తెలుగు రాష్ట్రాల సీఎంల రేవంత్ రెడ్డి చంద్రబాబు సమావేశం !

J.SURENDER KUMAR,

విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య సుధీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై జ్యోతీరావు పూలె ప్రజాభవన్‌లో శనివారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగింది.


👉 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఏపీ మంత్రులు సత్యప్రసాద్, కందుల దుర్గేష్, బీసీ జనార్ధన్‌రెడ్డి లతో పాటు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


👉 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలను పరిష్కరించుకోవడానికి ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల స్థాయిలో ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది.


👉 పైస్థాయిలో నిర్ణయాలు తీసుకోవలసిన అంశాలను పరిశీలించి నిర్ణయించడానికి ఇరు రాష్ట్రాల మంత్రుల స్థాయిలో మరో కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది.


👉 మంత్రుల స్థాయి కమిటీలో అంగీకారానికి రాలేని ఏవైనా అంశాలంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించింది.


👉 మాదక ద్రవ్యాల నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ విషయంలో తెలంగాణ విజ్ఞప్తి మేరకు ఇరు రాష్ట్రాల నుంచి అదనపు డీజీ స్థాయి అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది.