అడిగామని తెలిపారు.  రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్ లు, పార్క్ లకు ముఖ్యంగా 2 నోడ్ లు విశాఖ-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లకు నిధులు కేటాయించాలని వివరించామన్నారు. 

మెగా టెక్స్టైల్ పార్క్, ఇంటిగ్రేటెడ్ అక్వా పార్క్ లకు నిధులు, రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరామని పేర్కొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం చేయూత అత్యవసరమనే విషయాన్ని వివరించామని తెలియజేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుస్థిర, సుధృడ నాయకత్వంలో రాష్ట్ర పునర్నిర్మాణం మరియు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. 2047 కల్లా వికసిత్ భారత్ సాధనలో మరియు త్వరితగతిన దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ మార్క్ ను చేరడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించబోతోందని పేర్కొన్నారు.

ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఆర్ధిక మంత్రుల సమావేశంలో చేయి చేయి కలిపిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్, మల్లు భట్టి విక్రమార్క ఆత్మీయ ఆలింగణనమ్ చేసుకున్నారు.