తొలి తెలుగు సినీ గేయ రచయిత చందాల కేశవ దాసు!

👉నేడు ఆయన జయంతి !


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మరుగునపడిన మహనీయులు ఎందరో వెలుగులోకి వచ్చారు.అటువంటి వారిలో చందాల కేశవ దాసు ఒకరు.

డా. పురుషోత్తమాచార్యులు ఆయన జీవితంపై పరిశోధన చేశారు. చందాల కేశవదాసు 1876 జూన్ 20న ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి ప్రజా వైద్యం నిర్వహించి, వ్యవసాయం కూడా చేసేవాడు. కేశవదాసు తండ్రి మరణించడంతో, అన్న పోషణలో పెరిగాడు. కేశవదాసు కూడా తన అన్న బడిలో చదువుతూ సంస్కృత అమరకోశాన్ని కంఠస్థం చేశాడు. దానితోపాటు చందస్సు, వ్యాకరణం, అవధానం మొదలైన ప్రక్రియలన్నింటిని అభ్యసించి, పాండిత్యాన్ని సంపాదించాడు. ఆ తర్వాత కేశవదాసే అక్కడి పిల్లలకు విద్య నేర్పేవాడు. ఆ విద్యార్థులను ప్రుచ్చకులుగా చేసుకొని అవధాన విద్యను సాధన చేశాడు.

కేశవ దాసుకు చిన్నతనం నుండి సంగీతం అంటే ఎంతో ఇష్టం. పాటలు, పద్యాలు అద్భుతంగా పాడేవాడు. హరికథాగానం చేపట్టి హరికథలు చెప్పడంలో గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించి జనహృదయాన్ని ఆకర్షించి హరికథా భాగవతారుగా ప్రసిద్ధి చెంది, తెలుగు నాట హరికథా భాగవతారుగా ప్రత్యేక స్థానాన్ని పొందారు.


కేశవ దాసు రాసిన ‘పరబ్రహ్మ, పరమేశ్వర, పురుషోత్తమ’ అనే పాటకు లక్ష్మీకాంతయ్య గారు బాణీ కూర్చి స్వరపరచడమే కాకుండా ఆ పాటను నాటక ప్రదర్శనకు ముందు ప్రార్థన గీతంగా ఆలపించాలని నాటక సమాజాలకు సూచించారు. నాటక సంస్థలకు పెద్దదిక్కుగా, ఆప్తుడుగా ఉన్న లక్ష్మీకాంతయ్య సూచనను నాటక సమాజం వారు చిత్తశుద్ధితో అమలుపరిచారు. నాటినుండి తెలుగునాట నాటక ప్రదర్శనకు ముందు కేశవ దాసు రాసిన పాటను ప్రార్ధన గీతంగా ఆలపించడం ఆనవాయితీగా మారింది.

ఇప్పటికీ సురభి నాటక సమాజం వారు తమ నాటక ప్రదర్శన ప్రారంభంలో ఈ పాటను పాడడం విశేషం.
కేశవదాసుకు సినిమా రంగం కూడా ఆహ్వానం పలికింది. 1931లో తీయబడిన తొలి తెలుగు టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’. ఆ చిత్రానికి పాటలు రాసే అవకాశం కేశవదాసుకు లభించింది. ఆ సినిమాకు పాటలు రాయడం ద్వారా చందాల కేశవదాసు తొలి తెలుగు సినిమా పాటలు రచయితగా గుర్తింపు పొందాడు ఆ తర్వాత సతీసక్కుబాయి, శ్రీకృష్ణతులాభారం, సతీ అనసూయ, లంకా దహనం, కనకతార, రాధాకృష్ణ , బాలరాజు వంటి చిత్రాలకు పాటలు రాశాడు. అలాగే పానుగంటి లక్ష్మీనరసింహారావు రాసిన ‘రాధాకృష్ణ’ నాటకానికి కేశవదాసు 21 పాటలు రాశారు.


నాటి స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై ఎన్నో దేశభక్తి పాటలు రచించి, రికార్డు చేయించి స్వాతంత్రోద్యమ సభలలో వినిపించేవాడు. ఆ ఉద్యమంలో తాను ప్రత్యక్షంగా పాల్గొన్నారు. నిష్కలంక దేశభక్తికి నిదర్శనం చందాల కేశవ దాసు. ఇలా కేశవదాసు శతకాలు, హరికథలు, నాటకాలు,పద్యాలు, దండకాలు,మంగళహారతులు, జోల పాటలు మొదలైన ప్రక్రియల్లో ఎన్నో రచనలు చేశారు.

ఆయనకు ఆంధ్రసూత, నటనావతంస, కలియుగ దశరథ వంటి బిరుదులు కలవు. కేశవదాసు సంస్కరణవాది. ఆయన ఏనాడు కుల వివక్షను పాటించలేదు. మనుషుల్లో హెచ్చుతగ్గులు కులాన్ని బట్టి కాదు వారి సంస్కారాన్ని బట్టి ఉంటాయని వాదించేవాడు.ఆయన ఎన్నో దాన ధర్మాలు చేశారు. తిరువూరు లో తీర్ధ యాత్రికుల కోసం ఒక బావిని తవ్వించారు.

ఆధ్యాత్మిక చింతన, భగవత్ భక్తి, ప్రజాసేవలకు దీటైనవి ఏమీ లేవని భావించిన కేశవదాసు తన చివరి రోజుల్లో నాయకన్ గూడెం చేరి అక్కడ ప్రజలకు ఉచిత వైద్య సేవ చేశాడు. అక్కడే ఒక తపస్విలా జీవితాన్ని గడిపి 1956 మే 14న మరణించారు.ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా చేయాల్సిన అవసరం వుంది.


వ్యాసకర్త : యం రాం ప్రదీప్,తిరువూరు
మొబైల్: 9492712836