హైదరాబాద్‌లో ఫార్మా దిగ్గజ కంపెనీల భారీ పెట్టుబడులు !


J. SURENDER KUMAR,


కాలుష్య రహిత యూనిట్ల ఏర్పాటుకు ప్రముఖ ఫార్మా దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. తమ కార్యకలాపాల విస్తరణతో పాటు గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.


👉సచివాలయంలో వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులతో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సంప్రదింపులు అనంతరం ఎంవోయూలపై ప్రతినిధులు, అధికారులు సంతకాలు చేశారు.


👉ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ కంపెనీలతో ఎంవోయూలు జరిగాయి.


👉ఈ ఆరు కంపెనీలు దాదాపు రూ.5,260 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ కంపెనీల విస్తరణ కార్యకలాపాల వల్ల ఫార్మా రంగంలో 12,490 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే గుర్తించిన ఫార్మా సిటీలో వీటికి అవసరమైన యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాలు కేటాయించనుంది.


@@@@  ఎంవోయూల ప్రకారం  @@@@


👉 ఎంఎస్ఎన్ ల్యాబ్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌తో పాటు ఆర్ అండ్ డీ సెంటర్ ఏర్పాటు చేస్తుంది.


👉 లారస్ ల్యాబ్స్, అరబిందోలు ఫార్ములేషన్ యూనిట్లు నెలకొల్పుతాయి.


👉 గ్లాండ్ ఫార్మా ఆర్ అండ్ డీ సెంటర్, ఇంజెక్టబుల్స్, డ్రగ్ సబ్‌స్టన్స్ మాన్యుఫాక్చర్ యూనిట్లను స్థాపిస్తుంది.


👉 డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఇంజెక్టబుల్స్‌, బయో సిమిలర్స్ యూనిట్ ఏర్పాటు చేస్తుంది.


👉 హెటిరో గ్రూప్ ఫినిషిడ్ డోస్, ఇంజెక్టబుల్స్‌ తయారీ పరిశ్రమ నెలకొల్పుతుంది.

👉మరో నాలుగు నెలల్లో ఈ ఫార్మా కంపెనీలు తమ నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా స్థలాలను కేటాయించటంతో పాటు, ఫార్మా సిటీలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  సంబంధిత అధికారులను ఆదేశించారు.

👉ఈ అవగాహన ఒప్పందాల సందర్భంగా టీజీఐఐసీ (TGIIC) చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి , పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ , సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి , పరిశ్రమలు (పెట్టుబడులు) ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి  పాల్గొన్నారు.


👉కంపెనీల తరఫున డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ డైరెక్టర్ సతీష్​ రెడ్డి, లారస్ ల్యాబ్స్ ఈడీ వివి రవికుమార్ , గ్లాండ్ ఫార్మా సీఈవో శ్రీనివాస్, ఎంఎస్ఎన్‌ ల్యాబ్స్ సీఎండీ ఎంఎస్ఎన్​ రెడ్డి, అరబిందో డైరెక్టర్ మదన్​మోహన్​ రెడ్డి , హెటిరో గ్రూప్ ఎండీ బి.వంశీకృష్ణ సమావేశంలో పాల్గొన్నారు.