👉ప్రపంచ జనాభా దినోత్సవం
ఆధునిక కాలంలో మానవ వనరులకు చాలా ప్రాధాన్యత పెరిగింది. పెరుగుతున్న జనాభా కు అనుగుణంగా వనరులు పెరగడం లేదు. ముఖ్యంగా సహజ వనరులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. 1987 “జూలై 11″న ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకుంది.
ఈ రోజును “ప్రపంచ జనాభా దినం”గా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఇక 1989 నుండి క్రమం తప్పకుండా ప్రతి ఏడాది జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.
నానాటికి పెరుగుతున్న జనాభా.. తద్వారా తలెత్తే దుష్పరిణామాలను ప్రజలకు వివరించేందుకు, వారికి ఆయా సమస్యలపై అవగాహన కలిగించడమే “ప్రపంచ జనాభా దినోత్సవ” ఆశయం. 2008 జూన్ 28 నాటికి ప్రపంచ జనాభా 6.7 బిలియన్ల వద్ద ఉండగా, 2012 నాటికి ఏడు బిలియన్లను చేరుకుందని ఐరాస తెలిపింది. మరో యాభై ఏళ్లలో ప్రపంచ జనాభా 9 బిలియన్లను చేరే అవకాశముందని కూడా సమితి పేర్కొంది. కాగా… అమెరికా 304 మిలియన్ల మంది జనాభాతో మూడో స్థానంలో ఉండగా… చైనా, భారత్లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
పెరుగుతున్న జనాభాలో అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలకపాత్ర పోషిస్తున్నట్టు ఈ సందర్భంగా సమితి అభిప్రాయపడింది. భారత్, అమెరికా, చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ తదితర తొమ్మిది దేశాలు వచ్చే 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం శాతాన్ని ఆక్రమిస్తాయని సమితి తెలిపింది. భూ మండలంలో మానవజాతి అతి వేగంగా పెరిగిపోతున్న నేపథ్యంలో జనాభా నియంత్రణ, స్థిరీకరణ లాంటి అనేక విషయాలపై జనంలో అవగాహన పెంచడం, చైతన్యం తీసుకురావడం ఈఉత్సవ ముఖ్యోద్దేశం.
జీవరాసులలోకెల్లా మానవజాతి అత్యంత తెలివైనది. మానవుడు తను జీవించడానికి ప్రకృతి సిద్ధమైన వనరులను, భూ, జల సంపదను వాడినంతగా ఈ జగత్తులో మరే ప్రాణి వాడదు. అంతేకాదు. మానవజాతి తన మనుగడ కోసం, అవసరాల కోసం, విలాసాల కోసం ఇతర ప్రాణులను కూడా సహజ వనరులతోపాటు సమూహంగా నాశనం చేయగలదు. మానవుడు తన అవసరాలు, విలాసాల కోసం అద్భుతాలను సృష్టిస్తున్నాడు. ఈ పరివర్తన వెనుక ప్రకృతి వనరుల నిర్మూలనలు, పశు, పక్ష, వృక్ష జాతి వినాశనలు, బలిదానాలు దాగి ఉన్నాయి అన్న నగ్నసత్యాన్ని విస్మరించకూడదు.
జనాభాకు, పర్యావరణానికి ప్రత్యేక సంబంధం ఉన్నది. విశ్వంలో మూడొంతులు నీరు ఉంటే ఒక వంతు భూమి ఉంది. జనాభా ఇంతై… ఇంతింతై… అన్నట్లుగా పెరిగిపోతే జగమంతా జనమయమైతే ఏం జరుగుతుంది? భూమాత భారం ఎంతని మోస్తుంది? పర్యావరణ, వాతావరణ, వనరుల స్థితిగతులు ఏవౌతాయి? ప్రజల జీవన ప్రమాణాల పయనం ఎలాగుంటుంది? అంతా అగమ్యగోచరం. ప్రమాదకరం. ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. అధిక జనాభావల్ల కలిగే దుష్ఫలితాల నివారణ పథకాలు, దిద్దుబాటు చర్యలు, కట్టుబాట్లను కనుగొనాలి.
ఈ ఆలోచనలు ప్రపంచ గణాంక శాస్తవ్రేత్తలను, జనాభా నియంత్రణ నిపుణులను సుమారు అర్ధశతాబ్దం క్రితమే జాగరూకల్ని చేసాయి. అప్పటి నుంచి ప్రపంచ జనాభాను కట్టుదిట్టం చేయాలని, తద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచాలని ప్రపంచ దేశాలలో చర్యలు మొదలైనాయి.
హద్దూ, అదుపులేకుండా పెరిగే ప్రపంచ జనాభాను పరిశీలిస్తే ఎంతటి ప్రమాద స్థాయికి చేరుకుందో బోధపడుతుంది. .
తాజా గణాంకాల ప్రకారం ప్రపంచ జనాభా గడియారం ప్రకారం ప్రతి సెకనుకూ ఐదుగురు పుడుతున్నారు. ఇద్దరు చనిపోతున్నారు. అంటే ప్రపంచంలో భూమిమీద ప్రస్తుతం ఒక సెకెండుకు సగటున ముగ్గురు పెరుగుతున్నారన్నమాట. ఇంకా లోతుగా పరికిస్తే నిమిషయానికి 180 మంది, గంటకు 10,800 మంది, రోజుకు 2,59,200 మంది ప్రతి ఏడాదికి 9,46,08,000 పెరిగిపోతున్నారు. మరో పక్క భూ సంపద క్షీణిస్తున్నది.
2011 మార్చి 1వ తేదీ నాటికి మన దేశ జనాభా 121,01,99,422. అందులో పురుషులు సుమారు 62 కోట్లు కాగా, స్ర్తిలు సుమారు 58 కోట్ల పైచిలుకు మాటే. ఇంకో వాస్తవము గత పదేళ్ళ కాలంలో మన దేశ జనాభా 18.1 కోట్లు పెరిగింది. మన దేశ జనాభా అమెరికా, ఇండోనేషియా, బ్రిజెల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జపాన్ దేశాల మొత్తం జనాభాతో సమానం. మన దేశం జనాభా పెరుగుదల ఇదే రీతిలో కొనసాగితే 2025 నాటికల్లా అధికారింకంగా భారత్ చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల దేశంగా ఆవిర్భవించడం తథ్యం అని అమెరికా గణన సంస్థ వెల్లడించింది. సత్వరమే భారత్ దిద్దుబాటు చర్యలు, జనస్థిరీకరణ, నియంత్రణకు పూనుకవాలి. లేదా ఆఫ్రికా దేశాల మాదిరి ఆకలి, దారిద్య్రము, కరువు రక్కసులు పడగలిప్పడం అనివార్యం అనడంలో మరో మాట లేదు.
2024లో ప్రపంచ జనాభా 8.1బిలియన్స్ గా వుంది.
ప్రపంచంలోనే కుటుంబ నియంత్రణ పథకాలను అధికారికంగా ప్రవేశపెట్టిన దేశం మన దేశమే. 1950లోనే కుటుంబ నియంత్రణ కొరకై నూతన సూత్రీకరణాలను చేసి లక్షలు, కోట్లు ఖర్చు చేసింది. అయినా ఆశించిన ఫలితాలు సాధించలేక పోయినాము. కారణాలు అనేకం కావచ్చును. ముఖ్యమైనవిగా పేర్కొనాల్సినవి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడం. ప్రభుత్వ పథకాలలో అవకతవకలు, పారదర్శకత లోపించడం, మూఢనమ్మకాలు, అవిద్య, స్ర్తి సాధికారిత లేకపోవడం. ఇదే విషయంలో 1976లో భారత్లో (పాపులేషన్ కంట్రోల్ పాలసి) జనాభా నియంత్రణ పథకాన్ని అమలులోకి తెచ్చారు.
దీనివల్ల జనాభాను మన ఆర్థిక రంగానికి అనుగుణంగా అన్ని కోణాలలో తీర్చి దిద్దడం. ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చడం, జన జీవన శైలిని, ప్రమాణాలను వృద్ధి పర్చడం జరిగింది. ఈ భూమీద వందకోట్ల మందికి పౌష్టికాహారం దొరకడం లేదు. 40 కోట్ల మందికి ఆహారం దొరకడం లేదు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని అధిక జనాభాగల దేశాలు తక్షణమే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రజలు మూఢనమ్మకాలను వీడి, కులాలకు, మతాలకు అతీతంగా కుటుంబ నియంత్రణ పథకాలను ఆచరించాలి. ‘ఒక బిడ్డ ముద్దు – రెండోది వద్దు’ అన్న నినాదం అక్షర సత్యాన్ని చేయాలి.
స్త్రీ సాధికారిత పెంచాలి. స్త్రీ విద్యను పోషించాలి. స్త్రీ విద్యావంతురాలైతే సమాజం ఉన్నతస్థాయికి చేరడం ఖాయం. ముఖ్యంగా యువతరం నడుం కట్టాలి.
జనాభాను అదుపుచేసి విద్యావ్యాప్తి చేసి ప్రతి ఒక్కరు మానవ బాంబుగా కాక మానవ వనరుగా మారిన రోజున దేశభ్యుదయానికి వందకోట్ల మార్గాలున్నాయి అనడంలో అతిశయోక్తి ఏ మాత్రమూ లేదు.
కరోనా కారణంగా 2021లో చేపట్టవలసిన జనాభా లెక్కల నిర్వహణ జరగలేదు. అందువల్ల ప్రస్తుత దేశ జనాభా వివరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు.వనరులను పెంచుకోకపోతే పెరుగుతున్న జనాభాకు, సహజ వనరులకు మధ్య సమతుల్యత దెబ్బతింటుంది.కొన్ని దేశాల్లో జనాభా పెరుగుతుండగా, మరికొన్ని దేశాల్లో జనాభా తగ్గుతుంది. జనాభా పెరుగుతున్న ఆఫ్రికా దేశాలు పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలతో సతమతం అవుతున్నాయి.కుటుంబ నియంత్రణ పాటించడం, స్త్రీ విద్యకు ప్రోత్సాహం, సహజ వనరులని కాపాడు కోవడం వంటి ద్వారా పెరుదలకు కొన్ని పరిష్కార మార్గాలు చూపవచ్చు.
వ్యాసకర్త : యం. రాం ప్రదీప్,తిరువూరు
మొబైల్ 9492712836