ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ క్యాంపస్‌లకు శ్రీకారం !

👉ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలు ఒకే చోటు !

👉పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో !

J.SURENDER KUMAR,

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలను ఒకేచోట ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలను వేర్వేరు చోట్ల కాకుండా ఒకేచోట కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ ఇంటిగ్రేటేడ్ క్యాంపస్‌లను నిర్మించనున్నారు.

పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఈ క్యాంపస్‌ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులతో సమీక్షించారు.


ఇంటిగ్రేటేడ్ క్యాంపస్‌ల నిర్మాణానికి ఆర్కిటెక్ట్స్ రూపొందించిన పలు నమూనాలను పరిశీలించారు. దాదాపు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలోని ప్రాంగణంలో ఈ సమీకృత గురుకులాల సముదాయం ఏర్పాటు చేయనున్నారు. ఒకే చోట ఈ భవనాలు నిర్మించి మినీ ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.