👉 4 న కోరుట్ల లో జువ్వాడి కాంస్య విగ్రహ ఆవిష్కరణ..
👉 రత్నాకర్ రావు 96 జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం .
J.SURENDER KUMAR,
ఆరు దశాబ్దాల రాజకీయ రంగంలో మచ్చలేని రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఆయన అలుపెరుగని రాజకీయ ప్రయాణం కొనసాగించారు. ఆయన వద్దకు అనేక అత్యున్నత పదవులు పరుగు పరుగున వచ్చాయి.
అధికార దర్పంతో నియంతలా శాసించే అధికారం ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఆయన ఆపద్బాంధవుడు అయ్యారు. అధికార, అనధికార తుపాకుల నీడలో జీవనం కొనసాగించే మారుమూల గ్రామాల్లో సైతం ఆయన కలియతిరిగారు, బడుగు బలహీనవర్గాలకు తాగు సాగు నీరు కూడు, గూడు కల్పన కోసం ఆయన లక్ష్యం, ఆశయం, తపన, చూసి నక్సలైట్లు వర్గాలు సైతం ఆయన దారికి అడ్డు రాలేదు, అడ్డంకులు సృష్టించ లేదు.
తన చివరి శ్వాస వరకు ప్రజా సంక్షేమం పనుల కోసం పరితపించాడు. ఆయనే స్వర్గీయ మాజీ దేవాదాయ శాఖ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు. నియోజకవర్గ కేంద్రమైన కోరుట్లలోని పశు వైద్య కళాశాల ప్రాంగణం ముందు ఏర్పాటు చేసిన ఆయన కాంస్య విగ్రహం శుక్రవారం ఆవిష్కరణ కానున్నది..
👉 రత్నాకర్ రావు గూర్చి…..
స్వర్గీయ రత్నాకర్ రావు ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలో 1928 అక్టోబర్, 4న వెంకటేశ్వరరావు,రుక్కమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు ఆరుగురు తోబుట్టువులు, ముగ్గురు సోదరులు ఆయన 2020 మే 10న స్వర్గస్తులైనారు.
రెండు పర్యాయములు తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గా రెండుసార్లు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పాలకవర్గ అధ్యక్షుడిగా, జగిత్యాల పంచాయతీ సమితి అధ్యక్షుడి పదవులు నిర్వహించారు.
👉 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా తొలి గెలుపు.!
1989లో బుగ్గారం అసెంబ్లీకి స్వతంత్ర శాసనసభ్యుడిగా 1999, 2004లో ఎమ్మెల్యేగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలకవర్గ సభ్యులుగా, ఆధునిక వ్యవసాయ పద్ధతుల అధ్యయనం కోసం రెండుసార్లు ఇజ్రాయిల్ దేశానికి ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన వెళ్లారు. వైయస్ రాజశేఖర్రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ, స్టాంపులు శాఖ మంత్రిగా ఆయన కొనసాగారు. ధర్మపురి లోని శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాల పాలక వర్గ అధ్యక్షుడిగా చివరి శ్వాస వరకు కొనసాగారు.
👉 క్లుప్తంగా — తెలంగాణ వివక్షత పై గళమెత్తిన యోధుడు.!
ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు అంటే రాజమండ్రి లో పుష్కర స్నానాలు అంటూ వేల కోట్ల నిధులు కేటాయించడం ఆ ప్రాంత అభివృద్ధి పరచడం తెలిసిందె. 1991 గోదావరి పుష్కరాల సందర్భంగా సీమాంధ్ర ప్రభుత్వం తో తెలంగాణలో గోదావరి నది ఉందని ఇక్కడ పుష్కరాలు జరుగుతాయి నిధులు ఇవ్వండి అంటూ స్వర్గీయ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు, తో కలిసి మంథని, కాళేశ్వరం, ధర్మపురి క్షేత్రాలకు 30 లక్షల నిధులు మంజూరు చేయించారు.
👉ఒక్క మండలానికి రెండు జూనియర్ కళాశాల మంజూరు.!
వైయస్ ప్రభుత్వ హయాంలో మండలానికో ప్రభుత్వ జూనియర్ కళాశాల ను మంజూరు చేయగా, నియోజకవర్గంలోని సారంగాపూర్ మండలం నైసర్గిక గంగా బీర్పూర్ గుట్ట కింద.10 గ్రామాలు సారంగాపూర్ పరిధిలో10 ఉన్నాయి రెండు ప్రాంతాల ప్రజలు తమ తమ అ ప్రాంతం నికే కళాశాల అంటూ పోటీ పడ్డారు. అప్పటి సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి నీ ఒప్పించి ఒకే మండలానికి రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయించి ఉమ్మడి రాష్ట్రంలో జువ్వడి చరిత్ర సృష్టించారు.
👉నక్సలైట్ల శాంతి చర్చల్లో ప్రతిపాదన.!
వైయస్ ప్రభుత్వ హయాంలో నక్సలైట్లకు ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు జరిగాయి అందులో అనేక డిమాండ్లతో పాటు 1995 నవంబర్ 15న జీవితకాల శిక్ష పడిన నక్సలైట్లు బీర్పూర్ కు చెందిన సముద్రాల మల్లేశం, తుంగుర్ కు చెందిన శీలం రమేష్, ఆదిలాబాద్ కు చెందిన బండి ప్రకాష్ ను, భేషరతుగా, రాజకీయ ఖైదీలు గా విడుదల చేయాలని అప్పుడు చర్చలో పాల్గొన్న నక్సలైట్ నాయకులు అక్కిరాజు రామకృష్ణ, ఆజాద్ డిమాండ్ పెట్టారు. చర్చలు అర్ధాంతరంగా ముగిసిన అప్పటి మంత్రివర్గంలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రత్నాకర్ రావు ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి రాజకీయ ఖైదీలు గా ఈ నక్సలైట్ నాయకులను గుర్తిస్తూ ప్రభుత్వం ద్వారా ప్రత్యేక జీవోను జారీ చేయించి విడుదల చేయించారు.

👉తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష సమావేశాలలో.!
నవంబర్ 16 2005వ సంవత్సరంలో జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జర్నలిస్ట్ సంఘం పక్షాన ” తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మీడియాలో వ్యక్తీకరణ ” అనే అంశంపై కరీంనగర్ ప్రెస్ భవన్ లో సెమినార్ జరిగింది. ఈ సమావేశంలో ప్రొఫెసర్ స్వర్గీయ జయశంకర్ సార్, ఆచార్య స్వర్గీయ బియ్యాల జనార్దన్ రావు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మీడియా మాజీసలహాదారు, మన తెలంగాణ సంపాదకులు, దేవులపల్లి అమర్, తెలంగాణ మీడియా మాజీ చైర్మన్ అల్లం నారాయణలు పాల్గొన్నారు. ఈ సెమినార్ లో పాల్గొన్న రత్నాకర్ రావు, తెలంగాణ ప్రాంతం పట్ల జరుగుతున్న వివక్షత, దోపిడికి గురి అవుతున్న తీరుతెన్నులు తదితర అంశాలను ఆయన వివరించడంతో ఆ సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్, తన ప్రసంగంలో రత్నాకర్ రావు కు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ మీకు నేను శిరస్సువంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను సర్ అంటూ తన ప్రసంగంలో పేర్కొనడం గమనార్హం.
👉ధర్మపురి ఆలయ అభివృద్ధిలో.!
దేవాదాయ శాఖ మంత్రిగా జువ్వాడి కొనసాగిన ఈ సమయంలో ధర్మపురి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం ముప్పై రెండు గదుల నిర్మాణం శ్రీ నిధి నుంచి కోటి రూపాయలు మంజూరు చేస్తూ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన అన్నవరం, శ్రీశైలం, ద్వారకా తిరుమల, సింహాచలం, విజయవాడ కనకదుర్గ, భద్రాచలం, యాదగిరిగుట్ట ఆలయం నుంచి దాదాపు కోటి రూపాయలు దేవాలయం నిధులను విరాళంగా సాధించిన ఘనత ఆయనది.
👉ధూపదీప నైవేద్యం ఫైలుపై తొలి సంతకం!
ఉమ్మడి రాష్ట్రంలో దూప దీప నైవేద్యం పథకానికి తను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి సంతకం ఆ ఫైలు పైనే ఆయన చేశారు.
👉ఉమ్మడి రాష్ట్రంలో తొలి పశు వైద్య కళాశాల.!

కోరుట్ల పట్టణంలో ఉమ్మడి రాష్ట్రంలో తొలి పశువైద్య కళాశాల ఏర్పాటు తదితర అనేక సంక్షేమ కార్యక్రమాలు పథకాలు, సాగు, తాగునీరు, సౌలభ్యం, ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణాల ప్రగతి నేటికీ జగిత్యాల జిల్లా లోని మారుమూల గ్రామాల్లో ప్రత్యక్షంగా అగుపిస్తాయి.
జువ్వాడి రత్నాకర్ రావు విగ్రహ ఏర్పాటు ఓ చారిత్రక అవసరం, భావితరాల సమాజం ఈయన సేవలు గుర్తించడానికి, తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. రాజకీయాలకు ఆతీతంగా విలువల తో కూడిన రాజకీయ నేపథ్యంలో స్వర్గీయ రత్నాకర్ రావుది. ఆయన విగ్రహం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ రాజకీయ చరిత్రగా, చరిత్రపుటల్లో నిలిచిపోతుంది.
నిస్వార్థ, నిజాయితీ రాజకీయాలకు, రాజకీయ విలువలకు ప్రతిరూపం స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు అపర చాణక్యుడిగా, రాజకీయ భీష్మాచార్యుడు గా చరిత్ర పుటలలో కొనసాగుతారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
👉ఆవిష్కరణకు అతిరథ మహారథులు రాక!
రత్నాకర్ రావు విగ్రహావిష్కరణకు శుక్రవారం కోరుట్ల పట్టణానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి .శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, లక్ష్మణ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీ, బోనగిరి ఎంపీ చామల హరికృష్ణ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి లు పాల్గొంటారని, రత్నాకర్ రావు తనయులు, జువ్వడి నర్సింగరావు, కృష్ణారావు, చంద్రశేఖర రావు లు తెలిపారు.