ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ !

👉 ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ సాంకేతిక తో..

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…


J.SURENDER KUMAR,


తెలంగాణలో అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించాలన్న లక్ష్యంతోనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  చెప్పారు.


👉 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తో పాటు ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.


👉 ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యం ఎంత గొప్పదైనప్పటికీ అమలులో లోపాలుంటే ప్రభుత్వంపై విశ్వసనీయత దెబ్బతింటుంది. పేదవారికి అన్యాయం జరుగుతుంది. అందుకే సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి ఏ ఒక్క ఇళ్లు కూడా అనర్హులకు చెందకూడదని ప్రత్యేకంగా యాప్ అందుబాటులోకి తెచ్చామని ఈ సందర్భంగా వివరించారు.


👉 ఇందిరమ్మ ఇండ్లను ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తాం. అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత కింద ఇండ్ల కేటాయింపు జరుగుతుంది.


👉 ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్‌… ఈ క్రమంలో ప్రాధాన్యత ఇస్తూ ఇండ్లను కేటాయిస్తాం.


👉 ఉన్న స్థలాన్ని గరిష్టస్థాయిలో వినియోగించుకుని నిర్మించుకునేలా లబ్దిదారుల కోసం ప్రతి మండల కేంద్రంలో ఒక నమూనా ఇంటిని నిర్మించి చూపిస్తాం. అచ్చం అలాగే కట్టాలని కాకుండా అవగాహన కోసం మాడల్ హౌజ్‌ను చూపిస్తాం.


👉 తొలి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్ల కేటాయింపులో భాగంగా మొత్తంగా 4.50 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి ₹. 5 లక్షల చొప్పున నిధులకు పరిపాలనా అనుమతులు ఇచ్చాం.


👉 ఆదివాసీలు, ఆదివాసీ తండాలు (ఐటీడీఏ తండాలకు) జనాభా ప్రాతిపదికన ప్రత్యేకంగా పరిశీలించి అదనంగా కొన్ని వేల ఇండ్లను నిర్మిస్తాం. ఇప్పుడు కేటాయించిన ఇండ్లు కాకుండా ఆదివాసీలకు ప్రత్యేక కోటా ఇస్తామన్నారు.


👉 గతంలో రుణాలు తీసుకుని ఇండ్లు కట్టుకున్న 7 వేల కుటుంబాల రుణాలను కూడా ప్రభుత్వం తీర్చి వారిని రుణ విముక్తులను చేస్తుంది.


👉 పెరిగిన ధరలు, పేదవాడి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి ఇండ్లు కట్టుకోవడానికి అండగా నిలవాలని ఈ పథకం తీసుకొచ్చింది. పెరిగిన ధరలు, పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పేద వాడికి 5 లక్షలు ఇచ్చి ఇండ్లు కట్టుకోవడానికి ప్రోత్సహిస్తుంది. 


👉 2004 నుంచి 2014 వరకు 25.04 లక్షల పేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరిగింది. 2014 – 2023 కాలంలో 1. 52 లక్షలు డబుల్ బెడ్రూమ్ ల నిర్మాణం చేపడితే వాటిల్లో 60 నుంచి 65 వేల ఇండ్లు మాత్రమే పూర్తి చేయగా, అర్థాంతరంగా వదిలేసిన ఇండ్లను పూర్తి చేయడానికి ప్రజా ప్రభుత్వం ₹ 195 కోట్లను కేటాయించింది.


👉 పేదలకు వెసులుబాటు కల్పిస్తూ విధివిధానాలను నిర్ణయించాం. అదనంగా ఒక గది కట్టుకుంటామంటే అందుకు వెసులుబాటు కల్పించాం.


👉 ఇదొక పండుగ సందర్భం. ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఆత్మగౌరవంతో బతకాలన్నది ప్రతి ఒక్కరి కల. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటిముందు వెలుగుల్లో పండుగ చేసుకునే సందర్భమిది.


👉 ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు , పొన్నం ప్రభాకర్ , ఇతర ప్రజా ప్రతినిధులు, సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఇతర అధికారులు పాల్గొన్నారు.