👉మీడియా అకాడమీ చైర్మన్ కు వినతి పత్రం !
J.SURENDER KUMAR,
మీడియా సంస్థల్లో వృత్తి పరంగా మహిళా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) మహిళా సంక్షేమ కమిటీ విజ్ఞప్తి చేసింది.
గురువారం నాడు బి.ఆర్.కె భవన్ లో తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డిని కలుసుకున్న ప్రతినిధి బృందం, మహిళా జర్నలిస్టుల సమస్యలను ఆయన దృష్టికి తెస్తూ, వినతి పత్రాన్ని అందించింది.
ప్రతి మీడియా సంస్థలో మహిళలకు 33 శాతం అక్రెడిటేషన్లు ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ పలు మీడియా సంస్థలు దానిని అమలు చేయడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా జర్నలిస్టులకు తమ వాటా ప్రకారం అక్రెడిటేషన్లు ఇచ్చే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని వారు కోరారు.
ప్రతి మీడియా సంస్థలో ఇంటర్నల్ కంప్లెంట్స్ కమిటీ ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ అది కూడా అమలు కావడం లేదని వారు విచారం వ్యక్తం చేశారు. విశాఖ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి మీడియా సంస్థలోనూ జెండర్ సెన్సిటివిటీ వర్క్ షాప్స్ జరగాలనే నిబంధన కూడా కాగితాలకే పరిమితమైందన్నారు. ఇప్పటినుంచైనా విశాఖ గైడ్లైన్స్ ప్రతిచోటా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఐసీసీ గైడ్లైన్స్ పాటించని సంస్థలకు అక్రెడిటేషన్లు ఇవ్వరాదనే నిబంధనను తీసుకురావాలన్నారు. ఐసీసీలో ఇచ్చే ప్రతి కంప్లైంట్ మీడియా అకాడమీ దృష్టికి కూడా తీసుకువచ్చేలా అకాడమీ ఆవరణలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలని వారు కోరారు.
తమ సంస్థలో పని చేస్తున్న మహిళా ఉద్యోగుల జాబితాను ప్రతి మీడియా సంస్థ కచ్చితంగా ఆరు నెలలకోసారి మీడియా అకాడమీకి సమర్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో మహిళా జర్నలిస్టులకు 33 శాతం రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేయాలని, అక్రెడిటేషన్ లతో సంబంధం లేకుండా మహిళా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు మంజూరీ చేయాలన్నారు.
ఆయా మీడియా సంస్థలు పూర్తి స్థాయి మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంపును ఆరు నెలలకోసారి నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. మీడియా సంస్థల్లో పనిచేసే మహిళ ఉద్యోగులకు రాత్రివేళల్లో తప్పనిసరిగా రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, ఇబ్బందులు, మహిళా జర్నలిస్టుల భద్రత, ఇతర సమస్యల పరిష్కారానికి మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతినిధి బృందం కోరింది.
పైఅంశాలపై ప్రభుత్వంతో చర్చించి, విధివిధానాలను రూపొందించి, మహిళా జర్నలిస్టుల సంక్షేమానికి భరోసా కల్పించాలని మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డిని వారు విజ్ఞప్తి చేశారు.
మహిళా జర్నలిస్టుల సమస్యలపై చైర్మన్ సానుకూలంగా స్పందించారు. ఈ ప్రతినిధి బృందంలో టీయూడబ్ల్యూజే మహిళా సంక్షేమ కమిటీ బాధ్యులు కళ్యాణం రాజేశ్వరీ, అత్తలూరి అరుణ, అజితా, వంగ యశోద, సూర్యకుమారి, ప్రతిభ, సాజిదా బేగంలు ఉన్నారు.