ఫీజు రీయంబర్స్ పై ఉద్యమిస్తాం కేంద్ర మంత్రి బండి సంజయ్ !

👉 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి !

👉 దీన్ దయాళ్ కోచింగ్ సెంటర్ ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు కేంద్ర మంత్రి సన్మానం !


J.SURENDER KUMAR,

విద్యార్థుల ఫీజు రీయంబర్స్ మెంట్ మెత్తాన్ని సంక్రాంతి లోగా చెల్లించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఆదివారం స్థానిక ఎంపీ కార్యాలయంలో ‘దీన్ దయాళ్’ పేరిట తాను నిర్వహించిన కోచింగ్ సెంటర్ లో చదువుకుని ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులను బండి సంజయ్ సన్మానించారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అభినందించారు.

👉 ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు రాగుల నగేశ్ (జూనియర్ లెక్చరర్), అమర్ నాథ్ యాదవ్ (స్కూల్ అసిస్టెంట్), రాజశేఖర్, వెంకటేశ్ (సీఆర్పీఎఫ్), కార్తీక్, ప్రియాంక (గ్రూప్ 4) మాట్లాడుతూ
‘‘ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది మాతోసహా ప్రతి పేద విద్యార్థుల కల. డబ్బుల్లేక, కోచింగ్ తీసుకునే స్తోమత లేక ఆ కల నెరవేరుతుందో లేదోనని ఆందోళన చెందాం… అదే సమయంలో లోకసభ సభ్యులు బండి సంజయ్ మా కోసం ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఉచిత భోజన, వసతి కల్పించారు. లక్షల వ్యయమయ్యే కోచింగ్ ను ఉచితంగా అందించారు.
సొంత ఖర్చులతో వారు నిర్వహించిన ఉచిత కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందడం ద్వారా మేము ఈరోజు ఉద్యోగం సాధించగలిగాము.. అందుకు ఆయనకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు.

👉 ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ..

హైదరాబాద్ వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకునే స్థోమత లేని నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడంవల్లే ఈరోజు పలువురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.

👉 రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, బిశ్వాల్ కమిటీ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించి 4 ఏళ్లయినా… వాటిని గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం భర్తీ చేయలేక పోయాయని ఆరోపించారు.

👉 అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మాట తప్పిందని విమర్శించారు.

👉 రాష్ట్రంలో కేవలం 25 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి, 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల నిరుద్యోగులు ఉద్యోగాలు రాని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొనడం బాధాకరమన్నారు.

👉 కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2022 అక్టోబర్ లో ప్రకటించిందని, ఇచ్చిన మాట మేరకు ఇప్పటి వరకు 9.25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

👉 యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగులకు ఇచ్చిన హమీలన్నింటినీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇస్తామని చెప్పి మాట తప్పిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

👉 నిరుద్యోగ భృతి కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక్కో నిరుద్యోగికి రూ.48 వేలు బకాయి పడిందన్నారు. వెంటనే ఆ బకాయిలన్నింటినీ చెల్లించాలని, తక్షణం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని..లేనిపక్షంలో బీజేపీ పక్షాన ఆందోళనలు తప్పవన్నారు.

👉 ఫీజు రీయంబర్స్ మెంట్ అందక లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని, బకాయిల భారం మోయలేక యాజమాన్యాలు కాలేజీలు మూసుకునే దుస్థితి ఏర్పడిందన్నారు.

👉 ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న కళాశాల యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నాయన్నారు. ఫలితంగా ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యాల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నరని తెలిపారు.

👉 ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి టెండర్లను ఆహ్వానించిన నరేంద్రమోదీ ప్రభుత్వానికి సంజయ్ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు కేంద్రం ఇచ్చిన సంక్రాంతి కానుకగా ఆయన అభివర్ణించారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి దాదాపు ₹18 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారని ఆ మొత్తాన్ని కేంద్రం భరించేందుకు సిద్దంగా ఉందని చెప్పారు.

👉 మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గు చేటని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న పదేళ్లు సూపర్ ప్రధానిగా సోనియాగాంధీ కొనసాగుతూ ఆయనను రబ్బర్ స్టాంప్ గా మార్చిన విషయాన్ని కాంగ్రెస్ మరిచిపోయినట్టుంద న్నారు. ప్రధానిగా మన్మోహన్ ప్రభుత్వం ప్రజాప్రతినిధ్యం చట్టంలోని నిబంధనలను సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తే..ఆ ఆర్డినెన్స్ కాపీలను రాహుల్ గాంధీ చింపివేసి ఆయనను దారుణంగా అవమానించింది వాస్తవం కాదా అన్నారు.

👉 కానీ బిజెపి ప్రభుత్వం దేశానికి మన్మోహన్ సింగ్ అందించిన సేవలను గుర్తించి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించడమే కాకుండా, ఆయనకు ఢిల్లీలోనే స్మారక స్థల్ నిర్మించేందుకు సిద్దమైందన్నారు.

👉 గతంలో ప్రధానిగా పనిచేసిన పీవీ నర్సింహరావు మరణించిన సమయంలో ఆయన అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించకుండా అవమానించిన కాంగ్రెస్ నేతలకు మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత లేదన్నారు.