చారిత్రక కట్టడాలు పర్యటక ప్రాంతాలు సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR


హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తూ వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి అడుగు ముందుకు పడింది. పలు చారిత్రక పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులు ముందుకొచ్చారు.

👉 CII తెలంగాణ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎం సచివాలయంలో సమావేశమయ్యారు. మంత్రి జూపల్లి కృష్ణారావు , ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో నగరంలోని పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు ఆయా సంస్థలు ముందుకొచ్చి సీఎం సమక్షంలో పర్యాటక శాఖతో ఒప్పందాలు చేసుకున్నాయి.


👉 ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాటి పరిరక్షణ కోసం పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


👉మూసీ పరివాహన ప్రాంతంలో చారిత్రక భవనాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, మూసీ ప్రక్షాళన కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు.


👉 పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్దరిస్తున్నామని, త్వరలోనే అందులో శాసనమండలి కార్యకలాపాలు నిర్వహిస్తామని వెల్ల‌డించారు.


👉 జూబ్లీహాల్‌కు చారిత్ర‌క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని దాని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని సీఐఐకి సూచించారు.


👉ఉస్మానియా ఆస్పత్రి భవనాలు, హైకోర్టు, సిటీ కాలేజీ, పురానాపూల్ బ్రిడ్జి వంటి చారిత్రక కట్టడాలను కాపాడుకోవాలన్నారు.


👉నగరంలోని పురాతన మెట్ల బావులను పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్దరణను ఇన్ఫోసిస్ సంస్థ, మంచిరేవుల మెట్ల బావిని లైఫ్ సైన్సెస్ సంస్థ దత్తత తీసుకున్నాయి.


👉 సాలార్ జంగ్, అమ్మపల్లి బావులను భారత్ బయోటెక్ సంస్థ, అడిక్‌మెట్ మెట్ల బావిని దొడ్ల డైరీ సంస్థ, ఫలక్‌నుమా మెట్ల బావిని టీజీఆర్టీసీ సంస్థ, కోఠీలోని రెసిడెన్సీ మెట్ల బావిని ఉమెన్స్ కాలేజీ పునరుద్దరించనున్నాయి.