స్కిల్ యూనివర్సిటీ చైర్‌పర్సన్‌గా ఆనంద్ మహీంద్రా !

👉 కో-చైర్మన్‌ గా శ్రీనిరాజు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ !


J.SURENDER KUMAR,


ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ” బోర్డ్ ఆఫ్‌ గవర్నర్స్ చైర్‌పర్సన్‌గా ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా నియమితులయ్యారు.
ప్రముఖ విద్యా వేత్త శ్రీనివాస సి.రాజు ఈ యూనివర్సిటీకి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడిగా, కో-చైర్మన్‌ హోదాలో నియమితులయ్యారు.

ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఏడాది పాటు పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆనంద్ మహీంద్రా అటోమొబైల్, ఏయిరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఐటీ వంటి రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన మహీంద్రా గ్రూపు సంస్థలకు చైర్మన్‌గా ఉన్నారు.


హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (ఆసియా-ఫసిఫిక్ అడ్వయిజరీ బోర్డు) హార్వర్డ్ గ్లోబల్ అడ్వయిజరీ కౌన్సిల్ అడ్వయిజరీ కమిటీ, ఆసియా బిజినెస్ కౌన్సిల్ వంటి అనేక ప్రతిష్టాత్మక సంస్థలకు సభ్యుడిగా ఉన్నారు. పద్మభూషణ్ తో పాటు ఆయన అనేక అవార్డులు అందుకున్నారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలోనే ఆనంద్ మహీంద్రాతో సమావేశమైన సందర్భంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, లక్ష్యాలను వివరించి దానికి చైర్‌పర్సన్ గా కొనసాగాలను కోరిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్ ఇండియా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఇటీవలే అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది.