👉బహరేన్ ప్రభుత్వం భారత రాయబారికి లేఖ !
👉28 ఏళ్ల క్రితం బహరేన్ కు వెళ్లిన నరసయ్య !
J.SURENDER KUMAR,
తెలంగాణకు చెందిన మానువాడ నర్సయ్య (62) అనే వృద్ధుడు ప్రస్తుతం బహరేన్ జైలులో మగ్గుతున్నాడు. ఇతని పేరును బట్టి తెలంగాణ వ్యక్తిగా భావిస్తున్నారు. బహరేన్ ప్రభుత్వ సంస్థ ‘లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ’ (ఎల్ఎంఆర్ఏ) ఇన్స్పెక్షన్ మేనేజర్ 2024 జనవరి 8న బహరేన్ లోని భారత రాయబారికి లేఖ రాయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మానువాడ నర్సయ్య పాస్పోర్ట్ అందుబాటులో లేదు, చట్టవిరుద్ధమైన స్థితిలో ఉన్నాడు. అతన్ని బహరేన్ నుంచి భారత్ కు పంపించడం (డిపోర్ట్) కోసం ఇండియన్ ఎంబసీ వారు ‘అవుట్ పాస్’ (తాత్కాలిక పాస్పోర్ట్) జారీ చేయాలని ఆ లేఖలో కోరారు.

28 ఏళ్ల క్రితం… 1996 సెప్టెంబర్ 23న బహరేన్ దేశానికి చేరుకున్నప్పుడు మానువాడ నర్సయ్య వయస్సు 34 సంవత్సరాలు. ది అరబ్ ఇంజనీరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీలో మూడేళ్ళ పాటు తాపీ మేస్త్రీ గా పనిచేసి ఆగస్టు 1999 లో వర్క్ పర్మిట్ ముగిసినట్లు ఎల్ఎంఆర్ఏ రికార్డుల వలన తెలుస్తున్నది. హైదరాబాద్ పాస్పోర్ట్ కార్యాలయం లో జి-374083 నెంబర్ తో మానువాడ నర్సయ్యకు 1989 సెప్టెంబర్ 22న పాస్పోర్ట్ జారీ చేశారు. ఈ పాస్పోర్ట్ గడువు 1999 సెప్టెంబర్ 21న ముగిసింది.

ఈ వివరాలు బహరేన్ లోని సామాజిక కార్యకర్త నోముల మురళి, హైదరాబాద్ లోని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి ద్వారా ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి దృష్టికి తెచ్చారు. హైదరాబాద్ పాస్పోర్ట్ అధికారి పాత రికార్డులను పరిశీలించి (సెర్చ్) చేసి మానువాడ నర్సయ్య చిరునామా కనుక్కొని, సంబంధిత జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ల ద్వారా నివేదిక తెప్పించి బహరేన్ లోని ఇండియన్ ఎంబసీకి పంపిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఈ మేరకు టి. జీవన్ రెడ్డి సంబంధిత అధికారులకు ‘ఎక్స్’ ద్వారా ట్వీట్ చేశారు.